W.G: ఆకివీడు పెదపేట గుడి వివాదంలో రాజకీయ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించకూడదని CPM ఏరియా కమిటీ కోరింది. ఇరు వర్గాలను సమన్వయ పరుస్తూ మతసామరస్యం పెంపొందించాలని బుధవారం ఏరియా కార్యదర్శి కె. తవిటి నాయుడు సూచించారు. వివాద పరిష్కారానికి శాంతి కమిటీ వేయాలని, ఎవరూ రెచ్చగొట్టే ధోరణిలో ప్రయత్నించవద్దని కోరారు.
SKLM: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇవాళ నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షైక్ మహబూబ్ షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు .
KDP: ఖాజీపేట(M) ఆంజనేయ కొట్టాల గ్రామంలోని పశు వైద్యశాలలో సమస్యలు వేధిస్తున్నాయి. ఈ ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మరుగుదొడ్డి, మంచినీరు వంటి కనీస సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని, ఆసుపత్రికి వచ్చే పాడి రైతులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.
TPT: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్-2 పరీక్ష జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 24,332 మంది విద్యార్థులకు గాను 23,999 మంది విద్యార్థులు హాజరైనట్లు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 333 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలియజేశారు.
KRNL: కర్నూలు జిల్లా విశ్రాంత జాయింట్ కలెక్టర్-2 ఎస్. రామస్వామి బుధవారం మృతి చెందారు. 2022లో పదవీ విరమణ పొందిన ఆయన, గతంలో జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) అనేక ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. రామస్వామి మృతికి జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. పరిపాలనలో ఆయన అందించిన విశేష సేవలను పలువురు కొనియాడారు.
కోనసీమ: అమలాపురం మండలం మున్సిపల్ కాలనీ వెనుక ఉన్న శ్మశానంలో పేకాట శిబిరంపై పట్టణ ఎస్సై NR కిషోర్ బాబు సిబ్బందితో కలిసి నిన్న రాత్రి మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న కాలాడి వెంకటేశ్, తాళ్ల భగవాన్ రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,050 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. జూదాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
అన్నమయ్య: మదనపల్లె- బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఇవాళ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించనున్నారు. డీఐజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీరజ్ అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
CTR: మూడు జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్తుల ఏర్పాటు పని ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ ఎన్నికల నాటికి అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్లో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
VSP: మారికవలస కాలనీలోని 1 నుంచి 10 బ్లాకుల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరుతుండటంతో, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు తెలిపారు. ఈ కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NTR: పెనుగంచిప్రోలులోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఆస్తులు నిట్టనిలువునా తుప్పు పట్టిపోతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించాల్సిన ఇనుప చువ్వలను ఏళ్ల తరబడి ఆరుబయట వదిలేయడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KRNL: ఆదోనిలోని 2, 41వ వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. బాబాజీ పేట, శుక్రవారంపేట ప్రాంతాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కింది స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం, మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ప్రకాశం: పొగాకు కార్మికులకు రోడ్డు భద్రత, మహిళల రక్షణపై సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.
KDP: సిద్ధవటంలోని ZP హైస్కూల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రెండో రోజు బుధవారం పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించబడ్డాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని నిబంధనలను పాటిస్తూ పరీక్ష రాశారు.
CTR: పట్టణాల్లో ఆస్తి, నీటి పన్ను లక్ష్యాలను చేరుకునేందుకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఉంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు.
KRNL: నారాయణపురం గ్రామంలో సర్పంచ్ సరళమ్మ ఆధ్వర్యంలో ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని వీధి వీధి తిరిగి పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. మురికి కాలవలను శుభ్రపరిచి మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నారు. అంటువ్యాధులు, దోమలు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామ ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు.