AKP: ఎస్.రాయవరం మండలంలో రబీ సీజన్లో ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల జాబితాలను సంబంధిత రైతుసేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నట్లు ఏవో సౌజన్య సోమవారం తెలిపారు. నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు ప్రతి రైతు సేవా కేంద్రంలోనూ గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సభల్లో ఈ-క్రాప్ నమోదు వివరాలు తెలియజేస్తామన్నారు. సవరణలు ఉంటే పోర్టల్లో సరి చేయించుకోవాలన్నారు.
PPM: PGRSకు వచ్చిన అర్జీదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి కెే. హేమలతతో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కాగా, ఇవాళ్టి పీజీఆర్ఎస్కు 95 అర్జీలు వచ్చాయి.
KDP: బద్వేల్ అర్బన్ పోలీసులు వైసీపీ జడ్పీటీసీ వంకెల చిన్న పోల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం చిన్న కేశంపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం విచారణ కోసం బి.కోడూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
W.G: పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని నరసాపురం మెయిన్ కెనాల్పై రూ.12 కోట్లతో నిర్మించనున్న డబుల్ లైన్ బ్రిడ్జి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు.
VZM: బొబ్బిలిలోని పలు ఏరియాలలో సోమవారం కమిషనర్ ఎల్.రామలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగాకాలువలను ఎప్పటికప్పుడు డిసిల్టేషన్ చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా జరుగుతున్న ప్రాంతంలో ప్రజలతో మమేకమై సరైన సమయానికి త్రాగునీటి సరఫరా జరుగుతుందా లేదా అని తెలుసుకొన్నారు.
E.G: దేవరపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో HPV టీకాపై ఎంపీపీ కేవీకే దుర్గారావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలో అర్హులైన 524 మంది బాలికలను గుర్తించడం జరిగిందన్నారు. వారికి త్వరలోనే టీకాలు అందజేస్తామని PHC వైద్యాధికారి డి.సంజీవ్ కుమార్ తెలిపారు. స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించే HPV టీకా పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
ASR: హుకుంపేట మండలం ములియపుట్టు సచివాలయాన్ని ఆర్డీవో లోకేశ్వరరావు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సందర్శించారు. రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
అనంతపురంలోని 40వ డివిజన్ ఆజాద్ నగర్ హసేన్ మసీదు వద్ద సోమవారం మహబూబ్ ఖాన్ ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సోమవారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలో మంత్రి నివాసంలో రాయచోటి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రమణారెడ్డి మంత్రికి పూల బొకే అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ కమిషనరుకు సూచించారు.
CTR: సుగుటూరు గంగమ్మ జాతర నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఇవాళ అధికారులతో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మంగళ, బుధవారాల్లో సెలవు పెట్టవద్దని కమిషనర్ సూచించారు. అనంతరం విధి విధానాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జాతర రెండు రోజుల పాటు ఎవరూ సెలవు పెట్టకూడదని, అలా చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
NLR: ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేజర్ల సుధాకర్ రావు తెలియజేశారు. శనివారం ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆకుకూరలు పండించే ప్రాంతాల్లో హెల్త్ సిబ్బంది పర్యటించారు. గోంగూర అత్యంత తక్కువ ఖర్చు, ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారమని ఈ సందర్భంగా తెలియజేశారు.
NTR: నందిగామ బార్ అసోసియేషన్ సభ్యులు క్రాంతి కుమార్ సుప్రీంకోర్టు ప్యానల్ అడ్వకేట్గా నియమితులైన్నారు. ఈ సందర్భంగా ఆయనను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే సుప్రీంకోర్టు ప్యానల్ అడ్వకేట్గా పనిచేయటం నందిగామ న్యాయవాదులకు ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు.
AKP: ఇద్దరు గంజాయి నిందితులకు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం తెలిపారు. నిందితులు వీ.జయరాం, జీ.భీమరాజు 2016 సెప్టెంబర్లో 148 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ గౌరీపట్నం వద్ద పట్టుబడినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో ఇవాళ శిక్ష పడిందన్నారు.
TPT: తిరుపతి నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 40 వినతులు అందినట్లు కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఇందులో 28 మంది నేరుగా, 12 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారని పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.
VZM: ఎల్.కోట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14-15 ఏళ్ల బాలికల కోసం ఏర్పాటు చేసిన హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ ముప్పును నివారించడంలో ఈ టీకా రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.