TPT: రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యార్థి లిఖిత్ సాయి (MBBS) దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన ఆయన గురువారం రాత్రి విజయవాడలోని రామవరప్పాడు నుంచి వస్తుండగా, పరిణయ కళ్యాణ మండపం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయారు. దీంతో తలకు తీవ్ర గాయమవ్వడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం నిలిచేదని స్థానికులు చెబుతున్నారు.
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా కంకిపాడుకు చెందిన విద్యార్థి నాయకుడు తలారి హరిని టీడీపీ శుక్రవారం నియమించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై చురుకుగా పనిచేస్తూ, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న హరికి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు.
PLD: శావల్యాపురం మండలం 11 స్వర్ణ గ్రామాల పరిధిలో ఈ నెల 15న నిర్వహిస్తున్న అక్షరాంధ్ర పరీక్షలను సిబ్బంది సజావుగా నిర్వహించాలని వయోజన విద్య సూపర్వైజర్ నాగేశ్వరరావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో వీవోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్వర్ణ గ్రామాల సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు.
NTR: జిల్లాను రహదారి భద్రతలో నెం.1గా నిలబెట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 123 బ్లాక్స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాలను తగ్గించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు.
తిరుపతి శ్రీ వేశాలమ్మ ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నాయకులతో కలిసి నూతన ఛైర్మన్, సభ్యులను అభినందించారు. కార్యక్రమానికి ముందు ఆయన వేశాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయ మర్యాదలతో సత్కారం స్వీకరించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సీఐ శ్రీనివాసరావు రాత్రి సమయాలలో ఖాళీ ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న పలువురుని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. మండలంలో ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని తెలిపారు.
కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి పయ్యావుల కేశవ్పై శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లెక్కలు, కాగితాలు అవసరం లేదని, ఆర్థికశాఖ కార్యదర్శి సంతకంతో స్టేట్మెంట్ విడుదల చేయించగలరా అని ప్రశ్నించారు. పయ్యావుల ఆర్థిక మంత్రి కాదని, అప్పుల మంత్రి అని అన్నారు.
NTR: జిల్లాలో వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని ఐవోసీఎల్ బాట్లింగ్ ప్లాంటును శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. తప్పుడు వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
CTR: ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలంలో రైతులతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన 36,473 మంది రైతులకు సుమారు రూ.19.76 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
PLD: జిల్లాలో గృహ వినియోగదారులకు అవసరమైన LPG గ్యాస్ సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. కొందరు మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని సిలిండర్లను అక్రమ నిల్వలు చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయించడం వంటి బ్లాక్ మార్కెటింగ్ చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
CTR: ఏపీ మైనార్టీల సంక్షేమ శాఖ, వర్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మిట్టూరులోని షాదీ మహల్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు కుటుంబాలు సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మైనారిటీ మత పెద్దలతో కలసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
VZM: గజపతినగరం పోలీసు స్టేషన్ సర్కిల్ పరిధిలో నాటు తుపాకులు ఉంటే సమాచారం ఇవ్వాలని బొబ్బిలి ఇంఛార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు కోరారు. నాటు తుపాకులు ఉంటే సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. సమాచారం ఇచ్చిన పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాపై కూడా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
ASR: పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 77 ఫిర్యాదులు అందాయి. డీఆర్వో అంబేద్కర్, ఎస్డీసీ నీలకంఠరావు వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కోనసీమ: మండపేట పురపాలక సంఘ కార్యాలయంలో ప్రభుత్వ సెలవు రోజులలో కూడా ఆస్తి పన్ను వసూలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం పురసేవ కౌంటర్ తెరిచి ఉంటుందని అన్నారు. ఈ నెల 14 వ తేదీ రెండవ శనివారం, ఆదివారం కూడా కౌంటర్ తెరిచి ఉంటుంది అన్నారు.
కర్నూలు: ప్రముఖుల పై సోషల్ మీడియా వేదికల్లో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే పోస్టులు చేయడం చట్ట విరుద్ధమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.