HYD: సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఫిర్యాదుకుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా పరిశీలించి, పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్లాట్, ఇంటి స్థలం కొనేటప్పుడు లోతుగా విచారించి అన్ని సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్లాలని సూచించారు.
NZB: నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ గణేశ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె PHCని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టరు పరిశీలించారు. హాజరు పట్టికలో గణేశ్ సంతకాలు చేయకపోవడం గమనించిన కలెక్టర్ ఆయన గురించి వాకబు చేశారు. మూడు రోజులుగా PHCకి రాలేదని గుర్తించి నోటీసు జారీ చేయాలన్నారు.
HYDలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సభ్యులపై తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు కీలకమైన తరుణంలో అనవసర చర్చలు, పర్సనల్ చిట్చాట్లు వద్దని గట్టిగా హెచ్చరించారు. సభకు పూర్తి సన్నద్ధతతో హాజరుకావాలని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. సీఎం ఈ వ్యాఖ్యలతో సమావేశంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
WGL: హైదరాబాద్ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్కు చెందిన రైతులకు వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ కల్పించి న్యాయం చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వ్యవసాయ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు.
MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాయిపెల్లి యాకయ్య భారత్ విద్యారత్న ఉగాది జీవిత సాఫల్య పురస్కారం, గురు బ్రహ్మ అవార్డును ప్రముఖుల చేతుల మీదుగా సోమవారం అందుకున్నారు. ఈ అవార్డు రాకతో తనకెంతో సంతోషాన్ని, మరింత బాధ్యతను పెంచిందన్నారు. అవార్డుతో సత్కరించిన ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
KNR: జమ్మికుంట పట్టణంలోని 3వ వార్డు రామన్నపల్లిలో మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నూతన వైకుంఠధామం ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేపట్టారు. రామన్నపల్లిలో పెరుగుతున్న జనాభా కారణంగా దహన సంస్కారాలకు సరైన స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఛైర్మన్ కౌన్సిలర్లు, వార్డు ప్రజలతో కలిసి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
SRPT: సూర్యాపేట మున్సిపల్ పన్నులు, నల్లా బిల్లులు దీర్ఘకాలంగా చెల్లించని యజమానులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలుమార్లు నోటీసులిచ్చినా స్పందించని వారి ఇంటి నల్లా కనెక్షన్లను సోమవారం సిబ్బంది తొలగించారు. కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.
ADB: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ఎంపీలతో కలిసి అల్పాహర విందులో నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలను రాష్ట్రపతితో చర్చించినట్లు ఎంపీ నగేష్ పేర్కొన్నారు.
MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 24న ఉదయం 10 గంటలకు దేవాలయంలో హుండీ ఆదాయం లెక్కించడం జరుగుతుందన్నారు. భక్తులు వివిధ సందర్భాలలో హుండీలలో వేసిన నగదు, బంగారాన్ని లెక్కిస్తామని వెల్లడించారు.
MDK: తూప్రాన్ పట్టణ శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద 33 కేవీ విద్యుత్తు లైనులపై భారీ వృక్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో ఎండిపోయిన చెట్టు విరిగి విద్యుత్ లైన్ పై పడింది. దీంతో ఇస్లాంపూర్ సబ్ స్టేషన్ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెట్టు తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
RR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ప్యాకెట్ల సంఖ్యను తగ్గించి, ఇఫ్తార్ నిధులు విడుదల చేయకుండా ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని BRS నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు తమ సొంత ఇళ్లలో తోఫా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలో నూతన వీధి దీపాలు అమర్చుతున్న నేపథ్యంలో మంగళవారం(రేపు) ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో SP నితిక పంత్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల సమస్యలను విని, చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, ఎలాంటి పైరవీలు లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు.
SDPT: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించి విద్యార్థులకు రుచికరంగా వండాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్ధిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంటగది, స్టోర్ రూమ్ తనిఖీ చేస్తూ వంటగది పరిసరాలు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
NGKL: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు సోమవారం వంటా-వార్పు నిర్వహించారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా తమ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.