JGL: నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేష్ అని మెచ్చుకున్నారు. DSP రఘు చందర్, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, సారంగాపూర్ ఎస్ఐలు దత్తాద్రి, కుమారస్వామి, సుధీర్ రావు ఉన్నారు.
SRD: సిర్గాపూర్లో రెవెన్యూ సదస్సు శుక్రవారం జరగగా ఖేడ్ MLA సంజీవరెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు తహశీల్దార్ హేమంత్ కుమార్తో మాట్లాడి రెవెన్యూ సమస్యల దరఖాస్తులపై అడిగి తెలుసుకున్నారు. గతంలో ధరణి పోర్టల్ వ్యవస్థతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని MLA చెప్పారు. రెవెన్యూ సమస్యలు తొలగించేందుకు తమ ప్రభుత్వం భూభారతి కొత్త చట్టం తెచ్చిందన్నారు.
JGL: ‘ప్రైవేట్ స్కూళ్లు వద్దు – అంగన్వాడీ కేంద్రాలే ముద్దు’ అని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొడిమ్యాలలో శుక్రవారం నిర్వహించిన ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంగన్వాడీల్లో ఆటపాటల ద్వారా విద్యను అందిస్తారని, తద్వారా పిల్లల్లో సమగ్రాభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు.
SRD: జిల్లాలో 100% అక్షరాస్యత సాధించేందుకు ఉల్లాస్ కార్యక్రమం ఉపయోగపడుతుందని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డిలోని మహిళా సమాఖ్య భవనంలో అవగాహన సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. సమావేశంలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి పాల్గొన్నారు.
BDK: పినపాక మండలం పట్టి నగర్ పంచాయతీలో శుక్రవారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలుపరస్తుందని గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వల్ల అనేక అవకతవకలు జరిగాయని, అనేకమంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు.
BDK: నిజామాబాద్లో ఈ నెల 21, 22 తేదీలలో జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఆర్.మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మణుగూరులోని సింగరేణి పని ప్రదేశాల్లో ఈ మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక సమస్యలపై నిర్వహించే ఈ సభలో కార్మికులు పాల్గొనాలని కోరారు.
ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాదులోని అంబేద్కర్ సెక్రటేరియట్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో ప్రజలకు అందజేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు.
JGL: కరీంనగర్ తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెట్పల్లి ఎంఈఓ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. 01-09-2016 నుంచి 31-8-2017 మధ్య వరకు జన్మించిన వారు ఈనెల 15 సాయంత్రం 5 గంటల లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 16 నుంచి 19 వరకు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఎంపిక ఉంటుందన్నారు.
మహబూబబాద్: జూలై 5, 6 తేదీల్లో కురవి మండల కేంద్రంలో జరిగే సీపీఐ జిల్లా 3వ మహాసభల లోగోను సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలను విస్తరింప చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి మహా సభలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం క్రమశిక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు.
MDK: శివంపేట మండలం లచ్చిరెడ్డి గూడెంలో శుక్రవారం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రోసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే లబ్ధిదారులను గుర్తించి 8 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
KMM: జిల్లాలో వాతావరణం మారడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, సత్తుపల్లి, మధిర, బోనకల్, ఏన్కూరు తదితర మండలాల్లో విష జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని స్థానికులు తెలిపారు. విషజ్వరాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
MNCL: భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి సదస్సులని దండేపల్లి తహసీల్దార్ రోహిత్, డీటీ మాధవి అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్యంపేటలో తహసీల్దార్, చింతలపల్లిలో డీటీ రెవెన్యూ సదస్సులలో పాల్గొన్నారు. ప్రజలు, రైతుల నుండి భూ సమస్యలపైన అర్జీలను స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
NRML: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాయి ప్రసాద్ ఆఫ్రికా లోని ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించారు. గతంలో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన సాయి ప్రసాద్, కిలిమంజారో శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శుక్రవారం వారిని ప్రత్యేకంగా అభినందించారు.
SRD: బస్సు పాస్ చార్జీల పెంపకం నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ బస్ పాస్ చార్జీల పెంపు వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతారని చెప్పారు. చార్జీలు తగ్గించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.