MBNR: కూతురు కులం కాని వ్యక్తిని ప్రేమించిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబుపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం.. హనుమసాని పల్లికి చెందిన ఎల్లయ్య కూతురు అరుణ మండల కేంద్రానికి చెందిన యువకుడితో వెళ్లిపోయింది. మనస్థాపం చెందిన ఎల్లయ్య గ్రామ శివారులలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
NLG: తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషా జండా ఎగురవేయాలని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. నల్గొండలో గురువారం రాత్రి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
BDK: చిన్న వయసు నుంచే సేవా దృక్పథంతో అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో ఆమె వృద్ధాశ్రమాన్ని స్థాపించారని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. సామాజిక సేవకురాలు షహనాజ్ బేగంను సన్మానించారు. కుల, మతాలకు అతీతంగా వృద్ధాశ్రమాన్ని నడపడం ద్వారా ఆమె ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. వృద్ధుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లో ఘనంగా జరిగింది.
HYD: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు HYDలో పర్యటించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్, తిరుమలగిరి, కార్ఖానా, బేగంపేట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో CTO, రసూలుర, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట, తిరుమలగిరి, AOC, అల్వాల్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిపివేసే అవకాశం ఉందన్నారు.
BDK: టీయూసీఐ జిల్లా కార్యదర్శి యాకుబ్ షావలి గురువారం ఇల్లందు మున్సిపాలిటీ వాటర్ సప్లై విభాగంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ దేశానికి సంపదను సృష్టిస్తున్న కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోగా, కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెడుతోందని ఆయన ఆరోపించారు.
NLG: ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మిర్యాలగూడ గ్రంధాలయంలోని రీడర్స్కు రాజ్యాంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై గురువారం సామాజికవేత్త డాక్టర్ రాజు ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఈ నెల 26న బహుమతులు అందజేస్తామని తెలిపారు.
PDPL: సింగరేణి కార్పొరేట్ సీహెచ్ విభాగం కొత్త GM ఎస్వి. రామమూర్తి గురువారం రామగుండం–3 ఏరియాలో పర్యటించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రాంతానికి మొదటిసారి వచ్చిన ఆయనను ఆర్టీ-3 ఏరియా జీఎం నరేంద్ర సుధాకరరావు శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. అనంతరం రామమూర్తి సీహెచ్పీని సందర్శించి కార్యకలాపాలను సమీక్షించారు.
PDPL: కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన కొమ్ము ప్రశాంతి చికిత్స కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 2.50 లక్షల LOCని మంజూరు చేసి కార్యాలయంలో మంత్రి ప్రతినిధులు, బాధితురాలికి అందజేశారు. వైద్య చికిత్సకు అండగా నిలిచినందుకు ప్రశాంతి కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వరప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం వివరాలు, ఇప్పటివరకు సేకరించిన పరిమాణం వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఆలస్యం చేయకుండా ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామ శివారులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ నర్సరీని నిజామాబాద్ రేంజ్ అధికారి గంగాధర్ పరిశీలించారు. అనంతరం తిమ్మాపూర్ గ్రామ శివారులో ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చైతన్య శ్రీ, బీట్ ఆఫీసర్ మధు, సిబ్బంది పాల్గొన్నారు.
MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కల్లెపు పద్మ అనే వృద్ధురాలిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గురువారం గ్రామస్తులు, మహిళ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని ఇంట్లో ఆమానుషంగా హత్య చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
MBNR: ఆర్టీసీ సమస్యలపై ‘డయల్ యువర్ RM’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలమూరు రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. నేడు సాయంత్రం 4:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆర్టీసీ సమస్యలు, సూచనల కోసం 99592 26295కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
WNP: వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేటు కంపెనీలకు మళ్లిస్తున్నారని, బోర్డును ప్రభుత్వం స్వయంగా నిర్వహించాలంటూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు బొబ్బిలి నిక్సన్, వెంకటయ్య గురువారం డిమాండ్ చేశారు. పెద్దమందడిలో జరిగిన సంఘ సమావేశంలో అధ్యక్షుడు కురుమూర్తి, కోశాధికారి శ్రీను, ఆశన్న, నాగభూషణ్ పాల్గొని కార్మికుల హక్కుల రక్షణకు చర్యలు కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
MDK: మాసాయిపేట మండల కేంద్రంలో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన నాగరాజు గౌడ్ కూతురు మహాలక్ష్మి (19) మొబైల్ ఫోన్ వినియోగం విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ పడింది. మనస్థాపానికి గురైన మహాలక్ష్మి గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు.
MLG: వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి గురువారం సాయంత్రం బదిలీ కాగా..ఆయన స్థానంలో వెంకటాపురం (కే) రేంజర్ వంశీకృష్ణకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఐదేళ్లుగా వాజేడు రేంజ్లో విధులు నిర్వహించిన చంద్రమౌళిని అటవీ శాఖ ఉన్నతాధికారులు భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు రేంజికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇప్పటికే కొత్త పోస్టింగ్లో చేరారు.