వనపర్తి: జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా నిరంతర విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు ఎవరైనా విద్యుత్ సమస్యలు ఉంటే 1912 హెల్ లైన్కు ఫోన్ చేయాలన్నారు.
SRD: పోస్టల్ యాక్ట్ – 2023 అమలు చేయవద్దని కోరుతూ తపాలా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోస్టల్ శాఖను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
నారాయణపేట: నారయణపేట మండలం అప్పంపల్లి మెడికల్ కళాశాల వద్ద ఈనెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో మంగళవారం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పరిశీలించారు. సభ స్థలం, వేదిక, పార్కింగ్ స్థలాలను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.
నాగర్ కర్నూల్: హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గోరిట గ్రామానికి చెందిన పి అభిషేక్ అండర్-20 ట్రిపుల్ జంప్ విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అతని విజయాన్ని అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ స్వాములు, అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు ఇవాళ వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181.9292 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కుడి కాల్వకు 10000 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8718 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
MNCL: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 డీ6 ప్రకారం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
NRML: గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిలుపుదల కోరుతూ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను దిలావర్పూర్ మండల కేంద్ర ప్రజలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం రెండవసారి అవకాశం ఇవ్వగా మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మండల తహసీల్దార్ స్వాతిని కలిసి సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తామని తెలిపారు. తమ వివరాలు ఇస్తామని పేర్కొన్నారు.
MHBD: మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మను నేడు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీలు శోభకు పూలకుండి అందించి ఆమె ఆశీస్సులు అందుకున్నారు.
మంచిర్యాల: బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో RO ప్లాంట్ ఆలనాపాలన కరువైంది. ప్లాంట్ చెడిపోయి నెల రోజులు కావస్తున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. చల్లటి శుద్ధి జలాన్ని అందించే ఆర్వో ప్లాంట్ సేవలకు ఉద్యోగులు, వైద్య సిబ్బంది రోగులు దూరమయ్యారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి RO ప్లాంట్ బాగు చేయించాలని కోరుతున్నారు.
NRML: ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించి వారి మన్ననలు పొందాలని ఆదిలాబాద్ రీజినల్ డిప్యూటీ ఆర్ ఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బస్ డిపోలో ఆర్టీసీ ఆధ్వర్యంలో పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ADB: వారం రోజుల కిందట ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగిన ఘటన మరువకముందే నార్నూర్లో మరో చోరీ జరిగింది. శ్రీనివాస వైన్ షాపులో సోమవారం రాత్రి దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని స్కూల్ కాంప్లెక్స్లో మంగళవారం ఇంగ్లీష్ విద్యా బోధన విధానంపై సమావేశం నిర్వహించారు. మండల విద్యాధికారి నాగారం శ్రీనివాస్ ఇంగ్లీష్ విద్యా బోధనలో మెళుకువలపై ఇంగ్లీష్ బోధకులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. విద్యార్థుల అభ్యాసనలో ఇంగ్లీష్ బోధన సామర్ధ్యాలు మెరుగుపరిచి, పటిష్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో SA టీచర్లు ఉన్నారు.
NLG: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సూర్యపేటలోని లింగమతుల స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకొని స్వామి కృపకు పాత్రులవుతున్నారు. భారీగా వాహనాలు తరలివస్తుండటంతో అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. HYD నుంచి VJWD వెళ్లే వాహనాలను NKP వద్ద దారి మళ్లిస్తున్నారు.
WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర సోమవారం రూ.13,800 పలకగా.. నేడు రూ. 13,600 పలికింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.16 వేలు ధర రాగా.. ఈరోజు రూ. 16,200 కి పెరిగింది. మరోవైపు 341 మిర్చికి నిన్న రూ.13,500 ధర రాగా ..నేడు రూ .13,400 తగ్గింది.
KMR: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం రెండో రోజు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు పాఠశాలల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు అద్దాలు వాడాలని సూచిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్లు రవీందర్, లింబాద్రీ ఉన్నారు.