HNK: రాష్ట్రంలో EVMల భద్రతను మరింత బలోపేతం చేయడానికి నూతన గోడౌన్ నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవాళ సుబేదారి ప్రాంతంలోని రెడ్ క్రాస్ సమీపంలో EVM, VVPAT యంత్రాలను భద్రపరిచేందుకు నిర్మించిన నూతన గోడౌన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.
NZB: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16వ తేదీన జరిగే మండల స్థాయి సభలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఈమేరకు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామ సభలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు
HYD: ఆపదలో ఉన్న చిన్నారిని తన సమయస్ఫూర్తితో రక్షించిన మహ్మద్ ఫిరోజ్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు. బషీర్ బాగ్లోని పాత సీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి ఫిరోజ్ను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే గుణం సమాజానికి ఆదర్శమని కొనియాడారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల సోమారం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ వైస్ ఛైర్మన్ జక్కుల రాజిరెడ్డి ప్రారంభించారు. సొసైటీ వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, పండించిన వరి ధాన్యం దళారులకు విక్రయించవద్దని కోరారు. కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని అమ్మి లాభాలు పొందాలని సూచించారు.
BHNG: గ్రామ అభివృద్ధికి, వార్డు సభ్యుల విధులు పూర్తిగా తెలుసుకునేందుకు శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని ఎంపీడీవో నాగవేణి, ఎంపీవో ఆవుల కిషన్లు అన్నారు. సోమవారం రాజాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పాలనపై 2వ బ్యాచ్ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 4 నుంచి 10వ తేది వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతావని అన్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని 39వ డివిజన్ నివాసి సోమవారం గ్రీవెన్స్ సెల్లో విన్నవించారు. ఇటీవల దాడులు పెరిగి జనం గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల తరలింపునకు, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుని నగరవాసులను రక్షించాలని వినతిపత్రం సమర్పించారు.
KMM: TGSRTC వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి సోమవారం మధిర డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా మధిరలో నిర్మాణంలో ఉన్న నూతన బస్టాండ్ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం తాత్కాలిక బస్టాండ్, డిపో గ్యారేజీని సందర్శించి, నిర్వహణ విధానంపై సంబంధిత అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
NGKL: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం HYD నుంచి బయలుదేరి 9:30 గంటలకు కల్వకుర్తి చేరుకుంటారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
RR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కేశంపేటలో ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో గ్రామ పంచాయతీలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. మానవహారం ఏర్పాటు చేసి నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.
MDK: తూప్రాన్లో టీజీ యూఈఈయు (సీఐటీయు) జిల్లా అధ్యక్షులు మన్నె నర్సింహులు విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సంస్థలో 20, 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆర్టిజన్లు, ఇతర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీవీఏఈ జెఎసీ ఇచ్చిన పిలుపుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ NPDCL కార్యాలయం ముందు జరిగే ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ పోటీలకు ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. విద్యార్థులు పార్లమెంటరీ విధానాలపై ప్రదర్శించిన ప్రతిభను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.
GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం HPV వ్యాక్సిన్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఓ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలు టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. అభిమానుల సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, వారిని శాలువాతో సత్కరించారు.
BHNG: అమ్మనబోలులో సోమవారం ఆది జాంబవ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన క్యాసగల్ల మల్లేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRPT: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ఆన్లైన్ ఫీజు మాత్రమే చెల్లించాలని సూచించారు. ఎవరైనా అదనపు డబ్బులు అడిగితే మున్సిపల్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
MHBD: కాంగ్రెస్ జిల్లా నూతన కమిటీని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉమా మురళి కొనసాగుతుండగా, వైస్ ప్రెసిడెంట్లుగా బండి శ్రీనివాస్ గౌడ్, గుగులోత్ రవి నాయక్, వెంకటేశ్వర్లు, బైరు అశోక్ గౌడ్ను నియమించారు. వీరితో పాటు జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్, సెక్రటరీ, స్పొక్ పర్సన్ పేర్లను ప్రకటించారు.