శబరిమల అయ్యప్ప ఆలయం నిన్న సాయంత్రం తెరుచుకున్న నేపథ్యంలో భక్తులకు స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులను ఇవాళ తెల్లవారుజాము నుంచే దర్శనాలకు అనుమతిస్తున్నారు. డిసెంబర్ 27 వరకు ఆలయం తెరిచే ఉంటుందని.. ఆ తర్వాత డిసెంబర్ 30- జనవరి 20 తేదీల్లోనూ దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
రేపు కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం. ఈ రోజున భక్తిశ్రద్ధలతో శివారాధన చేయడం ద్వారా కోటి సోమవారాల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయాన్ని సందర్శించి శివుడికి రుద్రాభిషేకం చేయించడం, బిల్వ పత్రాలు సమర్పించడం చాలా శుభప్రదం. ఇంటి వద్ద అయితే, పరమశివుడికి దీపారాధన చేస్తే శివానుగ్రహం లభించి, మనోభీష్టాలు నెరవేరుతాయి.
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను, నిజాభిషేకాలు, కళ్యాణోత్సవాలు నిర్వహించారు. రాత్రి స్వామి వారి సన్నిధిలో కార్తీక దీపోత్సవం చేపట్టారు.
MDK: పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకొని శనివారం సాయంత్రం ఆకాశదీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
AP: ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈ నెల 18వ తేదీ ఉ.10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటి ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం 20న ఉ. 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ టోకెన్లనూ ఇదే విధానంలో నమోదు చేసుకున్నాక ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీచేస్తారు.
NGKL: అచ్చంపేట మండలం శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని ఆదివారం సినీ హీరో మహేష్ బాబు సోదరి వారి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి అర్చకులు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు, కార్తిక మాసం, బహుళపక్షం ద్వాదశి: తె. 5-09 తదుపరి త్రయోదశి హస్త: తె. 3-34 తదుపరి చిత్త వర్జ్యం: ఉ. 10-58 నుంచి 12-40 వరకు అమృత ఘడియలు: రా. 9-11 నుంచి 10-53 వరకు దుర్ముహూర్తం: సా. 3-51 నుంచి 4-36 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.6.09; సూర్యాస్తమయం: సా.5.21 వృశ్చిక సంక్రమణం రా. 1-22.
ATP: గుంతకల్లు రాజేంద్రనగర్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారికి పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు, వేదమంత్ర పారాయణం, సుప్రభాత సేవ, వివిధ రకాల పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి వెండి కవచంతో ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు.
పండితులు, వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో అరటి చెట్టును పెంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అరటి చెట్టుకు దేవ వృక్షం అనే పేరు ఉంది. ఈ చెట్టుకు రోజూ పూజ చేయడం వలన, నీరు పోయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా అరటి చెట్టును ఇంట్లో సరైన దిశలో నాటితే ఆ కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయి. వివాహ జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.
ATP: గుత్తి కోటలోని అతి పురాతనమైన శ్రీ నగరేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం మూడో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వేకువజామున పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేసి, బిల్వదళాలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తాదులు ఆలయావరణంలో కార్తీకమాసా దీపాలు వెలిగించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలీలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవస్థానంలో ఇవాళ స్వామివారి దివ్య కళ్యాణం జరుగునుంది. యర్నగూడెం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో రావాలని ఆలయ అధికారులు కోరారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు జరిగే కళ్యాణోత్సవాన్ని లైవ్లో ప్రసారం చేయనున్నారు.
E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామ దేవత బంగారు పాపమ్మ ఉత్సవాలు శనివారం నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏటా కార్తీక మాసం ముగింపులో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
AP: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అటు 10 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,283 మంది భక్తులు దర్శించుకోగా.. 22,583 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.54 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో 22వ రోజు కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు , జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, అందజేశారు.