కృష్ణా: గుడివాడ ముగ్గు బజారులో 40 ఏళ్లుగా శవపేటికలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న అబ్దుల్ వాహెద్పై జరిగిన దాడి అధికార పార్టీకి చెందిన చిల్లర గ్యాంగ్ దౌర్జన్యానికి నిదర్శనంగా మారిందని మాజీ మంత్రి కఠారి శుక్రవారం విమర్శించారు. బాధితుడికి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మైనారిటీలపై ఈ తరహా దాడులు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
ATP: గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీ బాలమునిని శుక్రవారం ధర్మ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని వీరాంజనేయులు పేర్కొన్నారు.
ASR: అరకులోయ మండలంలోని అన్ని పంచాయితీలలో ఈ నెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లవరాజు తెలిపారు. ఈ గ్రామసభలో మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టం స్ధానంలో ఏర్పడిన విసిత భారత్ గ్యారంటీ రోజగార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (VB G RAM G) చట్టం పై ప్రజలకు అవగాహణ కల్పిస్తారని అన్నారు. కావున ప్రజలు ఈ గ్రామసభలలో తప్పని సరిగా పాల్గొనాలని ఎంపీడీవో, ఏపీవో కోరారు.
TPT: తొట్టంబేడు పరిధిలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. వరదయ్య పాలెం వైపు బైకుపై చందు (21) వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఏరియా హాస్పిటల్కు తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
మార్కాపురం : ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్లో మార్కాపురం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పీ.రాజబాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
CTR: చౌడేపల్లి మండలంలో వెలసిన బోయకొండ గంగమ్మను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.
BPT: అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలవడంతో, బాపట్ల జిల్లా అధికారులు నూతన మ్యాప్ను విడుదల చేశారు. గతంలో ఆరు నియోజకవర్గాలు, 25 మండలాలతో ఉన్న బాపట్ల జిల్లా, ఈ మార్పు తర్వాత ఐదు నియోజకవర్గాలు, 20 మండలాలకు పరిమితమైంది. మారిన జిల్లా సరిహద్దులను ప్రతిబింబించేలా ఈ కొత్త మ్యాప్ను రూపొందించారు.
ప్రకాశం: మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం గిద్దలూరులోని TDP కార్యాలయంలో గిద్దలూరు, బేస్తవారిపేట మండలాలకు చెందిన 39 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు MLA అశోక్ రెడ్డి పదోన్నతి పత్రాలు అందించారు. నియోజకవర్గంలోని లబ్దిదారులకు ఆయన పత్రాలు పంపిణీ చేశారు.
అన్నమయ్య జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పాఠశాలలు, కళాశాలల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఆకతాయిల ఆగడాలు, ఈవ్ టీజింగ్ను అరికట్టేందుకు శక్తి టీమ్స్ పర్యవేక్షణ కొనసాగిస్తాయని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులపై వెంటనే 100 / 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
NTR: నందిగామలో శుక్రవారం సాయంత్రం శత వార్షిక ముక్కోటి మహా మంటపంలో 126వ సంవత్సర శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి ప్రసంగించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ అనంతలక్ష్మి పురాణ ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు.
KRNL: నూతన సంవత్సరం సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి చెందిన పోలీస్ అధికారులు ఇవాళ ఆలూరు TDP ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆమె అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ చట్ట పరిరక్షణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 5వ తేదీ నుండి జరగనున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ను వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 27వ తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 28వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్లో చూడొచ్చన్నారు.
కర్నూలు రాష్ట్ర సచివాలయం నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, జిల్లాల్లో ప్రగతి, వివిధ శాఖల పనితీరుపై సమీక్ష జరిపారు.
PLD: దిడుగు గ్రామంలో శుక్రవారం 2 ప్రైవేటు బస్సులు ఢీకొని విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వచ్చే మరో ప్రైవేటు స్కూలు బస్సుని ఢీ కొట్టిందన్నారు. ఫిట్నెస్లేని బస్సులను నడపడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ప్రైవేటు బస్సుల ఫిట్నెస్ పై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
KNRL: కోడుమూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో MLA బొగ్గుల దస్తగిరి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, భూ సమస్యలు, నీటి కుళాయి కనెక్షన్లు, వీధి లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రావెల్ తదితర సమస్యపై ప్రజలు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పక పరిష్కారం చూపుతామని ఆయన అన్నారు.