KNR: గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సామ రాజిరెడ్డిని కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్లో శాలువాతో సన్మానించారు. రాజిరెడ్డి గ్రామస్థులతో కలిసి బండి సంజయ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు రూ. 10 లక్షల ప్రోత్సాహక నిధులు త్వరలోనే అందిస్తానని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.
NRPT: నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాజాపూర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం ఎస్సై రాముడు పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు పరిశీలించారు. సీసీ కెమెరాలు, క్యూలైన్ల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్లో విద్యుత్ సౌకర్యాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో ఎన్నికల సమయంలో పటిష్ఠ పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
VKB: కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనాపూర్ ఎక్స్-రోడ్ వద్ద జరిగిన సెల్ఫ్-రోడ్ ప్రమాదంలో ఒక యువకుడు మరణించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. కుల్కచర్ల నుంచి నంచర్ల వైపు వేగంగా వెళ్తున్న బైక్ నియంత్రణ కోల్పోయి రాయిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
SDPT: బెజ్జంకిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇస్కిల్ల ఐలయ్య, కొండ్ల వెంకటేశం, ద్యావనపల్లి శ్రీనివాస్, బొల్లం శ్రీధర్, సంఘ రవి మధ్య పోటీ జరుగుతోంది. మొత్తం 14 వార్డులు ఉండగా 12వ వార్డు సభ్యుడిగా తిప్పారపు మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 13 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ADB: దేశంలోని ప్రజానీకం శాంతియుతంగా మెలగాలని ఆదివారం నార్నూర్ మండలంలోని గుండాల గోండుగూడ గ్రామ ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, చిన్నారులు, పెద్దలు కలిసి గ్రామ ప్రధాన రహదారి మూలపై కొలువుదీరిన పోచమ్మ తల్లి మందిరం వద్ద ప్రత్యేక వంటలు చేసి నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కుపటేల్, జంగు, రాజు, అర్జు పాల్గొన్నారు.
NZB: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు విద్యా ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిచాలని రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ జాక్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ఆదివారం డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.
JGL: యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతో పాట రచించడం అభినందనీయమని, జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత అన్నారు. రాయికల్ పట్టణంలో వేణు రచించిన ఎత్తురా జెండా పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి అనిల్ కుమార్, ఉదయశ్రీ, రాణి, సాయికుమార్, శ్రీధర్ రెడ్డి, మహేష్ గౌడ్, మహేందర్, ప్రశాంత్ రావు, రాంప్రసాద్ పాల్గొన్నారు.
SRD: కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది మండలం ఎర్ధనూర్ గ్రామంలో ఎన్నికల ప్రచార సభ ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పేదలకు సన్న బియ్యం, మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేసిన గత కాంగ్రెస్కే దక్కుతుందని చెప్పారు.
NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏసీపీ రాజ వెంకట్ రెడ్డి ఆదివారం జాక్రాన్పల్లి పోలీస్ స్టేషను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా సంక్లిష్ట గ్రామాలు, హాట్స్పాట్ ప్రాంతాల్లో, ప్రతి గ్రామంలో బందోబస్తు, సిబ్బంది కేటాయింపు, రౌండ్లు, పికెటింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుపై పలు సూచనలు చేశారు.
PDPL: రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ అభ్యర్థి చింతపట్ల సుహాసిని నామినేషన్ను ఓటర్ లిస్టులో పేరు లేదని ఈసీ తిరస్కరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆన్లైన్లో పేరు ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోటీకి అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహించింది ఆ గ్రామ ఎన్నికలను నిలిపివేసింది.
SRD: 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు బీసీలు ఐక్యంగా పోరాటం చేయాలని బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్ అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం యువత ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. పోరాటాల ద్వారానే రిజర్వేషన్లు సాధించుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ తరహా బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలన్నారు.
MBNR: BRS పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు సంక్షేమం లభిస్తుందని దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పూర్తిగా విఫలం అయిందన్నారు.
NLG: మిర్యాలగూడ మండలం జంకు తండాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి ధనావత్ పోలి సూర్య నాయక్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి, ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
ADB: నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, సోల్జర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు చౌహన్ కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఆదివారం హైదరాబాదులోని ఉప్పల్లో గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి చేతుల మీదుగా ‘యూత్ ఐకాన్-2025’ అవార్డును అందుకున్నారు. దీంతో పలువురు ఆయనను అభినందించారు.
BDK: పాల్వంచ మండలంలోని నాలుగు గ్రామపంచాయతీల్లో సర్పంచులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిక్కు తండాకు ఝాన్సీ, తవిశలగూడెంకి రమేష్, సంగంకి రవి, ఇల్లెందులపాడు తండాకు తేజవత్ లక్ష్మి సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు. మండలంలోని 36 పంచాయతీలకు గాను 35 పంచాయతీల్లోనే నామినేషన్లు దాఖలయ్యాయి. పాండురంగాపురం పంచాయతీలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.