• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బక్రీద్ సందర్భంగా చెక్ పోస్టులు ఏర్పాటు: ఎస్పీ

NGKL: ఈనెల 28న నిర్వహించబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో మంగనూరు, మరికల్, కొట్ర జంక్షన్, మున్ననూర్, చారకొండలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా ఆవులను, దూడలను తరలించరాదని, ఎవరైనా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

May 5, 2026 / 10:13 PM IST

వెలిగొండ పనుల పురోగతిపై నిమ్మల సమీక్ష

AP: మార్కాపురం జిల్లా వెలిగొండ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. 2026 సీజన్ మొదలయ్యేలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. వెలిగొండ టన్నెల్స్‌లో లైనింగ్ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు. వెలిగొండ నిర్వాసితులకు త్వరలోనే R&B బిల్లులు జమ చేస్తామన్నారు.

May 5, 2026 / 10:10 PM IST

మదన్ లాల్ మరణం పార్టీకి తీరని లోటు: BRS

KMM: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం ఈర్లపూడిలో నిర్వహించిన మదన్ లాల్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మదన్ లాల్ నిబద్ధత గల నాయకుడని, ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు.

May 5, 2026 / 10:08 PM IST

‘ఆర్యవైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా వాసవి ఫౌండేషన్’

VZM: ఆర్యవైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో వాసవి ఫౌండేషన్ సేవలందిస్తుందని సంఘం అధ్యక్షులు మండవిల్లి వెంకట రాజు పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సముద్రాల గురు ప్రసాద్, గిరిజా ప్రసన్న దంపతులను ఘనంగా సత్కరించారు. సాహిత్య ,సేవ, ఉపాధ్యాయ రంగాలలో అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించారు.

May 5, 2026 / 10:06 PM IST

‘ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సాధించాలి’

KNR: ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని అన్నారు. హుజురాబాద్‌లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సుహాసిని మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.

May 5, 2026 / 10:00 PM IST

దేచవరం చెరువు ఆధునికీకరణపై రైతుల హర్షం

PLD: నకరికల్లు మండలం దేచవరం చెరువు “జలధార–జలహారతి” కార్యక్రమంతో ఆధునికీకరణకు సిద్ధమవుతోంది. పూడికతీత, కట్టల బలోపేతంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి 131 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందనుందని రైతులు అన్నారు. భూగర్భ జలాలు పెరిగి రెండు పంటలకు భరోసా కలుగుతుందని తెలిపారు. చెరువు కొత్త శోభతో గ్రామంలో సాగు విప్లవాత్మక మార్పులు వస్తాయని రైతులు అభిప్రాయపడ్డారు.

May 5, 2026 / 09:57 PM IST

ప్రశాంతంగా ముగిసిన టీజీ ఎప్‌సెట్ పరీక్షలు

TG: రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు ఈ నెల 4, 5 తేదీల్లో మొత్తం 3 సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 93.38 శాతం హాజరయ్యారు.

May 5, 2026 / 09:53 PM IST

రేపే రైతు సదస్సు.. హాజరుకానున్న KTR

HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డులో రేపు నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. సదస్సుకు విచ్చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా స్థానిక బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు హాజరయ్యేందుకు కేటీఆర్ వరంగల్‌ జిల్లాకు విచ్చేశారు.

May 5, 2026 / 09:53 PM IST

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ప్రదీప్ రావు

WGL:  నగరంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా? అనే వ్యాఖ్యలు హిందూ భావాలను అవమానించేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు.

May 5, 2026 / 09:47 PM IST

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: తహసీల్దార్

MDK: నార్సింగిలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ గ్రేసీ బాయి, ఈవో నాగభూషణం సూచించారు. 2002లో ఓటు నమోదు చేసుకున్న వివరాలను (నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం సంఖ్య) సేకరించి, ప్రస్తుత నివాస ప్రాంత వివరాలతో సరిచూసుకోవాలని తెలిపారు. ఓటర్లు తమ బూత్ స్థాయి అధికారిని (BLO) సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

May 5, 2026 / 09:38 PM IST

ఆసుపత్రిని తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్

MLG: ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రేగా కళ్యాణి సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రి సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

May 5, 2026 / 09:35 PM IST

మొండెంఖల్ సంతలో పోలీసుల అవగాహన కార్యక్రమం

PPM: కురుపాం మండలం మొండెంఖల్ వారపు సంతను ఎస్సై నీలకంఠరావు సందర్శించారు. ఈ సందర్భంగా సంతకు వచ్చిన మారుమూల గిరిజన ప్రజలకు అభయదయం 2.0, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

May 5, 2026 / 09:33 PM IST

ఏయూ శతాబ్ది క్రీడలు ఘన విజయం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మంగళవారం తెలిపారు. సిబ్బంది సమన్వయంతో జరిగిన ఈ పోటీలు ఐక్యత, స్నేహభావాన్ని పెంచాయని చెప్పారు. నిర్వహణలో రన్-అప్ టీమ్ కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. సెనేట్ హాల్‌లో జరిగిన సమావేశంలో టీమ్ సభ్యులను సత్కరించారు.

May 5, 2026 / 09:33 PM IST

సాగునీటి ప్రాజెక్టుల దుస్థితికి టీడీపీ కారణం

SKLM: ఇచ్చాపురం నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు దుస్థితికి టీడీపీ కారణమని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఈదుపురం, కేశపురం బహుదా నది పరివాహక ప్రాంతంలో కాలువలు, పంట పొలాలను స్థానిక రైతులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

May 5, 2026 / 09:30 PM IST

‘పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులకు పూర్తి మద్దతు’

E.G: ప్రాథమిక రంగానికి చెందిన పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను గుర్తించి, వారికి అవసరమైన అవగాహనతో పాటు పూర్తి స్థాయి ప్రోత్సాహం అందించాలనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు & ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహికులను పరిశ్రమల స్థాపన వైపు దారితీసేలా చైతన్యం కల్పించాలన్నారు.

May 5, 2026 / 09:30 PM IST