NZB: కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్లను ఎంపీ అర్వింద్ ధర్మపురి కలిశారు. నేడు ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో మంత్రులను వేర్వేరుగా కలిసి నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలువిజ్ఞప్తులను అందజేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి జిల్లా రైల్వే స్టేషన్లో పిట్ లైన్ల ఏర్పాటు, పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా పలు రైళ్ల పొడిగించాలన్నారు.
NLG: జిల్లాలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు చేపట్టామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల రోజు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం కట్టంగూర్ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు.
NLG: మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న దేవరకొండ డివిజన్లోని 9 మండలాలలో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కోర్రా లక్ష్మీ సమక్షంలో కలెక్టర్ త్రిపాఠి బుధవారం తన చాంబర్లో ఈ కార్యక్రమం చేపట్టారు. 2206 పోలింగ్ కేంద్రాలకు, 2647 పీవో లు, 2959 వోపీవోలను విధుల్లో నియమించారు.
ADB: ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోనీ ధర్మసాగర్లో బుధవారం సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా కొంత మందితో కలిసి సర్పంచ్ అభ్యర్థి భర్త కనక దుండిరావు ప్రచారం నిర్వహించాడు. సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ టీం తనిఖీ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఈ సాయన్న తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
WGL: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి MSP నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా MSP జిల్లా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తే ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
HYD: కుటుంబ సమస్యల కారణంగా ధర్మారెడ్డి కాలనీలో వాచ్మెన్గా పనిచేస్తున్న కోడివేడు వెంకన్న (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయినట్లు KPHB పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
WNP: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా ఆయా మండలాలలో స్థానిక సెలవు ప్రకటించినట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం తెలిపారు. జిల్లాలోని పెద్దమందడి, ఏదుల, ఘనపూర్, గోపాల్ పేట, రేవల్లి మండలాలలో గురువారం మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
KMM: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్ణీత సమయానికి పూర్తి కావాలని, నాణ్యతలో రాజీ పడొద్దని Dy. CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కింది స్థాయిలో పనిచేసే అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలని ఆయన సూచించారు.
VKB: కొడంగల్ మండల పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. మహిళలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
NLG: కట్టంగూర్ మండల పరిధిలో గురువారం జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో జ్ఞానప్రకాశరావు బుధవారం తెలిపారు. మండలంలోని మొత్తం 22 గ్రామ పంచాయితీలలో మల్లారం, దుగినవెల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 20 గ్రామ పంచాయితీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.
NRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ను నిర్ణీత సమయంలో ప్రారంభించి, ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా ముగించాల్సిందిగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్దూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.
SRPT: నాగారం మండలం పస్తాల గ్రామంలో చిన్నారులు చేసిన పనికి యూత్ ఫిదా అవుతున్నారు. జిల్లా ప్రజా పరిషత్ పసునూరు స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న రెంటాల జోయల్ “ఓట్లు అమ్మడం, కొనడం నేరం” అని ఇంటిముందు రాసి పెట్టాడు. స్కూల్లో సోషల్ టీచర్ వెంకన్న ఇలా రాయమని చెప్పారని, చిన్నారులు అన్నారు. ఇది పది రోజుల క్రితమే ఏర్పాటు చేసినా, అది ఇప్పుడు గ్రామంలో వైరల్గా మారింది.
జగిత్యాల జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల వేళ సంస్థలలో, దుకాణాలలో, ఫ్యాక్టరీలలో తదితర చోట్ల పనిచేసే కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని జిల్లా సహాయ కార్మిక కమిషనర్ సురేంద్ర కుమార్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను యజమానులు పాటించాలన్నారు.
RR: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. రాజేంద్రనగర్లోని ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్ ఎన్నికల సామాగ్రి గదులను పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి యంత్రాలను పరిశీలించి సీల్ వేయించారు.
MBNR: జడ్చర్ల మండల కేంద్రంలో కల్వకుర్తికి వెళ్లే రోడ్డు సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నప్రసాద షెడ్డును ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. తన సొంత నిధులు రూ. 8 లక్షలతో ఈ షెడ్డును ఎమ్మెల్యే నిర్మించారు. అలాగే, స్వామివారి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. దేవాలయం అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడి ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.