PDPL: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు రూ.21 కోట్ల 98 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. మే నెలలో నిర్వహించే సరస్వతి నది అంత్య పుష్కరాల కోసం కలెక్టర్ పరిధిలో మూడు పనులకు రూ.6 కోట్లు, పోలీస్ శాఖకు 8 పనులలో రూ.కోటి 25 లక్షలు, అటవీ శాఖలో రూ.30 లక్షలు, ఎంబీ ఇంట్రాలో 30 పనులకు రూ.1.50 లక్షలు, ఆర్ అండ్ బీలో ఐదు పనులకు రూ.51 లక్షలు మంజూరయ్యాయి
MDK: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణం నవాబ్పేటలోని ఈద్గా వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పరిశీలించారు. పండగ రోజున ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. పరిశుభ్రత, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.
ADB: జిల్లాలో ఓటరు మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి సర్వే సమయంలో ఇంట్లో ఎవరు లేని పక్షంలో బి.ఎల్.ఓలు కనీసం మూడుసార్లు ఆ ఇంటిని సందర్శించాలని ఆదేశించారు.
NRML: బాసర IIITలో జరుగుతున్న ‘అంతఃప్రజ్ఞా-2026’ వేడుకల్లో భాగంగా ఎవరెస్ట్ విజేత మాలవత్ పూర్ణ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ఆమె స్ఫూర్తిని నింపారు. అడ్డంకులను చూసి భయపడకుండా లక్ష్యాల వైపు సాగాలని పిలుపునిచ్చారు.
ASF: సిర్పూర్ మండలం కోనేరు కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో డోర్ పల్లి గ్రామానికి చెందిన రక్షిత్, రవి గాయపడినట్లు 108 EMT అజయ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సిర్పూర్ PHC కి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించినట్లు వెల్లడించారు.
హన్మకొండ: హసనపర్తి మండల కేంద్రంలోని మసీద్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్నం అయిందని యజమాని రాజు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న చేరాల సీఐ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలు అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో సుమారు 5 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
HYD: నగరంలో ప్రజా పాలన, పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం వాణిజ్య సముదాయాలను జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేశారు. అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశంపై ఆరా తీశారు. మొత్తం 252 భవనాలను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేశారు. సెల్లార్లలో ప్రమాదకర పదార్థాలను నిల్వ చేయవద్దని యజమానులను హెచ్చరించారు.
KMM: బీరోలు గ్రామానికి చెందిన బద్దిపూడి రాములు, రాణి దంపతుల కుమారుడు వెంకటేష్ (21) చెరువులో పడి మృతి చెందినట్లు శనివారం స్థానికులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం గ్రామంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. సమాచారం అందుకున్న మోతె పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: జిల్లా కలెక్టర్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే శ్రీరామ నవమి వేడుకలకు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (CSR) కింద సహకరించాలని కలెక్టర్ అంకిత్ కోరారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు తాగునీరు, అన్నదానం, వసతి, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కల్పించడంలో సంస్థలు భాగస్వాములు కావాలన్నారు.
MHBD: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని కేసముద్రం సీఐ సత్యనారాయణ అన్నారు. ఇనుగుర్తి మండలంలోని రాము తండా సర్పంచ్ భూక్యా మీటు నాయక్ తన సొంత ఖర్చుతో గ్రామంలో ఆరు సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రజా ప్రతినిధులు, దాతలు ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
WGL: గ్రామాల్లో వలసలు నివారించి స్థానికులకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పతకం ప్రవేశపెట్టింది. ఉపాధి హామీ పనిచేసే కూలీలకు పని ప్రదేశంలో మంచినీటి సౌకర్యం, నీడ, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి. కానీ దానికి భిన్నంగా అధికారులు వ్యవరిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ADB: ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో మేనేజర్ విధులు నిర్వహిస్తున్న శ్యామల అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని శనివారం అవార్డును పొందారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సినీనటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. మహిళల అభివృద్ధికి పాటుపడుతున్న కృషికి గాను ఈ అవార్డును అందుకున్నట్లు ఆమె తెలిపారు.
JGL: సెర్వికల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి బాలికలను రక్షించేందుకు 13 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా తప్పనిసరిగా వేయించాలని జిల్లా ఉప వైద్యాధికారి డా.ఎన్.శ్రీనివాస్ తెలిపారు. శనివారం రాయికల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న హెచ్పీవీ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
SRPT: క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం రేపు ఉదయం 9 గంటలకు, అనంతగిరి మండలం శాంతినగర్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి శ్రీనివాసరావు శనివారం రాత్రి తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఆధార్ కార్డు, ఆన్లైన్ అప్లికేషన్ కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని ఆయన సూచించారు.
భద్రాద్రి: సాగుకు పనికిరాని, నీటి వనరులు లేని భూముల్లో రైతులు పీఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రెడ్కో మేనేజర్ పి.అజయ్ కుమార్ తెలిపారు. రైతులు సమయానికి దరఖాస్తు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని సూచించారు.