E.G: దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం ముగిసింది. కొల్లూరు సుబ్బమ్మకు చెందిన 14 ఎకరాల భూమిని 1982 నుంచి పాసుపుస్తకాలు లేకుండానే స్థానిక పేద రైతులు సాగు చేస్తున్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా, తాజాగా భూమి హక్కు పట్టాదారులదేనని తీర్పు వెలువడింది. శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు.
ATP: జిల్లా మట్టి వాసనతో రూపొందిన ‘సొట్టా బుగ్గల పిల్లో’ ఫోక్ సాంగ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి అతిథిగా పాల్గొని పాటను ఆవిష్కరించారు. అనంతపురం స్వరం, ఇక్కడి లొకేషన్లలోనే చిత్రీకరించిన ఈ జానపద గీతంపై ఆమె ప్రశంసలు కురిపించారు. కళాకారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైనట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. చిత్తూరులోని ఇరువారం, కుప్పంలోని కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
VSP: మధురవాడ శిల్పారామంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయ శిల్పారామం పరిపాలనాధికారి రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘గగన సిరి డాన్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో కళాకారులు కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు.
CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి ఆదివారం సైతం వసూళ్ల కేంద్రాన్ని అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయంలో పన్ను వసూళ్ల కేంద్రాలు పనిచేస్తాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం కానుకల హుండీల లెక్కింపు పూర్తైంది. హుండీల ద్వారా రూ.48,76,103, అన్నదాన హుండీ ద్వారా రూ.2,81,368 ఆదాయం వచ్చినట్లు ఉపకమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
PLD: వినుకొండ నియోజకవర్గం రాముడిపాలెంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పర్యటించారు. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పొలాలను ఆయన పరిశీలించారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
KDP: టీం ఇండియా మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి ఇవాళ కుటుంబ సమేతంగా కడపలోని శ్రీ విజయ దుర్గాదేవిని దర్శించుకున్నారు. పదేళ్లుగా ఆమె తల్లి ఈ ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తుండగా, శ్రీచరణి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు.
SKLM: మందస మండలం డిమిరియా గ్రామ సమీపాన గెడ్డలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు అంబుగాంకు చెందిన గుడియా జగన్నాథ్(47)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
GNTR: ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న డీఎస్ఆర్ కృష్ణకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE)గా పదోన్నతి కల్పించారు. వైస్ చాన్సలర్ కే. గంగాధర రావు ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ సింహాచలం, ఓఎస్డీ రవికుమార్, ఇంజనీర్ రాజకుమార్ పాల్గొన్నారు.
BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రేపు యద్దనపూడి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు యద్దనపూడి గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయం వర్గాలు తెలిపాయి.
PLD: ఆస్తి, అధికారంపై వ్యామోహం, తల్లీచెల్లెళ్లపై విద్వేషమే జగన్ నైజమని ఎమ్మెల్యే పుల్లారావు విమర్శించారు. బాబాయ్ హత్యతో లబ్ధి పొంది, ఆయన బిడ్డను వేధించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకోవడం తగదన్నారు. దేవుడితో ఆటలాడితే వైసీపీ నేతలకు తగిన శాస్తి తప్పదన్నారు.
E.G: తాళ్లపూడిలోని కరిబండి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. APSSDC సహకారంతో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తారని అన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో సుంకుల పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్రస్థాయి పాల పండ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. కోడుమూరు వృషభాలు ప్రథమ, ప్రకాశం జిల్లా ద్వితీయ, సీసంగుంటల తృతీయ, మంత్రాలయం-బేతంచెర్ల నాల్గవ, మాధవరం ఐదవ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు రూ.40 వేల నుంచి రూ.10 వేల వరకు బహుమతులు అందజేశారు.
SKLM: పోలాకి మండల కేంద్రంలో నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అర్చన శనివారం రాత్రి పర్యటించారు. ఈ మేరకు అనకాపల్లిలో మార్చి 23న జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.