VSP: సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో ధనుర్మాసంతో పాటు వివిధ ఉత్సవాల నేపథ్యంలో రద్దు చేసిన ఆర్జిత సేవలను ఇవాళ నుంచి పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు తెలిపారు. ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, సహస్రనామార్చన, గరుడ వాహన సేవ, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన, తదితర ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భక్తులు గమనించాలన్నారు.
CTR: ఐరాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిశారు. తమ సంఘం ద్వారా ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు. పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో పాఠశాలను సందర్శిస్తానని తెలియజేశారు.
TPT: తిరుపతిలో సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా 2025-26 రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు కార్యక్రమంపై అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీఆర్వో నరసింహులు పాల్గోన్నారు.
KDP: ఈనెల 20న మంత్రి ఎస్. సవిత జిల్లాకు రానున్నారు. 22, 24 తేదీల్లో కడపలో జరగనున్న దీని ఇస్తిమా ఏర్పాట్లపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్తో కలిసి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రార్థనలకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం తాగునీరు, మౌలిక సదుపాయాలపై చర్చించనున్నారు.
ELR: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి డయాలసిస్ అసిస్టెంట్ సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే తప్పుడు ఫిర్యాదుపై విచారణ చేయకుండానే అధికారులు చర్యలు తీసుకోవడం వల్లే మనోవేదనతో సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కలెక్టర్కు విన్నవించినా పట్టించుకోలేదని సుధాకర్ లేఖలో పేర్కొన్నారు.
ASR: జిల్లా పశు వైద్య శాఖ అధికారిగా డాక్టర్ మంచు కరుణాకర్ నియమితులయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న మంచు కరుణాకర్ అల్లూరి జిల్లా పశు వైద్యాధికారిగా పదోన్నతిపై వచ్చారు. ఈమేరకు సోమవారం ఆయన పాడేరు కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు.
TPT: ఈనెల 23న SC,ST సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి పోలీస్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులందరు హాజరు కావాలని ఆదేశించారు.
KDP: వల్లూరు మండలంలోని గోటూరు క్రాస్ వద్ద గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడి చేసి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు తహసీల్దార్, ఎక్సైజ్, పోలీసు సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు.
అన్నమయ్య: గుర్రంకొండ ఏబీసీ స్కూల్ అనుమతికి రూ.45 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాష (మున్నా), అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మదనపల్లి డీవైఈవో కార్యాలయంలో ట్రాప్ నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సీతారామారావు తెలిపారు.
GNTR: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముఖ్యమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్జీ పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు తెలియజేశారు.
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి కలెక్టర్ బాలాజీ సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కోనసీమ: అంతిర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమీక్ష లో కలెక్టర్ మాట్లాడుతూ భద్రత, పార్కింగ్, ఆర్టీసీ బస్సులపై దిశా నిర్దేశం చేశారు. సీసీ టీవీ నిఘాతో పాటు డ్రోన్లతో పగడ్బందీ భద్రత చర్యలు ఏర్పాటు చేయాలన్నారు.
PLD: పెదకూరపాడు, 75 తాళ్లూరు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. 59 ఎద్దులు, 350 సూడి గేదలకు, నట్ట నివారణ ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించామని డాక్టర్ శివకుమారి తెలిపారు. జనవరి 13 నుంచి 30 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
CTR: జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదని జిల్లా అధ్యక్షుడు కన్నన్, కార్యదర్శి పుష్పరాజు పేర్కొన్నారు. పింఛన్ రూ.4 వేల నుంచి 7 వేలకు పెంచాలన్నారు.