KDP: ఎర్రగుంట్ల మండలంలో ఇద్దరు యువకులు ఒక యువతిని ఇబ్బంది పెట్టారు. ఆ కేసులో బుధవారం కోర్టు ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే, ముద్దనూరు మండలం చెర్లోపల్లికి చెందిన గోపాల్, శ్రీధర్ 2023లో ఒక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిపై కడపలో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం కడప కోర్టు ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా విధించింది.
KDP: రాజుపాలెం మండలంలోని టంగుటూరు చెందిన గూడూరు వెంకటయ్య (60) తేనె తీగల దాడిలో మృతి చెందారు. ఇతను తన పొలంలో సాగుచేసిన పంట పొలం వద్దకు వెళ్లగా అక్కడ చెట్టులో ఉన్న ఈగలు ఒక్కసారిగా ఆ రైతును చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర గాయాలైన రైతును ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
CTR: తవణంపల్లి మండలం కె.పట్నం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎస్సై చిరంజీవి.. నిందితులు తుపాకుల మనోహర్ (32), సామ్యూయల్ రాజ్ (34)ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల బంగారు చైన్తో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని జమల్పూర్ గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ జగదీష్ మృతి చెందాడు. స్థానిక రైతు శ్రీనివాస్ పొలంలో పత్తి కట్టెను దున్నేందుకు వెళ్తున్న జగదీష్, ట్రాక్టర్తో కరెంట్ స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరును తాకడంతో స్తంభం విరిగి అతనిపై పడింది. ఈ సంఘటనలో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కోనసీమ: అంబాజీపేట మండలం నందంపూడి గ్రామానికి చెందిన మిద్దెల సత్తిబాబు బుధవారం అంబాజీపేట మురుగు కాలువ వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయాడు. బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
E.G: ఏటీఎంల వద్ద నగదు విత్ డ్రా చేసే క్రమంలో అమాయకులను నమ్మించి కార్డులు మార్చి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అనపర్తి పోలీసులు అరెస్టు చేసినట్లు DSP విద్యా తెలిపారు. నెల్లూరుకు చెందిన ఫణీంద్ర గతంలోనూ పలు నేరాలకు పాల్పడ్డారని, అతని వద్ద నుంచి 10 ATM కార్డులు, ఒక కారు, రూ.3 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కొమ్ముతాండాలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి బైక్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి బలరాం నాయక్ బైక్ కొనివ్వకపోవడంతో కొడుకు భూక్య వెంకటేష్(21) పురుగుల మందు తాగి చనిపోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
కోనసీమ: అమలాపురం మండలం రోళ్ళపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తోట వినయ్(23) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న వినయ్, నిమ్మకాయల సురేష్ను టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. రాజమండ్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో వినయ్ మరణించగా, గాయపడిన సురేష్ అమలాపురంలోని చికిత్స పొందుతున్నాడు.
గుజరాత్లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. అహ్మదాబాద్లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. ఘటన స్థలాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ మేరకు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MHBD: కొత్తగూడ మండల పరిధిలోని రేణ్య తండాకు చెందిన భూక్య బాలుకు అతని భార్య రంగితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం భర్త బాలు మద్యం సేవించి భార్యతో గొడవకు దిగి కత్తితో దాడి చేశారు. దీంతో భార్య అపస్మారస్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ను ముగ్గురు దుండగులు కొట్టి చంపారు. పెట్రోల్ బంకులో ఆగిన లారీ డ్రైవర్ మహ్మద్ సల్మాన్పై దాడి చేశారు. మరో లారీలో వచ్చి ఇనుప రాడ్డుతో కొట్టిచంపి దుండగులు పరారయ్యారు. లారీని చంద్రాయన్పల్లి వద్ద వదిలేసి నిందితులు అడవిలోకి పారిపోయారు.
SRCL: సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ శివాజీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపెల్లి జిల్లా కొమ్మిరి గ్రామానికి చెందిన శివాజీ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుంటుంబికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
AP: అధికార పార్టీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రెండు వేర్వేరు కేసుల్లో 12మంది YCP నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్పై గతంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన శ్రీనివాసులురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప MLA మాధవిరెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన 11మందిని అదుపులోకి తీసుకున్నారు.
MDK: మనోహరాబాద్ మండలం కూచారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీడిమెట్లకు చెందిన చవాకుల రాజ్ కుమార్ (48) మృతి చెందినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ద్విచక్ర వాహనంపై కొండాపూర్ శివారులోని కంపెనీకి వెళ్తూ కూచారం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనుకగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టినట్లు వెల్లడించారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై భార్య మంగమ్మ ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.
HYD: హెచ్సీయూ పరిధిలోని ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో పాదచారి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ పోలీసులు మృతదేహాన్ని తరలించడంతో, ప్రస్తుతం ట్రాఫిక్ సాధారణ స్థితికి వచ్చిందని పోలీసులు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు.