AP: విజయవాడ కొత్తపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగడానికి రూ.10 ఇవ్వలేదని తాతాజీ అనే వ్యక్తిని ఓ బాలుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావమై తాతాజీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: కొయ్యూరు మండలం ధర్మవరం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డౌనూరు సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు బిడిజాన అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. అప్పారావు బైక్పై కొయ్యూరు వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అప్పారావును డౌనూరు పీహెచ్సీకి తరలించారు. అనంతరం నర్సీపట్నం తరలించారు.
BPT: సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రామిరెడ్డిపాలెనాకి చెందిన సోమిరెడ్డి రోడ్డు దాటుతుండగా అటు నుంచి వస్తున్న కారు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అంబులెన్స్లో నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
NDL: నందికొట్కూరులో చాక్లెట్లు తిని 11 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ఆస్వస్థతకు గురయ్యారు. బడిలో పంచాలని 7వ తరగతి విద్యార్థినికి ఓ అగంతకుడు చాక్లెట్లు ఇచ్చాడు. ఆ చిన్నారి PET సహా పలువురికి పంచగా.. తిన్నవారి కనురెప్పలు నల్లగా మారడం, కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై ఇవాళ పోలీసులు రంగంలోకి దిగారు.
PLD: పెదకూరపాడులోని అంబేద్కర్ బొమ్మ సెంటర్లో బోరుగడ్డ కల్యాణి (26)గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయినట్లు బంధువులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి ఆసుపత్రికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
KRNL: బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి వచ్చి నందవరంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న అనూర్ మాఘి (30) అనే వ్యక్తి క్రేన్ వద్ద పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా కిందపడి మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ ఘటనలో స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుడివాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ఐతవరం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న నలుగురు యువకులు అప్రమత్తమై కారు దిగేశారు. దీంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు ఆర్పారు.
TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో వెల్లడైన అంశాలతో కూడిన నివేదికను సిట్ అధికారులు ‘సీల్డ్ కవర్’లో కోర్టుకు సమర్పించనున్నారు. ఈ సీక్రెట్ రిపోర్ట్ ఆధారంగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
AP: నంద్యాలలోని నందమూరి నగర్లో దారుణం చోటు చేసుకుంది. చాకలి గుర్రప్ప అనే వ్యక్తిని భార్య హతమార్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడితో కలిసి.. భర్త గొంతు నులిమి చంపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్రప్ప మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్లుడు పరారీలో ఉన్నాడు. భార్య పౌర్ణమిని అదుపులోకి తీసుకున్నారు.
TG: HYD నుంచి కర్ణాటకలోని బెళగావి వెళ్తున్న ప్రత్యేక రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వేస్టేషన్కు రాగానే జనరల్ బోగీ కింద మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పివేశారు. బ్రేక్ జామ్ అవడంతో నిప్పురవ్వలు చెలరేగి మంటలు వచ్చినట్లు గుర్తించారు. మంటలు ఆర్పిన తర్వాత రైలు సురక్షితంగా వికారాబాద్ చెరుకుంది.
TG: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొమురంభీం జిల్ల పరందోలి నుంచి ఆదిలాబాద్కు వెళ్తున్న బస్సు.. పరందోలి ఘాట్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు.
KDP: ఎర్రగుంట్ల మండలంలో ఇద్దరు యువకులు ఒక యువతిని ఇబ్బంది పెట్టారు. ఆ కేసులో బుధవారం కోర్టు ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే, ముద్దనూరు మండలం చెర్లోపల్లికి చెందిన గోపాల్, శ్రీధర్ 2023లో ఒక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిపై కడపలో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం కడప కోర్టు ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా విధించింది.
KDP: రాజుపాలెం మండలంలోని టంగుటూరు చెందిన గూడూరు వెంకటయ్య (60) తేనె తీగల దాడిలో మృతి చెందారు. ఇతను తన పొలంలో సాగుచేసిన పంట పొలం వద్దకు వెళ్లగా అక్కడ చెట్టులో ఉన్న ఈగలు ఒక్కసారిగా ఆ రైతును చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర గాయాలైన రైతును ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
CTR: తవణంపల్లి మండలం కె.పట్నం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎస్సై చిరంజీవి.. నిందితులు తుపాకుల మనోహర్ (32), సామ్యూయల్ రాజ్ (34)ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల బంగారు చైన్తో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని జమల్పూర్ గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ జగదీష్ మృతి చెందాడు. స్థానిక రైతు శ్రీనివాస్ పొలంలో పత్తి కట్టెను దున్నేందుకు వెళ్తున్న జగదీష్, ట్రాక్టర్తో కరెంట్ స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరును తాకడంతో స్తంభం విరిగి అతనిపై పడింది. ఈ సంఘటనలో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు.