MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం సారలమ్మ గద్దెకు వచ్చేరోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఒకవైపు మేడారంలో అభివృద్ధి, గద్దెల విస్తరణ పనులు జరుగుతుండగా మరోవైపు భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందస్తు మొక్కుల సందడి రోజురోజుకు పెరుగుతుంది.
KMM: ఏసీబీ వలలో మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ చిక్కాడు. ఓ భవన కార్మికుడు మరణించగా, అతని భార్యకు రావాల్సిన రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి చందర్ రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఖమ్మం రోడ్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
MDK: సీఎం రేవంత్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మెదక్లో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. డీసీసీల అధ్యక్షుల సమావేశంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
KNR: హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ, హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ, బుధవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SDPT: కొమురవెల్లి శ్రీ మల్లన్న దేవాలయంలో డిసెంబర్ 7 సాయంత్రం 8.30 గంటల నుంచి డిసెంబర్ 14 ఉదయం 6 గంటల వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. డిసెంబర్ 14న స్వామివారి కల్యాణోత్సవ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్లకు అలంకరణ పనులు జరుగుతున్నాయని ఆలయ EO వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం అర్ధ మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం కల్పిస్తున్నారు.
SRD: జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ ఉండే గ్రామాల్లో ప్రచారం వేగంగా సాగుతోంది. అయితే కొన్ని గ్రామాలలో నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిరోజూ మందు, మాంసాలతో విందులు పెట్టుతూ అభ్యర్థులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చివరకు ఎవరు గెలుస్తారో చూడాలి మరి.
MBNR: స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల రెండవ దశ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయిని దేవి బుధవారం భూత్పూర్, మూసాపేట క్లస్టర్లను సందర్శించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సంబంధిత మండలాల అధికారులు పాల్గొన్నారు.
MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని నిజాంపేట తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారాలకు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
NLG: తిప్పర్తిలో సోమోరిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్గా కోన వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో పంచాయతీలోని ఆరు వార్డులూ ఏకగ్రీవంగా నిలిచాయి. అనంతరం నూతన సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మొత్తం పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గ్రామస్థాయిలో ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచింది.
SDPT: విద్యార్థులు విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకుని పాఠశాలకు, కన్నవారికి గౌరవాన్ని తీసుకురావాలని సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి రాజ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక హైస్కూల్లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థులు ప్రదర్శించిన వంటకాలను రుచి చూసి, వారిని అభినందించారు.
WGL: గీసుగోండ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పరకాల నియోజకవర్గంలో109 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులే గెలవాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిని సహించబోమని హెచ్చరించారు.
NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ లో 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ పేట్ గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యాలయం, ప్రాధమిక పాఠశాలను సందర్శించి, ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
RR: పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనులను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే పట్టణ ప్రగతి కోసం రుణ సమీకరణకు సిద్ధమైనట్లు ప్లానింగ్ అధికారి రమేష్ తెలిపారు. దీని ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్, మౌలిక వసతులు లాంటి వివిధ అంశాల పై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లుగా అధికారి శ్రీధర్ తెలిపారు.
ADB: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్, తదితరులు కశ్యప్కు అభినందనలు తెలిపారు.
MBNR: జడ్చర్ల పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో శ్రీకాంత్ చారి పేరు చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన త్యాగం, పోరాటం, ధైర్యం తెలంగాణ యువతకు ఎప్పటికీ మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.