WGL: జిల్లా దుగ్గొండి (M) లోని స్వామి రావు పల్లె ప్రధాన రహదారి పక్కన గత 7 రోజులుగా మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతున్న అంశాన్ని ఈరోజు ఉదయం HIT TV కథనాన్ని ప్రచురించారు. దీనిపై గ్రామ కార్యదర్శి వైనాల రాజు స్పందించి, లీకేజీని గుర్తించి తక్షణమే మరమ్మత్తు చేస్తున్నట్లు తెలిపారు. HIT TV యాజమాన్యానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
WGL: వంద పడకల ఆసుపత్రి కోసం ఎమ్మెల్యే నాగరాజు రెండు సార్లు శంకుస్థాపన చేసిన విషయాన్ని బీజేపీ జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో విమర్శించారు. ముందుగా కట్ర్యాల గ్రామ శివారులో ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద శంకుస్థాపన చేసిన తర్వాత, ఇప్పుడు వర్ధన్నపేట మండల కేంద్రంలో మళ్లీ శంకుస్థాపన చేయడం ప్రజలను మభ్యపెట్టడమే అని అన్నారు.
RR: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ ఎంసీ పరిధిలోని బడంగ్ పేట్ డివిజన్లో ఈరోజు బడంగ్ పేట్ ఆర్యవైశ్య సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ పాల్గొన్నారు.
KMM: మధిర మండలం దెందుకూరులో రెబల్ స్టార్ కృష్ణంరాజు 87వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన షుగర్ ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం Dy. CM భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. లండన్, ఇండియా, UKలకు చెందిన 30 మంది వైద్య బృందం స్వయంగా ఇక్కడికి వచ్చి, మధిర నియోజకవర్గ పేదలకు ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం అభినందనీయం అని తెలిపారు.
VKB: పరిగి మండలం జీడిగడ్డ తండాకు చెందిన డేగవత్ శ్రీనివాస్ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్టేట్లో 343వ ర్యాంక్, జోన్లో 15వ ర్యాంక్, జిల్లా స్థాయిలో 8వ ర్యాంక్, కేటగిరీలో 2వ ర్యాంక్ సాధించారు. కరోనా సమయంలో మొదటిసారి నర్సింగ్ ఆఫీసర్గా, రెండోసారి హెల్త్ సూపర్వైజర్గా ఉద్యోగం పొందిన శ్రీనివాస్, పట్టుదలతో ఏదైనా సాధ్యమని నిరూపించారు.
MDK: రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి (FRO) విద్యాసాగర్ ఆధ్వర్యంలో మంగళవారం అక్కన్నపేట బీట్ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. అడవి సంరక్షణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ‘ట్రయల్ పాత్’ (నడక మార్గం) పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.
NZB: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజామాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి గురించి ఆలోచించని కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే అర్హత లేదన్నారు.
MHBD: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి ఉమ్మడి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మంగళవారం ఉమ్మడి గ్రామ సర్పంచులు మహబూబాబాద్ డిపో మేనేజర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మద్దెల బిక్షపతి, ఇస్లావత్ నరేష్, నూనావత్ భద్రులు మాట్లాడుతూ.. కోమటిపల్లి పరిధిలోని గ్రామ ప్రజలు, విద్యార్థులకు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
BHPL: ఆజంనగర్ గ్రామంలోని స్థానిక ఫర్టిలైజర్ షాపులో నకిలీ పురుగుమందుల విక్రయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు రాజేంద్రప్రసాద్ 2 ‘ఎక్సోటిక్స్’ పురుగుమందు ప్యాకెట్లు కొనుగోలు చేశారు. ఒకే కంపెనీ పేరుతో ఉన్న ఈ ప్యాకెట్లలో తేడాలు ఉండటం గమనించిన రైతు, ఒకటి నకిలీదని గుర్తించి డీలర్ను నిలదీశారు. మోసపోయిన బాధితుడు DAO, AO సతీష్లకు ఫిర్యాదు చేశారు.
MLG: మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సరైనది కాదని BRS MLG జిల్లా ఇంచార్జ్ నాగజ్యోతి అన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. కేసులో ఎలాంటి వాస్తవాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసి కొట్టివేసినప్పటికీ మళ్లీ నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ రాజకీయ కక్షపూరిత దురుద్దేశానికి నిదర్శనమని విమర్శించారు.
SRD: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మీ పథకం వరమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు టిజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.
VKB: బషీరాబాద్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ దగ్గర బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాండూర్ నుంచి బషీరాబాద్ మార్గంలో నిత్యం తిరిగే బస్సుల కోసం ప్రయాణికులు రోడ్డుపైనే నిరీక్షిస్తున్నారు. ఈ కారణంగా రోడ్డుపై వాహన రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
MNCL: బీజేపీకి సమస్యలను పరిష్కరించే శక్తి ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నస్పూర్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పలువురు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. సమస్యలను పరిష్కరించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందామని అన్నారు.
VKB: పరిగి పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు బహర్పేట్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ వర్గాలు కోరాయి.
రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కేశంపేట మండలం సంగెం గ్రామంలో పశువులకు ఉచిత పశుగర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వేణుగోపాల చారి మాట్లాడుతూ.. పశువుల్లో ఎక్కువగా కనిపిస్తున్న గర్భకోష సంబంధిత వ్యాధులను గుర్తించి తొలి దశలోనే చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.