NLG: సావిత్రిబాయి పూలే సౌత్ ఇండియా బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డును మునుగోడు కు చెందిన స్కూల్ అసిస్టెంట్ నాయిని ఇందిరా దేవిని వరించింది. శనివారం గురుచైతన్య ఉపాధ్యాయ సంఘం వారు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో నిర్వాహకులు ఆమెకు అవార్డును అందించారు. విద్యాశాఖకు అందించిన సేవకు గుర్తింపుగా అవార్డు దక్కింది.
NGKL: సంక్రాంతి సందర్భంగా ప్రమాదకరమైన చైనా మాంజా దారాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సద్దాం హెచ్చరించారు. శనివారం రాత్రి అచ్చంపేటలోని పలు దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే ఈ దారాలను వాడొద్దని కోరారు.
MBNR: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనడానికి PU యోగా మహిళల జట్టు శుక్రవారం కర్ణాటకకు బయలుదేరింది. ఈ సందర్భంగా పాలమూరు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారిణులకు క్రీడా దుస్తులు అందజేశారు. యూనివర్సిటీకి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు పాల్గొన్నారు.
NZB: రహదారులపై మూలమలుపులో ఉన్న చెట్ల కొమ్మలను పిచ్చి మొక్కలను తొలగించాలని రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని మాక్లూర్, ఆర్మూర్ రహదారులను శనివారం రవాణా శాఖ, ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ADB: ఎస్.ఐ.ఆర్-2002 జాబితాతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవి పాల్గొన్నారు. రాబోయే 15 రోజులలో కనీసం 70 శాతం మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
KMR: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో శనివారం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్పై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఎంఏవో అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఎంఎన్ఏఈ పథకంపై రైతులకు అవగాహన కల్పింస్తున్నట్లు తెలిపారు.
SDPT: మండల కేంద్రం బెజ్జంకిలోని దుర్గమ్మ ఆలయంలో మాజీ సర్పంచ్ రావుల నరసయ్య ఆధ్వర్యంలో శనివారం దుర్గమ్మ పట్నాలు, బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలతో భారీ ఊరేగింపు నిర్వహించి ఆలయాన్ని చుట్టూ ప్రదర్శించారు. అనంతరం దుబ్బు కళాకారుల వాయిద్యాల మధ్య బోనాలు, పుట్ట బంగారాన్ని భక్తిశ్రద్ధలతో ఆలయానికి తరలించారు.
MDK: ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట సరస్వతి శిశు మందిర్లో సప్తశక్తి సంగమం మాతృ సమ్మేళనం లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆమె సూచించారు. మహిళలు ఇంటికి పునాదు లాంటి వారిని, ఇంటితోపాటు సమాజ అభివృద్ధికి కూడా మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
PDPL: ఈ నెల 5న బీఆర్ఎస్ నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో సిరి పంక్షన్ హాల్లో ఈ సమావేశం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించన్నారు.
WGL: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆదేశాల మేరకు ఖిలా వరంగల్ (M) కేంద్రంలోనీ మామునూరు MJP గురుకుల పాఠశాలను శనివారం తహసీల్దార్ ఇక్బాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ADB: పేదల కోసం ఎలాంటి న్యాయ సహాయానికైనా తామున్నామని జిల్లా డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైలును సందర్శించారు. ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆర్థిక స్థోమత లేని వారికి న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు.
SDPT: చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన శెట్టే భాస్కర్ కుటుంబానికి చేర్యాల పట్టణంలోని ఓ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు కలిసి రూ.12,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆకునూరు గ్రామ సర్పంచ్ కొమ్ము రవి భాస్కర్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
KNR: రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద శనివారం రేలారే రేలా ఫ్రేమ్ భూక్య గంగాధర్ నాయక్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ పాటను చిత్రీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కళాకారులను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంగ్ యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. సాంగ్ చిత్రీకరణకు గ్రామస్థులు, ఆలయ కమిటీ ఎంతో సహకరించారని తెలిపారు.
NZB: కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ డామన్లో ఈ నెల 5 నుంచి 9 వరకు జరిగే ‘ఖేలో ఇండియా’ బీచ్ వాలీబాల్ పోటీలకు తెలంగాణ జట్టు కోచ్గా ఆర్మూర్ మండలం మగ్గిడి పాఠశాల పీఈటీ మధు ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల రమేష్ బాబు, జిల్లా అధికారి పవన్, హెచ్ఎం హరిత, క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ ఓటర్ల జాబితాపై శనివారం 24 అభ్యంతరాలు అందినట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తమ పేర్లు ఒక వార్డు బదులుగా మరో వార్డులో నమోదయ్యాయని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఐదవ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరిస్తామని, వాటిని పరిశీలించి సవరణలు చేసి పదవ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.