AP: దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈనెల 24న స్వామి వారి కల్యాణం, 25న రథోత్సవం జరగనుంది. ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
TG: ఆదిలాబాద్లో నాగోబా జాతర ప్రారంభమైంది. అర్థరాత్రి పవిత్ర గంగాజలంతో అభిషేకించి మెస్రం వంశీయులు నాగోబా మహా పూజ చేశారు. ఈ క్రమంలో మెస్రం వంశీయులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. మహా పూజ తర్వాత కొత్త కోడళ్ల బేటింగ్ పూర్తి చేశారు. అయితే ఈనెల 22 తేదీన నాగోబా ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. కాగా ఈ నెల 25 వరకు జాతర కొనసాగనుంది.
మాఘమాసం అత్యంత పవిత్రమైనది. ఇవాళ్టి నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘం అంటే పాపాలను తొలగించేది అని అర్థం. ఈ మాసం శ్రీమహావిష్ణువుకు, సూర్య భగవానుడికి, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం, బావి స్నానం చేస్తే మహా పుణ్యప్రదమని నమ్ముతారు. ముఖ్యంగా మాఘ మాసంలో వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. మాఘ మాసాన్ని శుభకార్యాల మాసమని అంటారు.
TG: వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ భారీగా ఉంది. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.
AP: ఏప్రిల్ కోటా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఉ.10 గంటలకు TTD విడుదల చేయనుంది. 21న ఉ.10 గంటల వరకు ఆన్లైన్లో ఈ-డిప్కు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న మ. 12 గంటల్లోపు డబ్బులు చెల్లించాలి. 22న ఆర్జిత సేవ టికెట్లు, 23న అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న అకామిడేషన్, రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.
మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ కొన్ని నియమాలు పాటించాలని వేద పండితులు చెబుతున్నారు. కోపం తెచ్చుకోవడం, మద్యం, మాంసం తినడం చేయకూడదు. గొడవ పెట్టుకోవడం, అనవసర సంభాషణలు, అబద్ధాలు చెప్పడం.. నెగిటివ్ థింకింగ్ పూర్తిగా మానేయాలి. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. క్షుద్ర పూజలు చేసే వారికి అమృత ఘడియలు. చిన్నపిల్లలతో బయటకు అస్సలు పోకూడదు.
AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఏప్రిల్ నెల కోటా టికెట్లు 19న 10AMకు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. లక్కీడిప్ కోసం 21న 10AM వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే 24న 10AMకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 కోటాను విడుదల చేస్తారు. భక్తులు టికెట్లను TTD సైట్లోనే బుక్ చేసుకోవాలని, ఇతరులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు.
శని బాధలు, పితృ దోషాలతో సతమతమవుతున్నారా? అయితే రేపు వచ్చే ‘మౌని అమావాస్య’ చక్కటి పరిష్కారం. ఈరోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి, పితృదేవతలకు తర్పణాలు వదిలితే పితృదోషాలు తొలగిపోతాయి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఈ రోజు మౌన వ్రతం పాటిస్తూ లక్ష్మీనారాయణులను పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
TG: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సంక్రాంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిన్న గోదా రంగనాథ స్వామి కళ్యాణం, ఇవాళ అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు రథంపై తిరువీధుల్లో విహరించారు. ఆలయ ఈవో పూజలు చేసి ఈ రథయాత్రను ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం జరిగే విశ్వరూప సేవతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
AP: తిరుమల శ్రీవారి పార్వేట ఉత్సవం ఈ నెల 16న కనుమ రోజు వైభవంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 5.30 నుంచి 6.30 గంటల మధ్య ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్దజీయర్ మఠం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మలయప్ప, శ్రీకృష్ణ స్వామివార్లు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు.
సంక్రాంతి రోజున దైవారాధన ఎంత విశేషంగా చేస్తారో, అదేవిధంగా పితృదేవతలకు తర్పణాలు, దానాలు చేయడం ఆచార వ్యవహారాల్లో ఓ భాగం. అందువల్ల ఈ రోజు చేసే దానాలకు అనేక రెట్లు పుణ్యఫలం దక్కుతుంది. అందుకే ఈ పెద్ద పండుగ రోజున గోదానం, భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తక దానం, బియ్యం, పప్పూఉప్పూ, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే శుభఫలితాలు చేకూరతాయట.
కేరళలోని శబరిమల ఆలయంలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడుపై మకర జ్యోతి కనువిందు చేస్తోంది. మకరజ్యోతి దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో శరణుఘోషతో శబరిమల మార్మోగుతుంది.
సంక్రాంతి వెనుక దాగున్న సైన్స్ తెలుసా? భూమి, సూర్యుడి గమనం ఆధారంగా 27 నక్షత్రాలను 12 రాశులుగా విభజించారు. సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడాన్నే ‘సంక్రాంతి’ అంటారు. ఇలా ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. అయితే, సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టినప్పుడు వాతావరణంలో కీలక మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ ‘మకర సంక్రాంతి’కి అంతటి ప్రాముఖ్యత.
భోగి మంటల వెచ్చని వెలుగులు.. ముంగిట ముగ్గుల రంగవల్లులు.. గొబ్బెమ్మల అందాలు.. హరిదాసుల కీర్తనల మధ్య మన సంప్రదాయ వైభవం పురుడుపోసుకుంది! ఈ భోగి మంటలు మీలోని ప్రతికూలతలను దహించి, మీ ఇంట సుఖసంతోషాల కొత్త కాంతులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా HIT TV ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; హేమంత రుతువు, పుష్యమాసం, బహుళపక్షం ఏకాదశి: సా.6:03 తదుపరి ద్వాదశి; అనూరాధ: తె.3:38 తదుపరి జ్యేష్ఠ; వర్జ్యం: ఉ.7:14 వరకు; అమృత ఘడియలు: సా.4:07 నుంచి 5:53 వరకు; దుర్ముహూర్తం: ఉ.11:46 నుంచి 12:31 వరకు; రాహుకాలం: మ.12:00 నుంచి 1:30 వరకు; సూర్యోదయం: ఉ.6:38; సూర్యాస్తమయం: సా.5:40; భోగి పండగ, మకర సంక్రమణం రాత్రి 9-11.

