కరీంనగర్ జిల్లాలోని 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియ బుధవారం నాటికి 96% పూర్తయిందని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా తెలిపారు. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి రాగా 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
PDPL: మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారిని దర్శించుకున్నారు. గణపతికి దూర్వాలు, మోదకాలు, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించి సంకటాలు తొలగాలని ప్రార్థించారు. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చిన ఈ చతుర్థి విశేష పుణ్యప్రదమైనదిగా భావిస్తారు.
SDPT: హుస్నాబాద్ పందిళ్ళ జాతీయ రహదారిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన మారపల్లి తిరుపతి(30) తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్ ద్వారా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
BDK: ములకలపల్లి మండల కేంద్రంలోని PHC దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న రెగ్యులర్ డాక్టర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బుధవారం డిమాండ్ చేస్తూ DMHOకు వినతి పత్రం అందజేశారు. మండలంలోని ప్రజలకు, గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించాలని AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్, AIYF జిల్లా సహాయ కార్యదర్శి అనుముల సాయి అన్నారు.
ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రత బుధవారం కొనసాగింది. మధిరలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా వేంసూరు, సత్తుపల్లి, కూసుమంచి మండలాల్లో 40.2 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొణిజర్ల (గుబ్బగుర్తి)లో 43.5, ఖమ్మం రూరల్ (పల్లెగూడెం)లో 43.4, ముదిగొండ (పమ్మి)లో 43.3, బోనకల్ రావినూతల, ఖమ్మం అర్బన్లో 43.2, డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
NGKL: వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులకు వ్యవసాయ శాఖ శుభవార్త తెలిపింది. పెంట్లవెల్లి మండలంలో 50 శాతం సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు ఏవో హెచ్. వికాస్ తెలిపారు. PACS కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతోంది. 30 కిలోల బస్తా ధర రూ.4,905 కాగా, సబ్సిడీతో రూ.2,452.50కి రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు.
WNP: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన యువత కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పీ. మధు తెలిపారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఈ నెల 6న ఐడీఓసీ (IDOC) మీటింగ్ హాలులో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
JN: జిల్లాలో ఇసుకను పారదర్శకంగా, వేగంగా అందించేందుకు రూపొందించిన ‘ఈ-సాండ్ బుకింగ్ పోర్టల్’ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం, ప్రజలకు సులభంగా ఖనిజాల సరఫరా చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అన్నారు. వినియోగదారులు ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని, రవాణా ప్రక్రియను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ బైపాస్ గాయత్రి మిల్క్ ప్లాంట్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టాటా నెక్సాన్ కారు, హీరో స్ప్లెండర్ బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బీహార్కు చెందిన రోషన్ కుమార్ (24), యూపీకి చెందిన పంకజ్ (19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
HNK: టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్- 2026లో భాగంగా లష్కర్ బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఏసీజీ మధుసూదన్ రావు, కోర్స్ ఇంఛార్జ్ విజయ్ మోహన్, కోర్స్ డైరెక్టర్ నయీమ్ పాషా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులలోని సృజనాత్మకత, నైపుణ్యం, అంకితభావం, స్నేహభావం ఈ కార్యక్రమం ద్వారా ప్రతిబింబించాయన్నారు.
GDWL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అవగాహన కల్పించేందుకు అయిజ మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ జ్యోతి తెలిపారు. ఈనెల 4న చిన్న తాండ్రపాడులో గ్రామసభ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.
MDCL: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాయిప్రియ కాలనీలో ఓ మైనర్ బాలికతో వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక స్టేట్మెంట్ కోసం భరోసా సెంటర్కు తరలించగా, ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
MHBD: కురవి మండలకేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని డైరెక్టర్ ప్రొటోకాల్ జీఏడీ శివలింగయ్య (IAS) దంపతులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మి- రాజునాయక్, తహసీల్దార్ విజయ, తదితరులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు.
WGL: నగరంలోని కాశిబుగ్గలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఒంటరిగా వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని, కుక్కలు దాడుల్లో ఇటీవల పలువురు గాయపడిన ఘటనలు సైతం ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు విషయాన్ని గమనించి శునకాల బెడద తీర్చాలని కోరుతున్నారు.
KMM: రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మత్కేపల్లి ఏఎంసీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం చింతకాని మండల కేంద్రంలో MRO బాబ్జి ప్రసాద్ అధ్యక్షతన మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.