AP: చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాలనికి అరుదైన గుర్తింపు లభించింది. ఆలయం చేస్తున్న నాణ్యమైన పాలన, పారిశుద్ధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తున్నందుకు గాను తాజాగా ISO సర్టిఫికెట్ మంజూరైంది. ఈ మేరకు స్థానిక MLA కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ఛైర్మన్, ఈవోలకు సర్టిఫికెట్లు అందజేశారు.
TG: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. HYD నాచారంలోని HMT నగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 12వేల మంది దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. స్వామివారికి తులసిమాలలు, ప్రసాదాలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ తెరుచుకోనుంది. మకరవిళక్కు కోసం ఆలయాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేయనున్నట్లు ట్రావెన్కోర్ బోర్డ్ తెలిపింది. ముందుగా ఆలయంలో పవిత్ర దీపాన్ని వెలిగించి.. అనంతరం స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. మకరవిళక్కు నేపథ్యంలో భారీగా అయ్యప్ప భక్తులు కొండకు వచ్చే అవకాశం ఉండటంతో.. వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉత్తర ద్వారా తెరుచుకోగా.. సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. రాములోరి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అటు ద్వారకా తిరుమలలోనూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారదర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. గోవింద నామస్మరణతో చిన్న తిరుమల మార్మోగుతోంది.
తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారికి ధనుర్మాస కైంకర్యాల అనంతరం భక్తులను వైకుంఠ ప్రదక్షిణగా అనుమతించారు. కాగా తొలి 3 రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందినవారిని అనుమతిస్తారు. జనవరి 2-8 తేదీల్లో టోకెన్లు లేనివారికీ అవకాశం కల్పిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ప్రాకారాలు, గోపురాలు విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తున్నాయి.
‘వైకుంఠ ఏకాదశి’ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ పర్వదినాన భక్తులు ఉపవాసం, జాగరణ ఉండి, ఆలయాల్లోని ‘ఉత్తర ద్వారం’ గుండా శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారు. ఇలా దర్శనం చేసుకోవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు...
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకుంటారు. రేపు మక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి.
సంతాన ప్రాప్తి కోసం, పిల్లల క్షేమం కోసం ఎదురుచూసే దంపతులకు ‘పుత్రదా ఏకాదశి’ ఒక వరం లాంటిది. ఇవాళ శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, ఉన్నవారి పిల్లలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దీనిని ‘పుత్రులను ప్రసాదించే ఏకాదశి’ అని కూడా అంటారు.
AP: శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమల వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ అర్ధరాత్రి దాటాక శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించిన అనంతరం.. 1:30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకోనున్నాయి. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు, మొత్తం పది రోజులపాటు ఈ దర్శనం కల్పించనున్నారు.
TG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనం కోసం భక్తులకు సుమారు 4 గంటల సమయం పడుతోంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
AP: తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్(SSD) టోకెన్లను ఇవాళ్టి నుంచి రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జనవరి 7వ తేదీ వరకు ఈ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జునభ్రమరాంబ స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దీంతో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు. దర్శనాల క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వరుసగా సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్ల జారీని TTD రద్దు చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ టికెట్ల జారీని నిలిపివేసింది. ఇప్పటికే ఈనెల 30 నుంచి జనవరి 1 వరకు వీటిని రద్దు చేయగా, జనవరి 2 నుంచి 8 వరకు ఉన్న టికెట్ల ఆన్లైన్ విక్రయాలు పూర్తయ్యాయి. తిరిగి జనవరి 9న శ్రీవాణి దర్శన టికెట్లను పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.