HNK: కాజీపేట పట్టణంలోని బాపూజీనగర్లో అక్రమంగా చైనా మంజా విక్రయిస్తున్న సమచారం మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి గారిగే శివకృష్ణ వద్ద నుంచి 180 చైనా మంజా చిన్న ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మంజా విలువ రూ. 9,000గా గుర్తించి కేసు నమోదు నిమిత్తం కాజీపేట పోలీసులకు అప్పగించినట్లు ఎసీపీ మధుసూదన్ తెలిపారు.
WGL: చెన్నారావుపేట మండలం లింగాపురంలో పల్నాటి సబిత (35) విద్యుత్ షాక్తో శుక్రవారం మరణించారు. తాను నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటికి నీరు పడుతుండగా, విద్యుత్ మోటర్ ఆగిపోయింది. దానిని సరి చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సబిత భర్త లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
SRCL: శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు. మండల కేంద్రంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ శుక్రవారం ఏఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రకాల రికార్డ్స్ ,రిజిస్టర్లను పరిశీలించారు. మండల విస్తీర్ణత, గ్రామపంచాయతీలు, ఎక్కువగా కేసులు అయ్యే గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
VKB: ఈనెల 27, 28, 29 తేదీల్లో హజ్రత్ అలాం షాహిద్ హజ్రత్ హుస్సేన్ షాహిద్ దర్గా ఉర్సు ఉత్సవాలను నిర్వహిస్తామని మజీద్ ఉత్సవ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉర్సు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
NRML: రాజస్థాన్లోని జోధ్పూర్లో నిర్వహిస్తున్న న్యాయవాద పరిషత్ 17వ జాతీయ సదస్సులో నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేర్ నరేందర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర వంటి పలు అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి చర్చించామన్నారు.
MNCL: మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని జన్నారం మండల ఎస్సై అనూష కోరారు. శుక్రవారం జన్నారం మండలంలోని ఇందన్ పల్లి అనుబంధ నాయకపు గూడెంలో ఆదివాసి, గిరిజన మహిళలు వెదురు బొంగులతో చేసిన పరికరాలను, కుర్చీలను అమె పరిశీలించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.
MLG: తాడ్వాయి మండలం పస్రా-తాడ్వాయి రహదారి మధ్య జలగలంచ వాగులో అటవీ శాఖ ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐల్యాండ్ను ఇవాళ మంత్రి సీతక్క పునఃప్రారంభించారు. ములుగు జిల్లా పర్యాటకులకు నిలయమని, బ్లాక్ బెర్రీ ఐల్యాండ్ కనువిందు చేసే ప్రదేశమని పర్యాటకులు తప్పక సందర్శించాలని కోరారు. కలెక్టర్ దివాకర్ టిఎస్, SP సుధీర్ రాంనాథ్ కేఖన్, అశోక్ ఉన్నారు.
MDK: తూప్రాన్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ ధర్మ శాస్త్ర తిరు కళ్యాణ మహోత్సవ, మండల పూజ ఘనంగా నిర్వహించారు. రాత్రి తూప్రాన్ పట్టణంలో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. గురుస్వాములు నేతి మహేశ్వర్, చిన్న లింగు శ్రీనివాస్, బజార్ రూపేష్, బసవన్నగారి సత్యనారాయణ గౌడ్, మాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
WNP: ఆత్మకూరు మండలం ఖానాపురంకి చెందిన చంద్రకళ శంషాబాద్ జోనల్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయంపై ఖానాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆమె పని చేసిన ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని గుర్తు చేసుకున్నారు. తమ గ్రామ బిడ్డ ఉన్నత పదవిని చేపట్టడం గర్వకారణమన్నారు.
BHPL: మహాదేవపూర్ మండల కేంద్రంలోని GP కార్యాలయ ఆవరణలో శుక్రవారం CI వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాటారం DSP సూర్యనారాయణ హాజరై, మాట్లాడుతూ.. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DSP సూచించారు. ఫోన్ కాల్స్, వాట్సాప్ లింకులు, లాటరీల ద్వారా మోసగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు.
NLG: గురు గోవింద్ సింగ్ కుమారులు ఫతేసింగ్, జోరవర్ సింగ్ల త్యాగాన్ని దేశ ప్రజలు స్మరించుకోవాలని ఏబీవీపీ ఎంజీ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు కొంపల్లి సూర్య, చిట్యాల నగర కార్యదర్శి వంగూరి గణేష్ అన్నారు. చిట్యాలలో ఇవాళ ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ వీర బాలల దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నేతలు పాల్గొన్నారు.
ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన షేక్ అక్బర్ అనే ముస్లిం రైతు అయ్యప్ప స్వాములకు భిక్ష శుక్రవారం సమర్పించి మతసామరస్యాన్ని చాటారు. ఆయన మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలన్నారు. అయ్యప్ప స్వాములకు బిక్ష ఇవ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గురుస్వాములు, గ్రామ యువకులు ఉన్నారు.
GDWL: కేంద్రం తీసుకొస్తున్న వికసిత్ భారత్ కొత్త చట్టం పేదలకు హానికరమని SKM నాయకులు ధ్వజమెత్తారు. గద్వాల కృష్ణవేణి చౌరస్తాలో ఆందోళనలో గోపాల్ అన్నారు, ఉపాధి హామీని అటకెక్కించేందుకే చట్టం తీసుకువచ్చారని, పేదల హక్కులను కాలరాయడం సరికాదని, కేంద్ర వ్యూహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
HNK:ఆత్మకూరు మండలంలో భార్యను హతమార్చేందుకు యత్నించిన మంద రవిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అనుమానంతో నిన్న రాత్రి భార్యను, భర్త రవి కత్తితో గొంతు కోయగా.. భార్య తీవ్రంగా గాయపడింది. కేకలు విన్న స్థానికులు ఆమెను MGM ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు CI సంతోష్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NZB: ధర్పల్లి సహకార సంఘం ప్రత్యేక అధికారిగా మురళి నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల అధ్యక్షులు పదవులను రద్దు చేయడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సహకార సంఘాల్లో అందుబాటులో ఉంచుతామని మురళి శుక్రవారం తెలిపారు. రైతులకు సహకార సంఘం సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు.