KKD: వేసవి తీవ్రత, భానుడి భగభగలకు పిఠాపురంలో కొబ్బరి బొండాలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. మంగళవారం మార్కెట్లో గతంలో రూ.20 నుంచి రూ.30 పలికిన బొండం ధర ప్రస్తుతం రూ.50 నుంచి రూ. 70 వరకు చేరింది. రూ.80 అమ్మే కొబ్బరి నీళ్ల బాటిల్ ధర ఏకంగా రూ.120 నుంచి రూ. 140 కి పెరిగింది. ఎండల నుంచి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపడంతో డిమాండ్ పెరిగింది.
KDP: జమ్మలమడుగులో మంగళవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డితో కలిసి పర్యటించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నాక్ సెంటర్ భవనాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహణకు అనుకూలతలపై పరిశీలించారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం, వాటర్ టెస్టింగ్ ల్యాబ్, జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.
W.G: ఆకివీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ కటారి జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం నామమాత్రంగా ముగిసింది. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతి వివరాలను ఈ సమావేశంలో వెల్లడించారు. పలు శాఖల అధికారులు గైర్హాజరు కాగా, వచ్చిన వారు కూడా అంతంత మాత్రంగానే హాజరు కావడంతో సమావేశం వెలవెలబోయింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
SKLM: పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం గ్రామం దళితవాడలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. చాలా రోజులుగా మురుగునీటి కాలువల్లో పూడికలు తొలగించలేదని.. ఫలితంగా పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని వాపోతున్నారు. ఈగలు, దోమల బెడద పెరిగిందని, దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
VZM: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2027 మార్చి నెల నాటికి రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసి ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు మూడు విడతలలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు.
ASR: కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీకి చెందిన పల్లాల వెంకటేశ్వర్లు (32)వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు ఉల్లిగుంటలొద్దిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వడదెబ్బకు గురై పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో ప్రాణాలు కోల్పోయాడని వారు ఆవేదన చెందారు.
NDL: మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అవగాహన వర్క్షాప్లో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ పాల్గొన్నారు. ఓటరు జాబితాల ప్రక్షాళన, అర్హులైన ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంపుపై చర్చించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలన్నారు.
ASR: పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ మద్దివీధిలో ఆవులు, పాడి గేదెలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలుషిత నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు, అంతుచిక్కని వ్యాధులు, సరైన వైద్యం అందకపోవడంతో చనిపోతున్నాయని గిరిజనులు చెబుతున్నారు. అధికారులు స్పందించి మద్దివీధిలో పశువైద్య శిబిరం ఏర్పాటుచేసి మూగ జీవాల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
కోనసీమ: ఆలమూరు మండలం మోదుకూరులోని సత్యనారాయణ ట్రేడర్స్ రైస్ మిల్స్లో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం నిల్వలు, రికార్డులు, నాణ్యత ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ASR: చింతపల్లి మండలం దబ్బగరువు జంక్షన్ వద్ద మంగళవారం ఆటో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: మంగళగిరిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన SIR వర్క్ షాప్ రాష్ట్ర కురుబ-కురుమ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సీఎం సూచించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
ATP: అనంతపురం రూరల్ మండలం బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా బిల్లే హరినాథ్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు తేజేశ్వర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు తరుణ్కు ధన్యవాదాలు తెలిపారు.
CTR: జిల్లాలోని మ్యాంగో పల్ప్ పరిశ్రమల యజమానులతో కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సచివాలయంలో మామిడి కొనుగోలు ధరలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోలు ప్రక్రియ మరియు పరిశ్రమల నిర్వహణపై సమీక్షించారు. తర్వాత వారికి పలు సూచనలు చేశారు.
ELR: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడును మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం నియోజవర్గ ఇంఛార్జ్ బోరగం శ్రీనివాస్ కలిశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న పనుల పూర్తికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని, త్వరలోనే అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు.
ప్రకాశం: కురిచేడు (మం) కల్లూరులో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు అత్తపై తీవ్రంగా దాడి చేసి రెండు కాళ్ళను విరగ్గొట్టాడు. రాడ్డుతో దాడి చేయడంతో ఆమె రెండు కాళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.