GNTR: తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి రాంగ్ రూట్లో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డోజర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
GNTR: గుంటూరు వంతెన నిర్మాణంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు జేఏసీ, అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వంతెన వివాదంపై స్పందించడానికి ప్రభుత్వం తడబడుతోందని విమర్శించారు. ఈ భేటీలో మోదుగుల వేణుగోపాల్రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
WG: బ్యాంకులకు ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని మంగళవారం పాలకొల్లులో యునైటెడ్ ఫార్మ బ్యాంకింగ్ యూనియన్ సభ్యులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఐదు పనిదినముల ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ SBI, యూనియన్ బ్యాంక్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ సిబ్బంది నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సురేంద్ర, ప్రసాద్ బాబు, శేఖర్ పాల్గొన్నారు.
GNTR: ప్రేమ పేరుతో 14 ఏళ్ల బాలికను వేధించిన కేసులో తమ్మిశెట్టి వినయ్కు తెనాలి పోక్సో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. 2022లో సుల్తానాబాద్కు చెందిన నిందితుడు బాలికను వేధించగా, తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.
ATP: రాయలచెరువు వద్ద రైల్వే గేట్ క్రాసింగ్ విస్తరణ పనులు చేపడుతున్నారు. దీంతో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ను రాయలచెరువు-వేములపాడు-పెద్దపేట బైపాస్ రోడ్డు ద్వారా మళ్లిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులందరూ సహకరించాలని కోరారు.
NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా భద్రతను మరింత పటిష్టంగా నిలుపుకునేందుకు క్లౌడ్ పెట్రోలింగ్ విధానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 41 డ్రోన్లు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు మొత్తం 5,790 డ్రోన్ బీట్లు నిర్వహించారు. ప్రజలకు కనిపించకుండా భద్రత కల్పించడంలో డ్రోన్ పెట్రోలింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.
కృష్ణా: మచిలీపట్నం STF అధికారులు సారా బట్టీలపై ఉక్కుపాదం మోపారు. STF సీఐ లక్ష్మణరావు తన సిబ్బంది, గోకవరం VRO శివనాగ ప్రసాద్లో కలిసి గోకవరం పంచాయతీ రెడ్డిపాలెం శివారు ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు. ఈ సోదాల్లో నాటుసారా కాస్తున్న వెంకటరెడ్డి, బాలకృష్ణలను అరెస్ట్ చేసి, వారి నుంచి 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యలయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
అన్నమయ్య: వీరబల్లి మండలం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా వీరబల్లి మండలం, రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలపడం హర్షణీయమని టీడీపీ మండల అధ్యక్షులు భాను గోపాల్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు.
VSP: నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని బొబ్బిలి పట్టణ సీఐ కె. సతీష్ కుమార్ కోరారు. డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపినా, అల్లర్లు చేసినా, బహిరంగంగా మద్యం తాగినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్ధరాత్రి తర్వాత రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సీఐ హెచ్చరించారు.
SKLM: ఎల్.ఎన్.పేట మండలంలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని మండల ఏవో కిరణ్ వాణీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. 40 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. సానుకూలంగా స్పందించారని త్వరలో రైతు సేవా కేంద్రాలకు 40 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని ఏవో అన్నారు.
NLR: జిల్లాలో జనవరి 2వ తేదీ నుంచి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం, గ్రామంలోనూ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 9వ తేదీ వరకు సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో రైతులకు వీటిని అందజేస్తామని వెల్లడించారు.
NLR: దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం జగన్మాతకు కాత్యాయని వ్రత ఉత్సవం జరిగింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలోని శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి, శ్రీ గాయత్రీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
BPT: అద్దంకిలో నూతన రెవిన్యూ డివిజన్ కార్యాలయం బుధవారం ప్రారంభం కానుంది. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను ఈ కార్యాలయంగా మార్చినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనిని ఏర్పాటు చేశామని, జనవరి 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
BPT: జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ ఉమామహేశ్వర్ ఆంక్షలు విధించారు. ప్రజలు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం వెల్లడించారు.
W.G: మానసిక పరిపక్వత లేకుండా పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. భీమవరం మండలం కొమరాడలో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఆడపిల్లకు 18 సం.లు, మగపిల్లవాడికి 21 సం.లు నిండకుండా పెళ్లి చేయరాదన్నారు. అలా చేస్తున్నట్లు మీ దృష్టికి వస్తే సంబంధిత అధికారులకుగానీ, పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు.