MDK: పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
NRML: జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సమావేశంలో అధికారులకు ఆదేశించారు. అంగన్వాడి భవనాలు,పాఠశాలల మరుగుదొడ్లు, ఉపాధి హామీ నిధుల పనులను స్వయంగా పర్యవేక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఈఈ చందునాయక్లు పాల్గొన్నారు.
KMR: జుక్కల్ మండలం హంగర్గ శివారులో శుక్రవారం రైతు వీరేశం అంతర్ పంటగా సాగు చేసినా 147 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు. గ్రామానికి చెందిన రైతు సోయా, కంది పంటలో గంజాయిని అంతర్ పంటగా సాగు చేస్తున్నారని చెప్పారు. పక్కా సమాచారం మేరకు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.
ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20 శాతం స్థానాలు కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ను కోరారు. ఈ మేరకు నేరడిగొండలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతారెడ్డి శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. యువజన సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
PDPL: ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించకుంటే ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తామని సుల్తానాబాద్ మండల అధికారులు తెలిపారు. మండలంలోని గర్రెపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి దశలవారీగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా పనులు మొదలుపెట్టనివారి ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించారు.
MNCL: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్ లో 10మంది మావోయిస్టులు మృతి చెందగా వీరిలో ఒకరు బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటిగా భావిస్తున్నారు. చత్తీస్ ఘడ్ పోలీసులు స్థానికంగా ధ్రువీకరించడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసులను సంప్రదించగా తమకు సమాచారం లేదన్నారు.
MBNR: దేవరకద్రలో దసరా పండుగ నాటికి కోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్లో లా సెక్రటరీ పాపిరెడ్డిని ఎమ్మెల్యే కలిసి విజ్ఞప్తి చేశారు. కోర్టు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తన విజ్ఞప్తి మేరకు లా సెక్రటరీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అడ్వకేట్లు పాల్గొన్నారు.
KMM: పాలేరు డివిజన్లో అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పని నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ తమ్మినేని సుబ్బయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 200 రోజులు పని దినాలు కల్పించాలని, ప్రతి కూలీకి రోజువారి వేతనం రూ.600 చెల్లించాలన్నారు.
JN: పాఠశాలలను అందమైన బొమ్మలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి కలిగించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ తెలిపారు. పాలకుర్తి ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతులను సందర్శించి వారు మాట్లాడారు. ఆట పాటలతో విద్య బోధన జరగాలన్నారు. ప్రీ ప్రైమరీ క్లాస్ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు.
NZB: డొంకేశ్వర్ ZPHS పాఠశాల విద్యార్థిని మనుష అద్భుత ప్రతిభ కనబరిచిందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సురేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ క్వాంటం ఏజ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మనుష అద్భుత ప్రతిభ కనబరిచి DEO అశోక్ చేతుల మీదుగా మెమొంటో, ప్రశంసా పత్రం అందుకుందని తెలియజేశారు.
WGL: నర్సంపేట మండలం మగ్దుంపురంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఇస్కాన్ కూకట్పల్లి సహకారంతో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు క్యాన్సర్ నిర్మూలన, నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. వి. జానకి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
SRCL: బోయినిపల్లి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈనెల 19, 20, 21 తేదీల్లో జరగనున్న ఫోటో ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేముల చిరంజీవి, ఉపాధ్యక్షులు దూస రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షాదుల్, దుంపటి శ్రీను, బిల్లా రవీందర్, బొజ్జ వెంకటేష్, దూస రాకేష్, పాల్గొన్నారు.
NZB: సీ.ఎం.ఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలుపర్చాలని కలెక్టర్ T. వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
KMM: పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా నాణ్యమైన పత్తిని మద్దతు ధరపై కొనుగోలుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో 2025-26 పత్తి సీజన్లో సీసీఐచే పత్తి కొనుగోలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. తేమ శాతం ప్రకారం పత్తి పంటకు మద్దతు ధర చెల్లింపు ఉంటుందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
BDK: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు శిధిలావస్థకు వచ్చిన భవనాలను పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్ కోరారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీధర్కు సమస్యలుతో కూడిన వినతిపత్రం అందచేశారు.