శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం సప్తమి: రా.7:08 తదుపరి అష్టమి ధనిష్ఠ: రా.10:22 తదుపరి శతభిష వర్జ్యం: తె.5:32 నుంచి అమృత ఘడియలు: ఉ.11:47 నుంచి 1:24 వరకు దుర్ముహూర్తం: ఉ.9:56 నుంచి 10:41 వరకు తిరిగి మ.2:22 నుంచి 3:06 వరకు రాహుకాలం: మ.1:30 నుంచి 3:00 వరకు సూర్యోదయం: ఉ.6:15; సూర్యాస్తమయం: సా.5:20.
AP: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా గర్భగుడి దర్శనం చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నవారికే గర్భగుడి దర్శనం లభించేది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పట్లు డబ్బు చెల్లించలేని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
KKD: సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కరప సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చాగంటి వెంకటరావు తెలిపారు. 10 వేల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేసి, ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా టికెట్లు విడుదలవుతాయని ప్రకటించారు.
AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఇవాళ జరిగే పంచమీ తీర్థంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 50 వేల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో దాదాపు 150 అన్నప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం 63 LED స్క్రీన్లు అమర్చారు.
KKD: శంఖవరం మండలం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం జరిగే రధోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వారాంతం కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు రధోత్సవ సేవను తిలకించి పునీతులయ్యారు. ఉదయం నుండచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేరళలో అయ్యప్ప దర్శనాలు జరుగుతున్న వేళ బ్రెయిన్ ఫీవర్ టెన్షన్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. నదిలో స్నానాలు చేసే వేళ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కాగా, కేరళలో నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారినపడగా.. వారిలో 8 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తొలి వారంలోనే ఏకంగా 5.75 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజు సాయంత్రానికే 72 వేలమందికి పైగా భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. రద్దీ నిర్వహణ, సౌకర్యాలపై ట్రావెన్కోర్ బోర్డు అధికారులతో మంత్రి వీఎన్ వాసవన్ ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు.
కోనసీమ: అమలాపురం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు మార్గశిర మాసం శుక్ల విదియ శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,86,015 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 286 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 11 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. 2,816 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో స్వామికి సింధూరం, ఆకుపూజ, మహా మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం డి. హిరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి పురోహితులు పవన్ కుమార్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి పంచామృతం, కుంకుమ అర్చనలు చేపట్టి పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రం నుంచి సైతం భక్తులు పాల్గొని, దర్శించుకున్నారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. స్పాట్ బుకింగ్ పెంచుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. భక్తుల రద్దీని బట్టి బుకింగ్ పెంచుకోవచ్చని సూచించింది. అయితే, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు పేర్కొంది.