VZM: బొబ్బిలి మండలం పారాది బ్రిడ్జి సమీపంలో రొంపల్లి గ్రామం జంక్షన్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రామభద్ర పురం నుంచి వస్తున్న కారు, బొబ్బిలి నుంచి వస్తున్న ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురికి, కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలు అయిన ముగ్గురిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.
VZM: వేపాడ మండలం బొద్దాం నుంచి రామస్వామిపేట వేళ్లే తారు రోడ్డులో బొద్దాం రైల్వే గేట్ సమీపంలో నర్సిపల్లి మెట్టకు చెందిన అన్నదమ్ములు బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోపు రామదాసు (26) సంఘటన స్థలంలో చనిపోగా గోపు రామచంద్ర (28) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అంబులెన్స్లో విజయనగరం ఆసుపత్రికి తరలించారు.
NTR: విజయవాడ వెస్ట్ బైపాస్ను సంక్రాంతి నుంచి ఒకవైపు రాకపోకలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు (D) కాజ, చినకాకాని జంక్షన్ నుంచి గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి వరకూ వెళ్లేలా NHAI ఏర్పాట్లు చేసింది. గుంటూరు నుంచి అమరావతి, గొల్లపూడి, VJA, HYD, ELR, ఉత్తరాంధ్ర వైపులకు వెళ్లే వాహనాలకు ఈ నెల 15 నుంచి అనుమతి ఇస్తున్నారు.
W.G: పాలకొల్లులో జరుగుతున్న జాతీయ స్థాయి ఎమ్మెల్యే కప్ కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. పురుషుల విభాగంలో నాగ్ పూర్ SEC రైల్వే జట్టు, మహిళల విభాగంలో ఢిల్లీ CRPF జట్లు విజేతలుగా నిలిచి కప్ కైవసం చేసుకున్నాయి. విజేతలకు రూ.1.50 లక్షల నగదు, షీల్డులను అందజేశారు. పురుషుల విభాగంలో ఢిల్లీ రాజ్ రైఫిల్, కలకత్తా పోలీస్ జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
SKLM: సంక్రాంతి పండుగ సందర్భంగా పలాస కు చెందిన సూక్ష్మ కళాకారుడు బ్రహ్మర్షి కొత్తపల్లి రమేష్ ఆచారి బియ్యం గింజంత సైజులో బంగారు గాలిపటం నమూనాతో పాటు ‘సంక్రాంతి’ అనే స్వర్ణ లోగో ను తయారు చేశారు. సుమారు పది మిల్లీ గ్రాముల బంగారంతో, అర సెంటీమీటర్ల ఎత్తు, వెడల్పుతో, పలుచటి బంగారు రేకుపై ఈ కళాఖండాన్ని మూడు గంటల సమయంలో రూపొందించినట్లు తెలిపారు.
CTR: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు శ్రీ కోదండ రామస్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక కమిటీ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం ప్రశాంత్ నగర్లోని శాస్తగిరి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మకర జ్యోతి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
KDP: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం నూతన మఠాధిపతులుగా నియమితులైన శ్రీ వెంకటాద్రి స్వామివారిని బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున్ రెడ్డి, మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చిన తర్వాత పట్టణంలో ఆర్థిక మాంద్యం నెలకొందని ప్రజలు, వ్యాపారులు వాపోతున్నారు. జిల్లా కార్యాలయాలు ఖాళీ కావడంతో వ్యాపారాలు తగ్గిపోయాయి. సంక్షేమ పథకాలు సక్రమంగా అందకపోవడంతో కొనుగోలు శక్తి పడిపోయిందని పేర్కొంటున్నారు. ఒకప్పుడు సంబరంగా ఉండే సంక్రాంతి, ఈసారి రాయచోటిలో నిరాశగా మారిందని ప్రజలు అంటున్నారు.
VZM: పండగ పూట రహదారులు రద్దీగా ఉన్న నేపద్యంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గంట్యాడ ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. అంతేకాకుండా తాగి వాహనాలు నడిపితే తప్పనిసరిగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. పండగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
VSP: రాష్ట్రంలో ఉన్న పది మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని CPI రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం పెద గంట్యాడ పోతిన సన్యాసి రావు భవన్ వద్ద మెడికల్ జీవోనెంబర్ 590 ,847 కాపీలను భోగి మంటల్లో వేసి దగ్గర దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కె. అచ్యుతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలన్నారు.
E.G: అనపర్తి గ్రామ దేవత వీరుల్లమ్మ జాతర మహోత్సవాలు గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే 16, 17, 18వ తేదీలలో అమ్మవారి తీర్థం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలియజేశారు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పాడి పంటలతో, పచ్చని పైరులతో సస్యశ్యామలం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి రైతు ఇంట సిరిసంపదలు, సుఖసంతోషాలు నిండాలని కోరారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ శుభాకాంక్షలు అందజేశారు.
ELR: మండవల్లి మండలంలో భోగీ సందర్భంగా బుధవారం కోడిపందేలు నిర్వహించారు. చింతపాడు, చావలిపాడు, ఉనికిలి, లింగాల తదితర గ్రామాల్లో బరులు ఏర్పాటు చేయగా పందెం రాయుళ్లు తరలివచ్చారు. చింతపాడులో ఏర్పాటు చేసిన బరిని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. పండుగ సంప్రదాయం పేరిట పలు గ్రామాల్లో నిర్వహించిన ఈ పోటీలను తిలకించారు.
కోనసీమ: ఆలమూరులో బుధవారం జరిగిన అయ్యప్ప స్వామి మకర జ్యోతి ఉత్సవాల్లో కొత్తపేట MLA బండారు సత్యానందరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. 33 ఏళ్లుగా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాలో జల్లికట్టు, కోడిపందేలు, పేకాట పూర్తిగా నిషేధమని.. ఎక్కడా నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. ఎక్కడైనా వీటిని నిర్వహిస్తే ప్రజలు వెంటనే 112, వాట్సాప్ నెంబర్ 8099999977కి మెసెజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.