TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మందికి గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
AP: గాలిపటాలకు ఉపయోగించే మాంజా గొంతుకు చుట్టుకుని పోస్ట్మాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న పోస్ట్మాన్ గొంతుకు నైలాన్ దారం చుట్టుకోవడంతో అతడికి తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు.
AP: అనంతపురం జిల్లాలో హత్యకేసులో నిందితుడు వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 8న రాత్రి మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే బోయ ఆంజనేయులు అనే వ్యక్తిని వంశీ అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. దీంతో నిందితుడు వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.
చిప్స్ ప్యాకెట్ పేలి ఎనిమిదేళ్ల బాలుడు కంటిచూపు కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలోని బలాంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ షాపులో చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసిన బాలుడు ఇంటిలోని వంటగదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో చిప్స్ ప్యాకెట్ మండుతున్న గ్యాస్ స్టవ్పై పడింది. వేడి తగలగానే ఆ ప్యాకెట్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ క్రమంలో బాలుడి ముఖంపై పడటంతో అతడి కన్ను పూర్తిగా దెబ్బతింది.
అన్నమయ్య: మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల మక్బూల్ అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. కర్ణాటక నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో, చీకిల బైలు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ను ఢీకొని కిందపడటంతో ఆయనకు గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
TG: హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీని పక్కకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.
TG: శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. గర్భిణి, ఆమె తల్లితో వెళ్తున్న ఉబర్ క్యాబ్ డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘటప జరిగింది. దీంతో వారిద్దరికీ గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదంపై స్థానికులు వెంటనే సమాచారమిచ్చినా అంబులెన్స్ ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విమానాశ్రయానికి వెళ్తున్న ఒక ఊబర్ క్యాబ్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు నెలల గర్భిణి, ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలస్యంగా చేరుకున్న పోలీసులు బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
TG: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక బుద్వేల్లోని ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ కావడంతో ఎగసిపడుతున్న మంటలకు పరిసరాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పుదుచ్చేరి నుంచి కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చి(TN) వెళ్తున్న బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఆకస్మికంగా మంటలు రాగా.. గమనించిన ఆటో డ్రైవర్ సైగలతో బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. దీంతో డ్రైవర్ వెంటనే బస్సు నిలిపి ప్రయాణికులను దింపివేశాడు. అందరూ ప్రాణాలతో బయటపడగా.. క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.
ASR: హుకుంపేట మండలం రాళ్లగడ్డ వద్ద సోమవారం ఉదయం సుమారు 3.15 గంటల సమయంలో అరకు నుంచి పాడేరు వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం కారుపై కూలినా, అందులోని వారు వెంటనే బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. చీకటి వల్లే ప్రమాదం జరిగిందని, ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లా అర్కి ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నేపాల్కు చెందిన ఒక చిన్నారి మృతి చెందింది. మరో తొమ్మిది మంది వలస కార్మికులు మంటల్లో గల్లంతయ్యారు. ఈ మంటలు పక్క భవనాలను తాకడంతో దాదాపు 10 నుంచి 15 దుకాణాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి సహాయక చర్యలు చేపట్టారు.
బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షర్మిల(34)ను ఆమె ఇంటి పక్కనే ఉండే టీనేజర్ కర్నాల్ హత్య చేశాడు. లైంగిక దాడికి ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెను ఊపిరాడకుండా చేసి చంపి, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు బెడ్రూమ్కు నిప్పు పెట్టాడు. మొదట అగ్నిప్రమాదం అనుకున్నా, సైంటిఫిక్ దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ATP: రాయదుర్గం కోట ప్రాంతంలో గాలిపటం ఎగురవేస్తూ ఉపేంద్ర అనే బాలుడు మిద్దెపై నుంచి కిందపడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే రాయదుర్గం ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్కు తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
KKD: కిర్లంపూడి మండలం బూరుగుపూడి వద్ద హైవేపై ఆదివారం రాత్రి బొలోరో వ్యాన్ బోల్తా కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రవరం నుంచి జగ్గంపేట వైపుకు వెళ్తున్న బొలెరో వ్యాన్ సైకిలిస్టును తప్పించబోయి జంక్షన్ వద్ద బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.