గూగుల్ సంస్థతో ఎయిర్టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS)కు ప్రత్యామ్నాయంగా రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS)ను అందించేలా ఈ డీల్ ఉండనుంది. రీడ్ రిసీప్ట్లు, ఫైల్ షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఫీచర్లను యూజర్లకు RCS అందించనుంది. అటు గూగుల్ ఇంటెలిజెంట్ స్పామ్ ఫిల్టర్లో భాగస్వామి అయ్యేందుకు ఎయిర్టెల్ అంగీకరించింది.
గత కొంత కాలంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను టార్గెట్ చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల రక్షణ కోసం సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ మధ్యవర్తులు చెప్పే లాభాల గణాంకాలను స్వతంత్రంగా ధృవీకరించేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా ‘పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్’ ఏజెన్సీని ఆవిష్కరించింది.
ఇండిగో (ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ మొదట్లో 7 శాతం విలువ కోల్పోయాయి. ఉదయం 10 గంటల సమయానికి 4.08 శాతం నష్టంతో రూ.5,151 వద్ద షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో మదుపర్లు అభద్రతా భావంతో ఈ షేర్ల నుంచి పెట్టుబుడులు వెనక్కి తీసుకుంటున్నారు.
AP: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 9 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.
బీటెక్ సీట్లు పెంచుకోవాలంటే కచ్చితంగా మూడు కోర్ ఇంజినీరింగ్ బ్రాంచ్ కోర్సులు తప్పనిసరిగా ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతుల విధాన పత్రాన్ని తాజాగా విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్కు సంబంధం లేనివి కనీసం రెండు కోర్ బ్రాంచీలు ఉంటేనే అదనపు సీట్లు మంజూరు చేస్తామని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ‘క్లాట్-2026’ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతిష్టాత్మక న్యాయవిద్య యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్-2026) నిర్వహిస్తున్నారు. HYDలోని నల్సార్ వర్సిటీ, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీలో సీట్లను కూడా ఈ పరీక్ష ర్యాంకర్లతో భర్తీ చేయనున్నారు.
AP: నీట్లో అమ్మాయిలు సత్తా చాటారు. 2025-26 విద్యా సంవత్సరంలో MBBS ప్రవేశాల్లో 60.72 శాతం సీట్లు అమ్మాయిలకే దక్కాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి అమ్మాయిల ప్రవేశాలు 3.66 శాతం పెరిగాయి. NTR ఆరోగ్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాల ప్రక్రియ ముగిసింది.
TG: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ వారంలో ప్రారంభిస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. పాత సీట్లతోపాటు కొత్తగా మంజూరైన 420 పీజీ సీట్లను భర్తీ చేస్తామని, ఏయే కళాశాలలో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయో వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
TG: డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. యూపీఐ లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే 33 శాతం పెరిగి, దక్షిణ భారతదేశంలోని ఇతర నగరాలకంటే ముందంజలో నిలిచింది. సర్వే ప్రకారం నగరాల్లో 52% ట్రాన్సాక్షన్లు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రజల విశ్వాసం పెరుగుతుండడంతో హైదరాబాద్ నగదు రహిత వాణిజ్యం వైపు వేగంగా సాగుతోంది.
TG: కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా కె.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల కాళోజీ వర్సిటీలో పీజీ పరీక్ష పత్రాల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో వీసీ నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంఛార్జ్ వీసీగా యాదాద్రి భువనగిరి వైద్య కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న రమేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్(THDC)లో 40 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరి రోజు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. BSc/BTech/BE, MBBS అర్హతగలవారు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.55 వేల జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: thdc.co.in
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. గడువు నిన్నటితో ముగియగా.. DEC 15 వరకు అవకాశమిచ్చారు. సివిల్, కంప్యూటర్, మెకానికల్ తదితర పోస్టులు ఉండగా.. B.Tech/B.E ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: sail.co.in
TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్ను ఎయిర్ పోర్టు సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ప్లైట్లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వ్యవస్థను నిషేధించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. ఈ పద్ధతిలో గిగ్ కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. డైడ్లైన్ను అందుకునేందుకు గిగ్ కార్మికులు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 10 నిమిషాల క్రూరత్వ పద్ధతికి ముగింపు పలకాలని రాజ్యసభలో కోరారు.
భారత్ UPI సేవలు మరిన్ని దేశాలకు విస్తరించనున్నాయి. తాజాగా మరో 8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు వెల్లడించారు. ప్రస్తుతం సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఖతార్, యూఏఈ, మారిషస్ దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యూపీఐ లావాదేవీలను అనుమతించేలా మరో 7-8 దేశాలతో భారత్ చర్చలు జరుపుతోందని నాగరాజు తెలిపారు.