కోనసీమ: పి.గన్నవరం మండలం నరేంద్రపురంకి చెందిన శేషారత్నం, పోతవరంకి చెందిన శ్రీలక్ష్మి మస్కట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు సెంటర్ ఫర్ మేగ్రేషన్ను సంప్రదించగా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో వారి రాక సాధ్యం అయింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గుర్తింపు పొందిన ఏజెంట్లు ద్వారానే విదేశాలకు వెళ్లాలని సూచించారు.
E.G: కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన ఆర్డివో కె. ఆనందరావు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, రానున్న పుష్కరాల ఏర్పాట్లపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్లు పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ATP: శ్రీ రామనవమి పర్వదినం వేళ తాడిపత్రిలోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పెన్నానది తీరాన వెలసిన ఈ ఆలయంలో ఏటా రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
W.G: కుటుంబ సభ్యులను, పోలీసులను పక్కదోవ పట్టించి తాను చనిపోతున్నానంటూ వాయిస్ మెసేజ్ పెట్టి అదృశ్యమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తణుకునకు చెందిన చిట్టూరి భీమరాజు తన ప్రేమ వ్యవహారం కారణంగా కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపి తన బైక్, చెప్పులను కాలువ వంతెన వద్ద పెట్టి అదృశ్యమయ్యాడు. తన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అతనిని గుర్తించారు.
చిత్తూరులో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి మహోత్సవ బైక్ ర్యాలీని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం కొంగారెడ్డి పల్లి, శాంతినగర్ కాలనీలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ర్యాలీని ప్రారంభించి సొంతంగా బైక్ని నడిపారు. నగరం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
GNTR: జిల్లాలో ఎండల తీవ్రత పెరగనుంది. శనివారం జిల్లాలోని 16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వడగాల్పుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అన్నమయ్య: గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా శుక్రవారం నందలూరులో పర్యటించారు. రైల్వే గేట్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ పనులు నాసిరకంగా ఉన్నాయని, నీటి లీకేజీ, గుంతల సమస్యలను రాచూరి మురళి తెలియజేశారు. దీనిపై స్పందించిన డీఆర్ఎం త్వరలో మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు.
NLR: రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో హైవే అధికారులు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. గుడ్లూరు పోలీస్ స్టేషన్కు శుక్రవారం బ్రీత్ అనలైజర్ పరికరాన్ని అందజేసి తమ బాధ్యతను చాటుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని గుర్తించేందుకు పరికరం ఉపయోగపడుతుందని ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. దీని ద్వారా రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయవచ్చన్నారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రసూల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త లైన్లు పనులు జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఎర్రచేలు, విరువూరు రోడ్డు, కరెంటు ఆఫీసు కాలనీ, పాత స్టేట్ బ్యాంకు రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
ATP: అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. జిల్లా ఎస్పీ పి.జగదీష్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామి వార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా సీతారాముల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా సాగింది.
KKD: జిల్లాలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని , సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని శుక్రవారం JC అపూర్వ భరత్ స్పష్టం చేశారు . కాకినాడ కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు . సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 8886903611కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
VZM: కొత్తవలస కుమ్మరి వీధిలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం కన్నులపండుగగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకను పట్టణ భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ATP: శ్రీరామనవమి సందర్భంగా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై కొలువు తీర్చి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ఈఓ విజయరాజు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
VSP: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి సభను ఈ నెల 29న అల్లిపురం సీపీఐ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు నాస్తిక సమాజం నేతలు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జరిగే సభలో పలువురు వక్తలు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సమావేశంలో గోడపత్రికలు ఆవిష్కరించారు. ప్రజలు, ప్రగతిశీల వాదులు పెద్దఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
VZM: ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ఆదివాసీలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర తెలిపారు. విజయనగరంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన గిరిజన నాయకులను ఎమ్మెల్యే అవమానించారని ఆరోపించారు. అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.