• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అంగన్వాడి కార్యకర్త చేమూరు పెంచలమ్మ మృతి

CTR: వెంకటగిరి రూరల్(మం) పట్రపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడి కార్యకర్త చేమూరు పెంచలమ్మ(50) గురువారం మృతి చెందారు. ఈ నెల 2న విజయవాడలో జరిగిన అంగన్వాడి నిరసన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెంచలమ్మ అంతిమయాత్ర శుక్రవారం పట్రపల్లి గ్రామంలో నిర్వహించనున్నారు.

March 12, 2026 / 10:54 PM IST

ఏకగ్రీవంగా ఏపీ జేఏసీ ఎన్నికలు

VZM: ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య వేదిక ఎన్నికలు గురువారం చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్‌గా ఎల్.అప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శిగా మీసాల అప్పలనాయుడు ఎన్నికయ్యారు. అలాగే, కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగింది.

March 12, 2026 / 10:06 PM IST

CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు

అన్నమయ్య: అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు గురువారం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలో జరుగుతున్న ప్రగతి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాలో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలు ముఖ్యమంత్రికి వివరించారు.

March 12, 2026 / 10:00 PM IST

నరసాపురంలో ఖాళీ బిందెలతో నిరసన

W.G: సరిపల్లి పద్మశ్రీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తమైంది. ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా కాలనీకి చేరుకున్న బృందానికి మహిళలు తమ గోడును విన్నవించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై ఖాళీ బిందెలతో కూర్చొని ఆందోళన చేపట్టారు. నీటి సమస్యను పరిష్కరించి కాలనీవాసులను ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు.

March 12, 2026 / 10:00 PM IST

రేపు రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ

KDP: జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ-పీఏం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులు డేటాను సిద్ధం చేశారు. మూడో విడత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 2,15,283 మంది రైతులకు రూ.125.97 కోట్లు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

March 12, 2026 / 10:00 PM IST

ఉగాదికి మహానందిలో నిరంతర దర్శనం

NDL: ఉగాది పర్వదినం సందర్భంగా మహానంది ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రేపటి నుంచి నిరంతర దర్శనం కల్పించనున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి నిర్ణయించినట్లు ఏఈవో మధు గురువారం తెలిపారు. ఉదయం 5 గంటలకు అష్టవిధ మహా మంగళహారతుల అనంతరం సేవా దర్శనాలు ప్రారంభమవుతాయి. టికెట్ల కోసం రెండు కౌంటర్లు, ప్రసాదాల కోసం రెండు కౌంటర్లు నిరంతరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 12, 2026 / 10:00 PM IST

రేపు ‘కవయిత్రి మొల్ల’ జయంతి వేడుకలు

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని వివేకానంద భవనములో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ‘కవయిత్రి మొల్ల ‘జయంతిని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సం క్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు.

March 12, 2026 / 09:49 PM IST

గ్యాస్ కొరతపై వదంతులు నమ్మవద్దు: జేసీ

TPT: యుద్ధ ప్రభావంతో గృహ అవసరాల గ్యాస్ కొరత ఏర్పడిందనే వదంతులు నమ్మవద్దని, జిల్లాలో తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శేషాచలం పాల్గోన్నారు.

March 12, 2026 / 09:46 PM IST

పిజ్జా సర్వర్‌గా పనిచేస్తున్న యువతికి వైవీయూ గోల్డ్ మెడల్

KDP: ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డితోట సువర్ణ పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించింది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఎంఏ హిస్టరీలో ప్రతిభ కనబర్చిన ఆమెకు శుక్రవారం జరగనున్న వైవీయూ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ అందజేయనున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ప్రొద్దుటూరులోని రిలయన్స్ మార్ట్‌లో పిజ్జా సర్వర్‌గా పనిచేస్తున్న సువర్ణకు ప్రజలు అభినందనలు తెలిపారు.

March 12, 2026 / 09:30 PM IST

మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

W.G: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం యల్.హెచ్.టౌన్ హాల్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

March 12, 2026 / 09:30 PM IST

రాజంపేటలో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని బోయినపల్లి ప్రాంతంలో కృష్ణవేణి అనే మహిళ గురువారం ఉరివేసుకుని మృతిచెందింది. ఆమె భర్త శ్రీరామ్ శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. దంపతుల మధ్య కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 12, 2026 / 09:00 PM IST

టంగుటూరులో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న బీసీ ఇందిరమ్మకు స్థానిక టీడీపీ నాయకులకు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ జాతరలో బీసీ ఇందిరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 12, 2026 / 09:00 PM IST

గంజాయి కేసులో 14ఏళ్ల జైలు

VZM: గంట్యాడ పోలీస్ స్టేషన్‌లో 2017లో నమోదైన 641 కిలోల గంజాయి రవాణా కేసులో 9 మంది నిందితులకు కోర్టు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధించిందని ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. కొటారుబిల్లి జంక్షన్ వద్ద మూడు వాహనాల్లో గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. విచారణ అనంతరం జడ్జి మీనాదేవి తీర్పు వెలువరించారన్నారు.

March 12, 2026 / 08:57 PM IST

మహిళా సాధికారతే లక్ష్యం: ఎంపీ దగ్గుమళ్ళ

CTR: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. గ్రామీణ మహిళలకు విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు STW పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకంపై లోక్‌సభలో ప్రశ్నించగా కేంద్ర సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు.

March 12, 2026 / 08:55 PM IST

కేంద్ర మంత్రితో మండల అధ్యక్షుడు భేటీ

SKLM: సోంపేట మండల టీడీపీ అధ్యక్షుడు మడ్డు కుమార్ గురువారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బారువ పంచాయతీలో సుంకర వీధిలో ఇండోర్ స్టేడియం నిర్మాణం, బారువ బీచ్‌‌లో సోలార్ లైట్లు ఏర్పాటు, సుందరీకరణ పనులకు సహకరించాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

March 12, 2026 / 08:52 PM IST