VZM: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంలో కీలక పాత్ర పోషించిన PM నరేంద్రమోదీకి, మంత్రి నారా లోకేష్కి MP కలిశెట్టి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలుపుతు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని, ఈ బిల్లునకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
కోనసీమ: రాజోలు మండలంలో 16 గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ లను నియమిస్తూ ఎంపీడీవో కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాటిపాక, రాజోలు, తాటిపాక, శివకోడు మేజర్ పంచాయతీలకు తహసిల్దార్ భాస్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, ఎంఈవో, అగ్రికల్చర్ ఏవో హార్టికల్చర్ అధికారులు మిగిలిన గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు.
E.G: ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో గురువారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న రెవెన్యూ శాఖ ఉద్యోగులు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ వై.మేఘా స్వరూప్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
VSP: రైల్వే స్టేషన్ మార్గంగా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని సీపీ డా. శంఖబ్రత బాగ్చి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, నగర పోలీసులతో సమన్వయ సమావేశం కమిషనరేట్లో నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో భద్రత బలోపేతం, దొంగతనాల నివారణపై చర్యలు తీసుకోవాలని సూచించారు
ATP: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడం చారిత్రక నిర్ణయమని ఎమ్మెల్యే బండారు శ్రావణి కొనియాడారు. ప్రజల త్యాగంతో నిర్మితమైన రాజధానిపై చట్టముద్ర పడటంతో ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు చిగురించాయన్నారు. అమరావతిని కదిలించడం ఎవరివల్లా కాదని, అప్రజాస్వామిక ప్రయోగాలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
NLR: జిల్లాలో అభివృద్ధి పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం అధికారులను ఆదేశించారు. 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.3,063.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
W.G: ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసి గెజిట్ ప్రకటించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షాన్ని ప్రకటించారు. గురువారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జయహో థాంక్యూ పీఎం అంటూ నినాదాలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు MLA అరవ శ్రీధర్ అనుచరులు, జనసేన నాయకులు గురువారం సాయంత్రం కోడూరులోని టోల్ గేటు వద్ద తనపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించారు. TDP ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేపై బాధితురాలు ఇన్ఛార్జ్ ముక్కా రూపానందెడ్డికి నేటి ఉదయం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహించిన జనసేన నాయకులు నాపై దాడి చేశారని ఆమె అన్నారు.
NDL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు కోరారు. ఖరీఫ్లో రైతులు పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇవాళ సూచించారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా కొత్త పెన్షన్లు అమలు కాలేదని విమర్శించారు.
అన్నమయ్య: మదనపల్లి బీటీ కాలేజీ గ్రౌండ్లో 4.91 ఎకరాల్లో ఆధునిక క్రీడా మైదానం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. సాంకేతిక అనుమతుల కోసం ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలని సూచించారు. క్రీడా మైదానంలో వాకింగ్ ట్రాక్, కోర్టులు, ఓపెన్ జిమ్, మౌలిక వసతులతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
KKD: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చేందుకు దేశం మొత్తం అమరావతి వైపు నిలబడిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు. అమరావతికి లభించిన చట్టబద్ధతకు సంకేతంగా గురువారం సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించి ఎమ్మెల్యే సత్యప్రభ దీపహారతి ఇచ్చారు. ఆంధ్రుల ఐక్యతకు, ఆశయాలకు ఇది ఒక ప్రతీక అని ప్రతి ఇంటా వెలిగిన ఈ దీపం మన భవిష్యత్తుకు మార్గదర్శకం అన్నారు.
VSP: 20 ఏళ్లుగా కనిపించని సత్యనారాయణను టూటౌన్ పోలీసులు గుర్తించి కుటుంబానికి అప్పగించారు. తిరుపతిలో తప్పిపోయిన ఆయనను నగరంలో గుర్తించి నిరాశ్రయ గృహానికి తరలించారు. సమాచారం అందడంతో గురువారం కుమారుడికి అప్పగించగా, కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: నేర నియంత్రణలో మహిళా సంరక్షణ పోలీసులు, సిబ్బంది పాత్ర కీలకమని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గురువారం గుర్ల పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన ఉమెన్ హెల్ప్ డెస్క్ను ఆయన ప్రారంభించారు. అలాగే చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో నూతన సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు, సీఐలు పాల్గొన్నారు.
VZM: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజలంతా తమ ఇంటి వద్ద దీపాలు వెలిగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన, ట్రైకార్ కార్పొరేషన్ డైరెక్టర్ పువ్వల లావణ్య ఈరోజు సాయంత్రం బొబ్బిలి కోటలో దీపాలు వెలిగించి ఈ సంబరాలలో పాలుపంచుకున్నారు.
NTR: నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో అమరావతి రాజధాని బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఎంపీడీవో ఆర్.వి.ఎస్. ప్రసాదరావు ఆధ్వర్యంలో “మన రాజధాని-మన అమరావతి” నినాదాలతో దీపాలు వెలిగించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, ఎంపీపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.