NZB: సీనియర్ నేతలను వదులుకుని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇవాళ ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారన్నారు.
NRML: నిర్మల్ జిల్లాలో డిసెంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించడం జరుగుతుందని డీఈవో భోజన్న, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MDK: ఏసీబీ అధికారులకు ఎస్సై పట్టుబడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. టేక్మాల్ పోలీస్ స్టేషన్లో హార్వెస్టర్పై నమోదైన ఓ కేసు విషయంలో ఎస్సై రాజేష్ రూ.20,000 డిమాండ్ చేశాడు. ఇవాళ బాధితుని వద్ద నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
న్యాయ విద్య చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య జీ.ఎన్ శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయ కళాశాల విద్యార్థులు కష్టపడి చదివితే సమాజానికి న్యాయం చెప్పే అవకాశం ఉంటుందన్నారు.
ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. మంగళవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆయన కలిశారు. ఈ మేరకు వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఆయనకు వివరించారు. మంత్రి సానుకులంగా స్పందించారన్నారు.
HYDలో జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హైద్రాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొని మాదక ద్రవ్యాల నివారణపై ప్రభుత్వ కట్టుబాటును పునరుద్ఘాటించారు. డ్రగ్ ఫ్రీ TG, HYDని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వృద్ధులు పాల్గొన్నారు.
NZB: దేశ నిర్మాణ శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. ఏక్ భారత్ ఆత్మనిర్బార్ భారత్ కార్యక్రమంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నేడు యూనిటీ మార్చ్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తాలో గల పటేల్ విగ్రహం నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు రన్ కొనసాగించారు.
WGL: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్, స్థానిక నాయకులు, వ్యవసాయ అధికారులు తదితరులున్నారు.
HYD: తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం వాహన నంబర్ల ఫీజులను పెంచింది. 9999 వంటి ప్రముఖ నంబర్కు ఇప్పుడు రూ.1.5 లక్షలు అయ్యాయి. హైదరాబాద్లో TG 09 సిరీస్కు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఒకే నంబర్కు అనేక మంది దరఖాస్తు చేస్తున్న పరిస్థితుల్లో రవాణా శాఖ కొత్త కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
WNP: జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐ టీ. శివకుమార్ అన్నారు. మంగళవారం అమరచింత మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై స్వాతి పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల మండల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ ముదిరాజ్ ఇటీవల ఏఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఎస్పీ జానకి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఇదే క్రమశిక్షణతో మరెన్నో ఉన్నత బాధ్యతలు స్వీకరించాలని ఆకాంక్షించారు.
ADB: కోలాం ఆదివాసీలకు అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఇవాళ ఉట్నూర్ మండలం చెరువుగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 53 ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం భూమి పూజ చేశారు.
MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండలంలోని ఇంధనపల్లి గ్రామ ఊర చెరువులో ఇవాళ అధికారులు, నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. MLA మాట్లాడుతూ.. అన్ని కులాల వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ప్రభుత్వ పథకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
RR: ఫరూఖ్నగర్ మండలం ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకటయ్యతో పాటు గణేష్ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్య కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
MBNR: నవాబ్ పేట మండలం ఎన్మనగండ్లలో తాగునీటి సమస్యపై మహిళలు బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లలో నీరు ఉన్నప్పటికీ సరఫరాలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని ప్రజలు అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.