WGL: సంగెం మండలంలో ఇవాళ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి.. కేక్ కట్ చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పాత్ర మరువలేనిదని, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందన్నారు.
NGKL: తిమ్మాజీపేట మండలం ఆవంచ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ జంగయ్య (40) మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. GPకి చెందిన ట్రాక్టర్ను జంగయ్య నడుపుతుండగా అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి కిందపడిపోయారు. ఈ క్రమంలో ట్రాక్టర్ టైరు ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలో సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద ఆధ్వర్యంలో కేవలం 10 నెలల వ్యవధిలో రూ. 15 కోట్ల విస్తృత అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత BJPకి దక్కిందని మల్కాజ్గిరి MP ఈటల రాజేందర్ అన్నారు. రాజరాజేశ్వరి గార్డెన్లో అభివృద్ధి శీర్షిక పేరుతో కంటోన్మెంట్ ప్రజానీకంతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్టాడారు.
SRPT: జనవరి 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతజయంతి బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఈనెల 30న సూర్యాపేటలో జరిగే జిల్లా కౌన్సిల్ సమావేశానికి జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ సత్యం హాజరవుతారని, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.
BDK: గోదావరి నది తీరం వద్ద ఘనంగా ఏరు ఉత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోదావరి నది తీరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నదీ తీరమంతా పండుగ వాతావరణంతో కళకళలాడగా ఆదివారం సెలవు దినం కావడంతో గోదావరి కరగట్ట ప్రాంతం జనసంద్రంతో నిండిపోయింది.
KMR: భిక్కనూర్ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందే దయాకర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
RR: తుర్కయంజాల్ పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలోని సాయి లీల వెంచర్ పట్టణ ప్రకృతి ప్రక్కన డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో చెత్త కుప్పలు గుట్టలను తలపిస్తున్నాయి. రోజుల తరబడి చెత్తకుప్పలు ఇక్కడే ఉండడంతో చెత్త కుప్పల నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మార్గంలో రాకపోకలు కొనసాగించే బ్రాహ్మణపల్లి, కోహెడ గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
KMM:గ్రీన్ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే సత్తుపల్లి నుంచి ఖమ్మంకు కేవలం 34 నిమిషాల్లోనే చేరుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జనవరి తర్వాత ఈ రహదారిని ప్రారంభిస్తామని గంగారంలో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. సత్తుపల్లి అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే గోదావరి జలాలతో నియోజకవర్గంలోని చెరువులను నింపుతున్నట్లు పేర్కొన్నారు.
NRPT: నారాయణపేట పట్టణంలో దొంగతనాల నివారణే లక్ష్యంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం బస్టాండ్, ప్రధాన కూడళ్లలో అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను ఆధునిక పరికరాలతో తనిఖీ చేశారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వెంకటేశ్వర్లు సూచించారు.
SRPT: తమ స్నేహితుని కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుని, అందరూ కలిసి 35,000 రూపాయల నగదును ఆదివారం మల్లేష్ కుటుంబ సభ్యులకు అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. మల్లేష్ అకాల మరణం తమను ఎంతగానో కలిచివేసిందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి తమ వంతు చిన్న సహాయం అందించామని తెలిపారు.
GDWL: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం ఆర్టీఐ (RTI) కమిషనర్ పి.వి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం కమిషనర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు.
SRD: నూతన సంవత్సర వేడుకలకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ ఆదివారం తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. పోలీసుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NZB: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇటీవల సర్పంచ్లుగా గెలిచిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. యూత్ కాంగ్రెస్ శ్రేణులు క్రమశిక్షణతో పని చేయాలని పేర్కొన్నారు.
ADB: నూతన సర్పంచ్, ఉప సర్పంచ్లు సమాజహితం కోసం పాటుపడాలని మథుర లబాన సమాజ్ జిల్లాధ్యక్షులు సాబ్లే అమర్ సింగ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల నూతనంగా గెలిచిన పలు గ్రామాలకు చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్లను మథుర లబాన సమాజ్ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. రాజకీయాల్లో ఉన్నతంగా రాణించి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనులు మరింత వేగవంతంగా చేపట్టాలని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా, దర్శన సౌకర్యాలు, మౌలిక వసతులు పకడ్బందీగా కల్పించాలని సూచించారు. ఆలయ విస్తరణ పనులు నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.