మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందూర్బార్ జిల్లాలోని చాంద్షాలి ఘాట్ రోడ్డులో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. 15 మందికి తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
TPT: వెంకటగిరి – నిడిగల్లు రైల్వే స్టేషన్ల మధ్యలో పెట్లూరు గ్రామ సమీపంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. వెంకటగిరి స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NZB: నవీపేట్ మండలం కమలాపూర్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. నాగేపూర్కు చెందిన నరేష్ బైక్పై నిజామాబాద్ వెళ్తుండగా.. రాజు అనే వ్యక్తి బైక్తో ఢీ కొట్టాడు. దీంతో నరేష్, రాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో NZB జిల్లా ఆస్పత్రికి తరలించారు.
TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లి, కూతురు మరణించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన విఘ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికాలో ఉంటున్న ఇద్దరు కూతుళ్ల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారు కారులో ప్రయాణిస్తుండగా.. వీరి కారును ట్రక్కు ఢీకొట్టింది. విఘ్నేష్-రమాదేవి దంపతుల కుమార్తె తేజస్వి (32), ఆమె తల్లి రమాదేవి (52) ఈ ప్రమాదంలో మృతి చెందారు.
PDPL: ధర్మారం మండలంలో పెన్షన్ ఇప్పిస్తానంటూ వృద్ధురాలిని మోసం చేసి, 2 తులాల బంగారు గొలుసు దొంగిలించిన అల్లెపు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో ఇతనిపై 96 కేసులు ఉన్నాయని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. నవీన్ మెడికల్ ఏజెన్సీ వద్ద నిందితుడిని పట్టుకొని, బంగారు గొలుసుతో పాటు రూ.30 వేలు నగదును రికవరీ చేసినట్లు చెప్పారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని కొత్తవలస గ్రామ మలుపు వద్ద శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు హుటాహుటిన క్షతగత్రులను 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MDK: పాపన్నపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతు మస్కూరి లక్ష్మయ్య(57) పురుగు మందు తాగడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. లక్ష్మయ్య మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు చేసేవాడు. ఈనెల 16న కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన ఆయన పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD: బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లోని కౌశిక్ సొసైటీలో జలమండలి ఆస్తిని దెబ్బతీసిన కాంట్రాక్టర్ మహ్మద్ ఇమ్రాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ అనుమతి లేకుండా రోడ్డును తవ్వడంతో వాటర్ పైప్ లైన్ దెబ్బతిని, స్థానికులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. జలమండలి అధికారులు వెంటనే స్పందించి, ఘటనా స్థలాన్ని పరిశీలించి కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేశారు.
KNR: హుజురాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన 17 ఏళ్ల ఐటీఐ విద్యార్థి మోరే ఋషి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంటలో ఐటీఐ సెకండియర్ చదువుతున్న ఋషి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
MNCL: జన్నారం గ్రామపంచాయతీలోని సేవదాస్ నగర్కు చెందిన జాదవ్ శంకర్ నాయక్ (60) అనే వృద్దుడు ఆయన కుమారుడు నూరు సింగ్ చేతిలో హతమయ్యాడు. శనివారం సాయంత్రం ఇంట్లోనే కుటుంబ కలహలతో మాట మాట పెరిగి నూర్ సింగ్ దాడి చేయడంతో శంకర్ నాయక్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సై గొల్లపల్లి అనూష సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
CTR: శాంతిపురం (M) బడుగుమాకులపల్లి వద్ద బైకును కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వెంకటరామప్ప (55), సత్యప్ప (60) బైకుపై బడుగు మాకులపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా పలమనేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట రామప్ప అక్కడికక్కడే మృతిచెందగా, సత్యప్ప తీవ్రంగా గాయపడ్డాడు.
BPT: మార్టూరు మండలంలో శనివారం బాలిలో మృతదేహం కలకలం రేపింది. ఇసుకదర్శి, వలపర్ల గ్రామాల మధ్య పొలాల దారిలో ఉన్న ఒక దిగుడు బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RR: గర్భిణి మృతి చెందిన ఘటన మంచాల మండలం లింగంపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. 7 నెలల గర్భవతి అయిన మానస అనే మహిళ మంచాల మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఇంజక్షన్ కోసం వెళ్ళింది.బీపీ చెక్ చేయకుండా ఇంజక్షన్ వేయడంతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
TG: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దహేగాం మండలం గెర్రే గ్రామంలో 9 నెలల గర్భిణి రాణిని ఆమె మామ సత్యనారాయణ గొడ్డలి, కత్తితో నరికి హత్య చేశాడు. వేరే కులం అమ్మాయిని కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చక ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కొడుకు లేని సమయం చూసి అత్తవారింట్లో ఉన్న రాణిని హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు గర్భిణీలు మృతిచెందారు. ఆసిఫాబాద్(D) గెర్రెలో గర్భిణీ అయిన తన కోడలిని ఓ వ్యక్తి నరికి చంపాడు. కొడుకు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతోనే అతను ఈ హత్య చేసినట్లు సమాచారం. అటు కామారెడ్డి(D) తిమ్మాపూర్ గ్రామంలో వరకట్న వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లల ముందే నాగరాణి(25) అనే గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.