SDPT: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్గా రష్మీ పెరుమాళ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీపీ విజయ్ కుమార్ ఎస్బీ జాయింట్ సీపీగా బదిలీ అయ్యారు. ఇటీవలే డీఐజీగా పదోన్నతి పొందిన విజయ్ కుమార్ జిల్లాలో బెల్టు షాపులు, అక్రమ వ్యాపారాల నిర్మూలనకు కృషి చేయడంతో పాటు సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి గుర్తింపు పొందారు.
KMR: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పిలుపునిచ్చారు. కామారెడ్డిలోని అబ్దుల్ కలాం ప్రాంగణంలో 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శిని, ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు.
SDPT: సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ది టెక్స్ట్ బుక్ ఆఫ్ బోటని’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మారిన సిలబస్కు అనుగుణంగా మొదటి, రెండవ సెమిస్టర్ వృక్షశాస్త్ర పాఠ్యాంశాల ఆధారంగా డా. రాణి కొమ్మడి రచించిన ఈ పుస్తకాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. సునీత, వైస్ ప్రిన్సిపాల్ డా. అయోధ్యరెడ్డి ఆవిష్కరించారు.
BHNG: రేపు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 11 గం.లకు భువనగిరి మండలం అనాజీపురం, బీబీనగర్ మండలం జంపల్లి గ్రామాల మధ్యన ఉన్న రోడ్డు పైన హై లెవల్ వంతెన పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12. గం.ల నుంచి భువనగిరి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.
SDPT: గత కొంతకాలంగా అక్కన్నపేట, మద్దూరు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, రైతులకు చెందిన ధాన్యం బస్తాలపై వరుసగా జరుగుతున్న దొంగతనాల కేసులో నిందితులను అక్కన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనల్లో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు గుర్తించి, వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
NZB: లూయిస్ బ్రెయిలీ లిపి కాదని.. అంధుల ఆశాజ్యోతి అని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంధుల వనరుల కేంద్రంలో బ్రెయిలీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అంధుల అభ్యున్నతికి అంధత్వమనేది అడ్డు కాదని అన్నారు.
BDK: సుజాతనగర్ మండలం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సమావేశం అయ్యారు. జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని రానున్న కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నాయకులతో చర్చించారు. ప్రతి నాయకులు కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
NGKL: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 5వ నుంచి 9వ తరగతుల వరకు బ్యాక్లాగ్గా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీసీఓ లక్ష్మి బుధవారం తెలిపారు. ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఉంటుందని వెల్లడించారు.
GDWL: పట్టణంలోని మాజీ మున్సిపల్ ఛైర్మన్ బి.యస్.కేశవ్ స్వగృహంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. త్వరలో జరగబోయే గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో చర్చించారు.
MDK: అతి తక్కువ ఖర్చుతో తల్లి పురుగులను ఆకర్షించే ‘లైట్ ట్రాప్’ను తయారు చేసిన ఇన్ఛార్జ్ ఏడీఏ రాజు నారాయణను రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి బుధవారం సన్మానించారు. ఆయన ఆవిష్కరణ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అభినందించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కూడా పాల్గొని రాజు నారాయణను ప్రశంసించారు.
HYD: ఓ సర్వే నివేదిక కోసం రూ.1,50,000 లంచం డిమాండ్ చేసిన దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆకవరం కిరణ్ కుమార్ ACB వలకు చిక్కారు. డిమాండ్ చేసిన దానిలో అధికారి రూ.50,000 తీసుకుంటుండగా ACB పట్టుకుంది. ఈ ఘటన దేవాదాయ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ విభాగంలో జరిగింది. అధికారులు లంచం అడిగితే 1064కు కాల్ చేయండి.
SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని జిల్లా టీఆర్పీ అధ్యక్షులు బిక్షపతి కురుమ డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు బుధవారం గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, వాటిని ఆచరించి చూపాలని వారు డిమాండ్ చేశారు.
GDWL: ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలకు తక్షణమే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు. బుధవారం గద్వాల జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణను కలిసి ఈ విషయంలో వినతిపత్రం సమర్పించారు. కేవలం సబ్ ప్లాన్ ద్వారా మాత్రమే వెనుకబడిన తరగతులకు సమర్థవంతమైన అభివృద్ధి అవకాశాలు కల్పించగలమని అన్నారు.
KMR: లింగంపేట్ మండలం పోతాయిపల్లికి చెందిన ఏడేళ్ల చిన్నారి అద్విత, 14రోజులుగా తీవ్ర జ్వరం, ఫిట్స్తో బాధపడుతూ.. కొంపల్లిలోని పారామిత హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, మానవత్వం చాటుకుంటూ అద్వితకు రూ.20వేల ఆర్థిక సహాయం అందించారు.
NZB: ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు నుంచి బుధవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయకట్టు కింద సుమారు 5,000 ఎకరాలకు నీటిని అందించే సామర్థ్యం రామడుగు ప్రాజెక్టుకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శాంతా, సర్పంచ్ రమేశ్ గౌడ్, ఆయకట్టు ఛైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.