కృష్ణా: బీడీ కాల్చలేదని యువకుడిపై కత్తితో దాడి చేసి పరారైన వ్యక్తిని ఉయ్యూరు పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. బుధవారం గండిగుంట గ్రామానికి చెందిన నిఖిల్ను.. నేరస్తుడు కిరణ్ గణేష్ మద్యం సేవించేందుకు తీసుకెళ్ళి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్సై మల్లి కాసులు తెలిపారు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు పంపామని ముద్దాయిపై ఇప్పటికే 60 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
అన్నమయ్య: సంక్రాంతి అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. వేగ నియంత్రణతో వాహనాలు నడపాలని, నిద్రమత్తు అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు.
NDL: బేతంచెర్ల మండలం ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో ఆలయ ఉప కమిషనర్ ఈవో ఎం.రామాంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా తిరుచ్చి వేడుకలు జరిగాయి. సాయంత్రం ఆలయ వేదపండితులు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో కొలువుంచి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించారు.
కోనసీమ: కాట్రేనికోన(మం) గెద్దనపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కాట్రేనికోన నుంచి పల్లంకుర్రు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారంతో 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం గ్రామానికి చెందిన కోరుప్రోలు మల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన పండుగ పూట విషాదం నింపింది. టౌన్ సీఐ షేక్ గఫూర్ మాట్లాడుతూ.. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు మల్లేశ్వరరావు అప్పుల బాధ తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారన్నారు.
అన్నమయ్య: రైల్వేకోడూరు మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో సత్యమ్మ తల్లి పొంగళ్ల కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
AKP: కనుమ పండుగ సందర్భంగా మునగపాకలో ఆవుల అలంకరణ పోటీలను శుక్రవారం నిర్వహించారు. 100కు పైగా ఆవులను అందంగా అలంకరించిన రైతులు పోటీలకు తీసుకువచ్చారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ.. రైతులు పశువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారన్నారు. మొదటి స్థానంలో నిలిచిన ఆవుకు రూ.50,000 నగదు బహుమతి అందజేశారు.
VZM: బహిర్భూమికి రోడ్డు దాటుతూ మృతి చెందిన ఘటన ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పోతనాపల్లి గ్రామానికి చెందిన పొట్నూరు వెంకటలక్ష్మి బహిర్భూమికి వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనం గుద్దినట్లు చెప్పారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు ధృవీకరించారు.
ATP: తాడిపత్రిలో సంక్రాంతి సందర్భంగా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’, నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’, రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలు సందడి చేస్తున్నాయి. సాయి తేజ థియేటర్లో ప్రదర్శిస్తున్న చిరంజీవి చిత్రం మూడు రోజుల నుంచి పూర్తిస్థాయి వసూళ్లతో సాగుతోంది.
కృష్ణా: కంకిపాడు మండలంలోని ఉప్పులూరు బరిలో పందేల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. పందెం బరిలో జరిగిన చిన్నపాటి వివాదం క్రమంగా పెద్దదిగా మారి, యువకులు ఇరువర్గాలుగా విడిపోయి పరస్పరం కొట్లాటకు దిగారు. ఒక్కసారిగా అరుపులు, కేకలతో బరి ప్రాంతం దద్దరిల్లింది. హోరాహోరీగా జరిగిన దాడులతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
AKP: ప్రముఖ బౌద్ధ క్షేత్రం అయిన అనకాపల్లి శంకరం గ్రామ పరిధిలోగల బొజ్జన్న కొండ తీర్థం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొండపై పతంగుల పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. టీడీపీ అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త పీలా గోవిందు, జనసేన పార్టీ ఇంఛార్జ్ భీమరశెట్టి రాంకి విజేతలకు బహుమతులు అందజేశారు.
గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా కె.మయూర్ అశోక్ శనివారం ఉదయం 10:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విశాఖ జాయింట్ కలెక్టర్గా ఉన్న ఆయనని ప్రభుత్వం ఇటీవల ఇక్కడికి బదిలీ చేసింది. గతంలో తెనాలి సబ్ కలెక్టర్, విజయనగరం జేసీగా కూడా మయూర్ అశోక్ పనిచేశారు. ఆ అనుభవంతో ఇప్పుడు గుంటూరు నగర అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు.
KDP: వల్లూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 28న ఉదయం 11 గంటలకు స్థానిక మండలంలో జరగనుందని ఎంపీడీవో రఘురాం తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయం, గృహ నిర్మాణం, వైద్యం, త్రాగునీరు, విద్యుత్ వంటి 14 అంశాలపై సమీక్ష జరగనుందన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు హాజరు కావాలన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఎంపీడీవో సూచించారు.
AKP: రాంబిల్లి మండలం వెంకటాపురంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు శుక్రవారం ముగిసాయి. సంబరాల్లో భాగంగా మహిళలకు వంటల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన వారికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. పోటీలను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
KDP: పులివెందుల పట్టణ పరిధిలోని వాసవి కాలనీలో శుక్రవారం శ్రీ నరసింహ స్వామి వారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ పూజలు, ఆచారాల మధ్య కోలాట ప్రదర్శనలు ఆకట్టుకోగా, డీజే సాంగ్స్ ఉత్సవాలు మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఏడాది పొడవునా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ప్రసాదించాలని భక్తులు నరసింహ స్వామి వారిని వేడుకున్నారు.