TPT: సూళ్లూరుపేట(M) కోటపోలూరు వెస్ట్ హరిజనవాడలో నీటి ట్యాంక్ నుంచి తాగునీరు భారీగా వృథా అవుతోంది. రాత్రి నుంచి పైప్లైన్ పగిలిపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు తెలిపారు. తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
BPT: జమ్ములపాలెంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఉప్పాల సురేష్ అనే వ్యక్తి.. కగ్గా బ్రహ్మవాసుకు మద్యం తాగించాడు. ఆ తర్వాత ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తప్పు చేశావని వాసు ప్రశ్నించడంతో సురేష్ కత్తితో దాడి చేశాడు. గాయపడిన బాధితుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాసు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
AKP: రాంబిల్లి మండలంలో ఈనెల 23న సీఎం చంద్రబాబు చేపట్టనున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ శంకుస్థాపనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అచ్యుతాపురంలో కూటమి నేతలతో ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు సుమారు 15 వేల మందిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
NDL: టీడీపీ నాయకులు ఈద్గా కూల్చివేతపై ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లెలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంత్రి బీసీ ఈద్గాను అర్ధరాత్రి కూల్చివేశారని ఆరోపించారు. అన్యాయమని అడగటానికి వెళ్తే తమనే అరెస్ట్ చేయించారని అన్నారు. నిజాలు బయటకు వస్తే టీడీపీ నీచ రాజకీయాలు బయటకు వస్తాయని ఆరోపించారు.
SKLM: ప్రజలకు రుచికరమైన భోజనం అందించాలని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. పొందూరు మండలంలోని రాపాక జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఓ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించినప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అన్నారు.
GNTR: పెదకాకానిలో సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానికులు హాజరయ్యారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామ శివారుల్లో ఉన్న రాయల చెరువు మెయింటెనెన్స్ పనులకు ఆర్ఆర్ఆర్ కింద రూ. 1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ తెలిపారు. రాయల చెరువు గట్టుపై పేరుకుపోయిన చెట్లను తొలిగించుట, గట్టును బలోపేతం చేయుట, కాలువలకు మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు.
TPT: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తిరుపతిలో జనసైనికులు భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.
ATP: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కళ్యాణదుర్గంలో ఘన స్వాగతం లభించింది. స్వర్గీయ ఉన్నం హనుమంతరాయ చౌదరి సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్ మొద్దీన్ సాదర స్వాగతం పలికారు. చౌదరి క్యాంపు కార్యాలయం వద్ద మంత్రిని ఆత్మీయంగా ఆహ్వానించారు.
CTR: పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు జరతున్నాయి. 6వ రోజు ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యాధికారులతో పాటు నర్సులకు,సెక్యూరిటీ సిబ్బందికి ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. తదుపరి అక్కడ వారికి కరపత్రాలు బ్రోచర్స్ను పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 101కు ఫోన్ చేయాలని తెలిపారు.
CTR: వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇల్లు తాళం వేసి ఎక్కువ రోజులు ఊరెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. ఊరు వెళ్లేటప్పుడు ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును లాకర్లలో భద్ర పరచుకోవాలి అని సూచించారు.
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి అవిలాల పంచాయతీ సుబ్బయ్య కాలనీలో పాపాయమ్మ (80) హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఒంటరిగా జీవిస్తున్న ఆమెను తువాలుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న డబ్బులు కోసమే ఈ హత్య జరిగినట్లు సమాచారం.
ASR: సిరిగిందలపాడులో 15 ఎకరాల ప్రభుత్వ భూమి తక్కువ ధరకే ప్రైవేటు వారికి కేటాయించడంపై ఆదివాసి గిరిజన సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామసభ అనుమతి లేకుండా భూమి బదిలీ జరగడం పిసా చట్టం 1996కు విరుద్ధమని పేర్కొంది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. సంబంధిత జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ATP: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల ఎమ్మెల్యే పరిటాల సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. పవన్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమాల నుంచి ఈ సందేశాన్ని పంచుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
TPT: పాకాల టౌన్ కమ్మవీధికి చెందిన వెంకన్న (40) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుమలలో కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేక బాడుగ ఇంటిలో నివసించేవాడు. అనారోగ్యంతో పాటు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.