తూ.గో: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాజమండ్రిలోని గోదావరి నదిలో వరద క్రమంగా పెరుగుతోంది. గురువారం 96,500 క్యూసెక్కులున్న ఇన్ ఫ్లో, శుక్రవారం ఉదయం 6 గంటలకు సీలేరు జలాలతో కలిపి 1,48,915 క్యూసెక్కులకు చేరింది. అలాగే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్న మూడు డెల్టా కాలువలకు 11,800 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం: త్రిపూట నేరాలను అరికట్టేందుకు నైట్ బీట్ నిర్వహిస్తున్నట్లు బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో అనుమానితులను, కొత్త వ్యక్తులను ఎస్ఐ రవీంద్రారెడ్డి ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు, మండలంలో నేర నియంత్రణ మరియు దొంగతనాల కట్టడికి నైట్ బీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
NLR: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మార్కాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోడ్డు మార్గాన డిప్యూటీ సీఎం ఉదయం 10 గంటలకు సంతమాగులూరు మండలం మీదుగా శుక్రవారం మార్కాపురం వెళ్లనున్నారు. సంతమాగులూరు మండలంలోని జనసైనికులు పవన్కు భారీ ఎత్తున స్వాగతం ఏర్పాటు చేస్తున్నారు.
KDP: పులివెందులలోని నగిరి గుట్టలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టిడిపి ఇంఛార్జ్ మారేటి రవీంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. సూపర్ – 6లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ఉచిత గ్యాస్, తల్లికి వందనం అమలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ నగదును రైతులు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 30.620 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటనలో పేర్కొన్నారు. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 2100 క్యూసెక్కులు, కావలి కెనాల్కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం గ్రామంలో, అమలాపురం మండలం వన్నె చింతలపూడి గ్రామంలో జరుగు ‘సుపరిపాలన’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో ‘సుపరిపాలన’ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్యెల్యే కార్యలయం ఒక ప్రకటనలో తెలిపింది.
NDL: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి 98,290 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరింది. దీనితో జలాశయ నీటిమట్టం 875.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 167.87 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
GNTR: బాపట్ల జిల్లా బల్లికురవ మండల కేంద్రంలోని మహిళ సమైక్య కార్యాలయం నందు శుక్రవారం మండలంలోని వివోఏలతో సమీక్ష సమావేశం నిర్వహి స్తున్నట్లుగా మండల ఏపిఎం రాజారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులందరూ హాజరవుతారని చెప్పారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం మొదలవుతుందని, కావున మండలంలోని వివోఏలు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని రాజారావు కోరారు.
NLR: వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు వెంగయ్యను సస్పెండ్ చేస్తూ డీఈఓ బాలాజీరావు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో వెంగయ్య బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని రెండు రోజల క్రితం గ్రామస్తులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
ELR: ఏలూరులో ఈనెల 6న జిల్లాస్థాయి ఈత పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జూనియర్ బాల బాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. పూర్తి వివరాల కోసం 9440337313 నంబర్లను సంప్రదించాలన్నారు.
CTR: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కుప్పం ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఒకేషనల్ కళాశాలకు చెందిన అనూష, భవ్య శ్రీ, అభినయశ్రీ, హసీనా, భానుప్రియ, దివ్యవాణి, ఈశ్వర్ ప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 500 గాను 490కి పైగా మార్కులు సాధించారు. విద్యార్థులను అభినందిస్తూ సీఎం జ్ఞాపికలను అందజేశారు.
NDL: కూటమి ప్రభుత్వం సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జూపాడు బంగ్లా మండలంలోని తాటిపాడు గ్రామంలో ఎమ్మెల్య జయసూర్య పర్యటించనున్నట్లు తెలిపారు. ఉ.08.00 గం.లకు బూత్ ఇన్ఛార్జ్లతో కలిసి ఇంటింటికీ తిరిగి పథకాల గురించి వివరిస్తారని, గ్రామ KSS సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు పాల్గొనాలని టీడీపీ మండల నాయకులు గిరి పిలుపునిచ్చారు.
W.G: నర్సాపురం రూరల్ పోలీసులు గురువారం డ్రోన్ కెమెరాల సహాయంతో నిర్మానుష్య ప్రదేశాలలో గస్తీ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపించిన కొందరు యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
NDL: స్థానిక నెరవాటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 6న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి శుక్రవారం తెలిపారు. అండర్ 13 బాలబాలికలకు నిర్వ హించే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 5వ తేదీలోపు ఏపీ చెస్ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
AKP: కోటవురట్ల విద్యుత్ సబ్ స్టేషన్ రాజుపేట ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగింపు పనులు జరుగుతున్నందున శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ విఎన్ఎం అప్పారావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని కోరారు.