BDK : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తొలి విడత ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది తమ విధులకు సంబంధిత కేంద్రాల్లో రేపు ఉదయం తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
MDK: తూప్రాన్ పట్టణంలో నివాసముండే బర్మావత్ రవి (36) అదృశ్యమైనట్టు ఎస్సై శివానందం తెలిపారు. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన రవి, సునీత దంపతులు రెండేళ్లుగా తూప్రాన్లో ఉంటున్నారు. భర్త చేసిన అప్పుల విషయంలో గత నెల 20న రాత్రి గొడవ జరగగా, 21న ఉదయం ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయినట్టు వెల్లడించారు . మంగళవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
WNP: పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన జయన్నను వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి మంగళవారం అభినందించారు. జయన్న మంచితనం వల్లే ప్రజలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఇలాంటి ఏకాభిప్రాయం ప్రతి గ్రామంలోనూ రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జయన్న గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
NZB: గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.
MBNR: గండీడ్ మండలంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది.ఈ నేపథ్యంలో ఎస్సై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ..అభ్యర్థులుగానీ, ఇతరులు గానీ గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘించిన కేసు నమోదైతే జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
SRPT: రెండవ, మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులకు వెళ్లే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ సూచించారు. రెండవ విడత మండలాల్లో డిసెంబర్ 7-10, మూడవ విడత మండలాల్లో 10,12,13,15 తేదీల్లో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
NGKL: జిల్లాలోని ప్రైవేటు క్లినిక్లు, ఆసుపత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఇవాళ డీఎంహెచ్వో డాక్టర్ కె. రవికుమార్ తెలిపారు. ఆయన పలు డయాగ్నస్టిక్, ఫిజియోథెరపీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేటు పట్టిక ప్రకారమే ఫీజు వసూలు చేయాలన్నారు.
SRD: మొదటి విడత ఏడు మండలాలు జరిగే పంచాయతీ ఎన్నికలకు 1100 మంది పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరితోష్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 129 సర్పంచ్ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరు సహకరించాలని కోరారు.
SDPT: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఎదురుగా రూ.1.30 కోట్లతో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన కొయోస్కో సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అశ్రీత్ కుమార్ సూచించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు రూ. 50 వేల వరకు లోన్ కూడా అందిస్తామని, రుణాల మంజూరు ప్రక్రియను 2030 వరకు పొడిగించారని ఆయన తెలిపారు.
WNP: కొత్తకోట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణం, కేసుల్లో సీజ్ అయిన పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ అనేది ప్రజలకు ఉన్న మొదటి నమ్మకం ఇక్కడికి అడుగుపెట్టిన పౌరుడు ముందుగా స్టేషన్ రూపం చూస్తాడని అన్నారు.
BDK: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1700 మంది పోలీసులతో భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. మొత్తం 320 పోలింగ్ స్థానాల్లోని 1510 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
NRPT: మాగనూరు మండలంలోని కొల్పూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ ఎన్నికల్లో వేరువేరు పార్టీల నుంచి తండ్రీ కూతుళ్లు ముద్దు రాములు, ముద్దు నవ్యాలు పోటీ చేస్తున్నారు. దీంతో తండ్రి కూతుర్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని కట్టోజు నీరజ జాతీయ కథా రచన పోటీల్లో మొదటి స్థానం సాధించింది. బాలచెలిమి మాసపత్రిక, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో అక్కన్నపేట మండలం, నీరజ రచించిన “చెట్టు ఉపకారం” కథకు ఈ గౌరవం దక్కింది. పర్యావరణ దృక్పథం, మానవీయ విలువలు నేపథ్యంగా సాగిన ఈ కథను అధ్యాపకులు అభినందించారు.
వనపర్తి జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత చేపట్టాల్సిన ఏర్పాట్లులపై అవగాహన కల్పించారు.
KMM: కామేపల్లి మండలం పొన్నెకల్లు గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి. నాగులు సారథ్యంలో మంగళవారం పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు, ఇతర సాధారణ వ్యాధులకు చికిత్సలు అందించారు. చలికాలంలో వచ్చే వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు కూడా అందించారు.