GDWL: ఎలక్ట్రిషన్స్, ప్లంబర్స్ పని ప్రదేశంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని TPCC ప్రతినిధి శక్షావలి ఆచారి సూచించారు. బుధవారం అయిజలోని ఓ హాల్లో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని నిబద్ధతతో పనిచేసి వినియోగదారులకు మంచి సేవలు అందించాలని చెప్పారు. అనంతరం యూనియన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు.
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ అభివృద్ధికి సహకరించాలని మల్కాపూర్ పంచాయతీ పాలక వర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ నేతృత్వంలో వారు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో యాదయ్య, జడ్పీ సీఈవో ఎల్లయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
SRD: ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావిణ్యకు బహిరంగ లేఖ బుధవారం విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు రమేష్ గౌడ్, మహేష్ పాల్గొన్నారు.
యాదాద్రి: ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావాన్ని ప్రదర్శించి ప్రజలు మన్ననలు పొందినప్పుడే గుర్తింపు ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం జరిగిన రామన్నపేట మండల డీఈ బోయ గాలయ్య పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని దంపతులను సత్కరించారు. డిపార్ట్మెంట్కు ఆయన అందించిన సేవలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొనియాడారు.
PDPL: శాస్త్రి నగర్లో గల శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి భక్తులు స్వామివారి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పురవీధుల గుండా సాగిన రథయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామి దీక్ష ధారణ చేసిన స్వాములు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై చేసిన భజనలు, నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
GDWL: నూతన సంత్సరం వేడుకల పేరుతో మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని గద్వాల ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ వేడుకలపై పూర్తి నిషేధం ఉందని, ప్రధాన కూడళ్లలో కేకులు కట్ చేయడం లేదా డీజేలతో శబ్ద కాలుష్యం సృష్టించడం చట్టరీత్యా నేరమన్నారు.
SRD: సంగారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. హెవీ వెహికిల్స్, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షల నిర్వహణకు క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పాఠశాలల మేనేజ్మెంట్కు పాఠశాలల బస్సుల సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
SRD: మనూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ సుధాకర్ ఇవాళ పదవీ విరమణ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కర్ణం కృష్ణ, బీజేపీ మనూరు మండలం అధ్యక్షులు కర్ణం ఈశ్వరప్ప సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాలకు పైగా ఆర్టీసీ కండక్టర్గా మంచి సేవలందించారని కొనియాడారు.
KNR: శంకరపట్నం మండలంలోని పలు గ్రామలలో 2950 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశామని మండల వెటర్నరీ అధికారి మాధవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వల, గద్దపాక, అంబేద్కర్ నగర్ సర్పంచ్లు దాసరపు అంజలి, కొయ్యడ పరుశురాములు, పులికోట ప్రేమలత, ఉపసర్పంచ్ జంగ జైపాల్, పెంపకం దారులు, సిబ్బంది అమీర్ ఖాన్, అజహర్ పాల్గొన్నారు.
ADB: చదువుతోనే జీవిత లక్ష్యాన్ని సాధించాలని తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన ఉపాద్యాయురాలు ఏలటి జ్ఞాన ప్రగతి పేర్కొన్నారు. ఇటీవల స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) ఉద్యోగం సాధించిన ఆమే బుధవారం కప్పర్ల గ్రంథాలయ నిర్వహణ ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలను విరాళంగా అందజేశారు. గ్రంథాలయ నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.
KNR: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రమం తప్పకుండా సదరం శిబిరాలు నిర్వహించాలని, అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. సదరం శిబిరాల నిర్వహణ, యూడీఐడీ తదితర అంశాలపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, అధికారులతో సెర్ప్ సీఈవో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
NLG: అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా కృషి చేస్తానని కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన బడుగు చంద్రశేఖర్ తెలిపారు. సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డీఈవో బిక్షపతి, కలెక్టరేట్ ఏవో మోతిలాల్ ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
MBNR: జిల్లాలో చేపడుతున్న భూ సర్వే పనులపై అదనపు రెవెన్యూ కలెక్టర్ మధుసూదన్ నాయక్ బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గండీడ్ మండలం సాలార్నగర్లో అమలవుతున్న భూ సర్వే పైలట్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో నవీన్, అసిస్టెంట్ ల్యాండ్ సర్వే ఏడీ అశోక్కుమార్ పాల్గొన్నారు.
KNR: రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ విభాగం కరీంనగర్ జిల్లా ఇంచార్జీ పెద్దేల్లి తేజస్వి ప్రకాశ్ పిలుపునిచ్చారు. బుధవారం ఎల్ఎండీ కాలనీలో ప్రజాభవన్ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ADB: బోథ్ పట్టణ అభివృద్ధితో పాటు సాయినగర్ గ్రామ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తున్నామని బోథ్ సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సాయినగర్ ఎస్టీ కాలని ప్రజలు సర్పంచ్ కుర్మా అన్నపూర్ణ మహేందర్ను సీనియర్ నాయకులు, వర్డ్ మెంబర్లు సన్మానించారు.