HYD: లూలూ హైపర్ మార్కెట్లో ‘బ్యూటీ ఫెస్ట్-2025’ ప్రారంభమైంది. మిస్ సుప్రానేషనల్ ఏషియా-2023 ప్రజ్ఞా అయ్యగారి ముఖ్య అతిథిగా పాల్గొని, హైపర్ మార్కెట్ డీజీఎం విశాల్ కుమార్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నిరకాల బ్యూటీ ఉత్పత్తులను ఒకే చోట అందుబాటులో ఉంచడం గొప్ప విషయమని ఆమె ప్రశంసించారు. ఈ ఫెస్ట్ నేటి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు జరగనుంది.
WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతికి పాల్పడిన ఘటనలో ఇన్స్పెక్టర్తో పాటు ఒక కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల మామూనూరు పోలీస్ స్టేషన్ నుంచి కంట్రోల్ రూమ్కు బదిలీ అయిన సీఐ రమేష్తో పాటు, మామూనూర్ కానిస్టేబుల్ రఘును సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీచేశారు. వీరిపై అవినీతి ఆరోపణలు రాగా విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు.
ASF: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు, సూచలను జారీచేశారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీ పోల్లో నమోదు చేయాలన్నారు.
NGKL: కల్వకుర్తిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు బుధవారం ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. వెంకటేష్కు మూడు రోజులు, ఆకాష్ చారి, సంతోష్ రెడ్డిలకు రెండేసి రోజుల చొప్పున జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 500 జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై వివరించారు.
MBNR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం కార్యాలయంలో బుధవారం మహా శివరాత్రి జాతర సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ చంద్రశేఖర్, మెదక్ జిల్లా దేవాదాయ శాఖ పరివేక్షకుడు వెంకట రమణ సమక్షంలో వేలం జరిగింది. జాతరలో కొబ్బరి ముక్కలు పోగు హక్కు రూ.3.75 లక్షలకు నాగ్సాన్ పల్లి పి.మల్లేశం దక్కించుకున్నట్లు వారు తెలిపారు.
KNR: యువత వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టలని, తద్వారా శరీర దారుఢ్యంతో పాటు, మానసిక ఉల్లాసాన్ని కూడా పొందుతారని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో డాక్టర్ సాయితేజ నెలకొల్పిన హల్క్ జిమ్ సెంటర్ను సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
KNR: భారత రాజ్యాంగం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ అని BJP జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం రోజున కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో రాజ్యాంగ సంవిధాన్ దివస్ వేడుకలు నిర్వహించారు.
BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాల కోసం ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు TRP పూర్తి మద్దతు ప్రకటించింది. ఇవాళ TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ దీక్ష స్థలానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్థలాలు ఇచ్చేవరకు దీక్షకు ప్రతిరోజూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. TRP నేతలు ఉన్నారు
MHBD: కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు పోలీస్ స్టేషన్లను బుధవారం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్ కేసులు ఇతర వివరాలపై ఆరా తీశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలని, పోలీస్ సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
KMR: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి కలెక్టరేట్లో బుధవారం జిల్లా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
NZB: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటర్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం డ్రంక్ & డ్రైవ్లో మొదటి సారి పట్టుబడితే కోర్టులో రూ. 10వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు.
MDK: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టిపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు, డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా అధ్యక్షులు కొంగోటి యాదగిరి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
మెదక్: పాపన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ సహా పలు అంశాలపై తహాసీల్దార్, ఎంపీడీవో, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా అన్ని జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
MDK: తూప్రాన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మాక్ అసెంబ్లీ నిర్వహించినట్లు హెచ్ఎం ఫ్లోరెన్స్ తెలిపారు. విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం గురించి వివరించి, ఉపాధ్యాయులు విజయ కుమారి మార్గదర్శనం చేస్తూ మాక్ అసెంబ్లీని చేపట్టారు. విద్యారంగం, క్రీడలు, రోడ్డు ప్రమాదాలపై చర్చ రసవత్తరంగా సాగినట్లు వివరించారు.