SKLM: ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. అర్జీదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 55 వినతులు స్వీకరించినట్లు తెలిపారు.
W.G: ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నరసాపురం బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. CM సహాయనిధి నుంచి మంజూరైన రూ.7.50 లక్షల విలువైన చెక్కును రాయపేటకు చెందిన తమ్మిశెట్టి బాజ్జీ కుటుంబానికి సోమవారం అందజేశారు. నేరుగా లబ్ధిదారుల నివాసానికే వెళ్లి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
KDP: పులివెందుల – తొండూరు ప్రధాన రహదారిలోని చెట్ల నీడన తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత వేసవికాలంలో ప్రజలు అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు తాటి ముంజల వైపు మొగ్గు చూపుతున్నారు. డజన్ తాటి ముంజలు రూ.80 నుంచి రూ.100ల వరకు విక్రయిస్తున్నారు. తాటి ముంజలను తినడంవల్ల శరీరం డిహైడ్రేషన్ కాకుండా కాపాడి, శరీర బరువును తగ్గిస్తుంది.
SKLM: మెలియాపుట్టి మండలానికి ITDA ఏర్పాటు కోసం బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఇవాళ ST కమీషన్ ఛైర్మన్ సొళ్ల బొజ్జి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ITDA ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NTR: తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లిలో సోమవారం సిలువ మార్గ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్థానిక RCM చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు పడిన శ్రమలను స్మరించుకుంటూ, భక్తులు సిలువను మోస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రార్థనలతో ఊరేగింపు నిర్వహించారు.
ATP: కనేకల్ మండలం బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యాలయాల్లో తప్పు జరిగితే భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలు చేపడతామని పీడీఎస్యూ యువత పేర్కొన్నారు. భగత్ సింగ్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు.
KRNL: ప్రభుత్వం ప్రవేశపెట్టిన AP-AIMS యాప్ను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఏవో సురేశ్ బాబు రైతులకు సోమవారం సూచించారు. ఈ యాప్ ద్వారా పంట వివరాలు, వాతావరణ సమాచారం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు వంటి వ్యవసాయ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చన్నారు. రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో తమ రైతు విశిష్ఠ సంఖ్యను నమోదు చేసుకోవాలని తెలిపారు.
ELR: గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చడంలో జలజీవన్ మిషన్ పథకం ఒక గొప్ప వరం లాంటిదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం దెందులూరులో రూ.65.10 లక్షల రూపాయల జల్జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన ఓవర్ హెడ్ రిజర్వాయర్ సిస్టం పనులకి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ప్రజలకు త్రాగునీరు సమస్యలు పరిష్కరిస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్(SDC)గా శ్రీకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనిచేస్తానని తెలిపారు.
కోనసీమ: నక్కపల్లిలో జరుగుతున్న ఆర్కలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సోమవారం రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ విచ్చేసారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విశాఖపట్నం పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు విషయాలుపై చర్చించారు.
KDP: అక్కంపల్లి గ్రామంలో తాగునీటి సమస్యపై టి. సుండుపల్లి మండలంలో టిడిపి ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తక్షణ స్పందన తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం ఆదేశాలు ఇచ్చారు. సమస్య త్వరగా పరిష్కారమవుతుందని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
W.G: ఆకివీడు మండలంలోని పేకాట స్థావరాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించి 9 మందిని అరెస్టు చేశారు. దుంపగడపలో ఐదుగురిని అరెస్టు చేసి రూ.7,800, సిద్దాపురం శివారులో నలుగురిని పట్టుకుని రూ.6,200 స్వాధీనం చేసుకున్నట్లు SI హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి, వారిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు వివరించారు.
అన్నమయ్య: కె.వి.పల్లి మండలం సొరకాయలపేట గ్రామం వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై బి. వెంకట శివకుమార్ తెలిపారు. పక్కా సమాచారంతో పేకాట శిబిరంపై దాడి చేసి అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ. 7,500 నగదు, 4 బైకులు, 3 సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం: ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం HP పెట్రోల్ బంక్ వద్ద ఇవ్వల రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించని డ్రైవర్ బస్సును ఆ వ్యక్తి తలపై నుంచి పోనివ్వడంతో అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సోమవారం పొదిలి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న హత్యలు, మహిళలపై నేరాల కేసులను సమీక్షించి, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ పెంచి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని, ప్రజలకు భద్రతా భావం కల్పించాలని అధికారులకు సూచించారు.