SKLM: యువత క్రీడాస్ఫూర్తితో ఎదగాలని టెక్కలి సీఐ ఏ. విజయ్కుమార్ అన్నారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం TPL నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్ల్లో బీజీఆర్ వారియర్స్, పవర్ హిట్టర్స్ జట్లు విజయం సాధించాయి. ఈ పోటీలు శుక్రవారం కొనసాగనున్నాయి.
KDP: చక్రాయిపేట మండలంలోని గండి క్షేత్రంలో వెలిసి ఉన్న ఆంజనేయస్వామి సన్నిధానంలో శుక్రవారం నుంచి సుందరకాండ ప్రవచనం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. హైదరాబాదుకు చెందిన ప్రవచనకర్త దత్త శర్మచే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శుక్ర, శని, ఆదివారాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు వాల్మీకి మహర్షి విరచిత సుందరకాండ ప్రవచనం ఉంటుందని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని అతి పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం పుష్యమాసం సందర్భంగా శివునికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో శివునికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ అర్చకుడు మాట్లాడుతూ.. ఈ మాసంలో పితృదేవతలను పూజించడం, తర్పణాలు చేయడం మంచిదన్నారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
E.G: కోరుకొండ మండలంలో ఇవాళ దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజాము నుంచి మంచు కురవడంతో కూలీలు దారి కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధిక మంచు వల్ల మామిడి, జీడి మామిడి తోటల్లో పూత, పిందె దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెసర, మినుము పంటలకు కూడా నష్టం వాటిల్లుతుందని, పెట్టిన పెట్టుబడులు కోల్పోతామని తోటల యజమానులు వాపోతున్నారు.
KDP: బ్రహ్మంగారి మఠంలోని వివిధ ఆలయాల అభివృద్ధిపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)పై చర్చించారు. ఈశ్వరి దేవి మఠం, పోలేరమ్మ ఆలయం తదితరాలను కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్ ద్వారా రూ.50 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
VZM: రాజాం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారిలో సంచరిస్తూ వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులను గురువారం విశాఖపట్నం గోశాలకు తరలించారు. పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని రాజాం మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు పేర్కొన్నారు. ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి వాటిని గోశాలకు తరలించేస్తామని స్పష్టం చేశారు.
ప్రకాశం: పెదదోర్నాలలో ఇటీవల జరిగిన దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 25 వరకు పలు ఘటనల్లో దొంగలు సుమారు రూ.2.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు.
VSP: పూసపాటిరేగ మండలంలోని గుండపురెడ్డిపాలెం వద్ద హైవేపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విశాఖలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన దక్షిణామూర్తి(58) మరణించారు. చీపురుపల్లి నుంచి విశాఖ వెళ్తుండగా ముందున్న లారీని ఢీకొట్టి కారులో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నమయ్య: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ రాయచోటిలో హిందూ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గురువారం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హిందువులపై దాడి హేమమైన చర్య అన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయలేకపోతున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను వారు దహనం చేశారు.
WG: ఉండి మండలంలో యూరియా నిల్వలకు సంబంధించి సొసైటీలో 100 టన్నులు, ప్రైవేటు దుకాణాల్లో 125 టన్నులు ఉన్నాయిని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ డాక్టర్ నిమ్మల శ్రీనివాసరావు తెలిపారు. రైతు సేవా కేంద్రంలో మరో 25 టన్నులుతో కలసి మొత్తం 250 టన్నుల వరకు నిల్వ ఉన్నట్టు ఆయన తెలిపారు. యూరియా కోసం ఏ రైతు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. మండలంలో పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
KDP: చాపాడు మండల పరిధిలోని వెదురూరు గ్రామ సచివాలయంలో అత్యవసర గ్రామ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పంచాయితీ సెక్రెటరీ ఉమా పేర్కొన్నారు. వెదురూరు గ్రామ పంచాయతీ నుంచి రాజుపాలెం, నరహరిపురం గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా చేసేందుకు ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనుటకు సభను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గ్రామ ప్రజలు సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
KDP: చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలో వైవీయూ ఎన్ఎస్ఎస్ యూనిట్-8 ఆధ్వర్యంలో ‘రహదారి భద్రత–మనుగడ’పై ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ప్రొఫెసర్ కృష్ణారావు ర్యాలీని ప్రారంభించి భద్రతా నియమాల ప్రాధాన్యత వివరించారు. వాలంటీర్లు ఇంటింటా పోస్టర్లు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించి, ‘సున్నా ప్రమాదం’ లక్ష్యంగా వేగ పరిమితులు పాటించాలని పిలుపునిచ్చారు.
కోనసీమ: అమలాపురం-రావులపాలెం ప్రధాన రహదారిపై పెంకులపాటి గరువు వద్ద గురువారం రాత్రి కంటైనర్ లారీ ఓ చెట్టును ఢీ కొట్టడం వల్ల పెట్టుకొన్న విరిగి లారీ వెనుక వస్తున్న కారు మీద పడింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. కారులో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు.
అనకాపల్లి జార్జ్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల అవగాహన నాటికోత్సవాలు నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జోగినాయుడు, కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం బ్రోచర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ మహతి క్రియేషన్స్ జార్జ్ క్లబ్ సంయుక్తంగా ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రకాశం మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాపట్ల పీడీని నియమించారు. దాదాపు రూ.10 కోట్లు బోగస్ సంఘాలకు రుణాలుగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మెప్మాలో అవినీతి జరిగిందంటూ గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు విచారణ సైతం సాగుతుంది.