తిరుపతి నుంచి విమానాశ్రయం వెళ్లే మార్గంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. కాలువలో నీటి లోతు తక్కువగా ఉండటంతో డ్రైవర్ బాబు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ముర్బాద్ సమీపంలోని గోవిలి గ్రామం వద్ద ఉన్న రైతా వంతెనపై ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను సిమెంట్ మిక్సర్ బలంగా ఢీకొట్టిడంతో 11 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల అతను అనారోగ్యానికి గురయ్యాడు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. బిస్కెట్ కలర్ షర్ట్, పాచి కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. అతడిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పలమనేరు పోలీసులు కోరారు.
TG: హైదరాబాద్ బేగంపేట యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రమణ ఓ NRI ఖాతా నుంచి రూ.7 కోట్లు కాజేశాడు. ఆస్ట్రేలియాలో ఉండే బాధితుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి 41 విడతల్లో ఈ సొమ్ము డ్రా చేశాడు. 2024లో ఫిర్యాదు అందగా, పరారీలో ఉన్న నిందితుడిని పంజాగుట్ట పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మరికొందరు సిబ్బంది ప్రమేయంపై విచారణ జరుగుతోంది. ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన మేనేజరే మోసానికి పాల్పడటం సంచలనం రేపింది.
TG: వికారాబాద్(D) పెద్దేముల్ మండలం తట్టేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా, ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తతో పాటు కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరు రుక్మాపూర్ నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నైజీరియాలో భారీ వైమానిక దాడి జరిగి 200 మందికి పైగా మరణించారని సమాచారం. ఈశాన్య ప్రాంతంలో ఉన్న యోబో-బోర్నో రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో నైజీరియా ఎయిర్ఫోర్స్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రభుత్వ ఎయిర్ఫోర్స్ వైమానిక దాడుల వల్ల ఇన్ని వందల మంది పౌరులు చనిపోవడం ఇప్పుడు నిరసనలకు దారితీస్తోంది.
TG: హైదరాబాద్లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్లో భారీ మోసం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో బ్యాంక్ మేనేజర్ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వినియోగదారుడి ఖాతా నుంచి రూ.6.5 కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను విదేశాల్లో ఉన్న సమయంలో కుట్ర చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతకం ఫోర్జరీ చేసి లూజ్ లీఫ్ చెక్కులు వినియోగించారని తెలిపారు.
AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాడేరు మండలం బంట్రోతుపుట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బైక్ లోయలోపడి తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఈ ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు బాలురు మరణించారు. పన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు మత్స్యగెడ్డలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా మరొకరు బయటకు వచ్చి కేకలు వేశారు. సమీపంలోని మత్స్యకారులు ఒకరిని కాపాడారు. మిగిలిన ముగ్గురూ మృతిచెందారు. మృతులను హర్షిత్(12), ప్రదీప్(11), బబులు (10)గా గుర్తించారు.
TG: ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లకు పైగా నగదు మాయమయ్యాయి. ఈ ఘటన HYDలోని SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో SR నగర్ పరిధిలోని 31 ఏటీఎంలలో తనిఖీలు చేపట్టగా 8 ఏటీఎంలలో భారీగా నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. రూ.1,20,98,500 నగదు లోటు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
AP: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు మండలంలోని ఓ గ్రామంలో కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తల్లి భర్తతో గొడవపడి ఇద్దరు కుమార్తెలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. రెండ్రోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో ఒంగోలు రిమ్స్లో చేర్పించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురంలో దారుణం జరిగింది. అన్న దేవభక్తుడి(38)ని తమ్ముడు విజయరాజు రోకలి బండతో కొట్టి చంపాడు. పొలం పంపకాల విషయంలో అన్నదమ్ములైన దైవభక్తుడు, విజయరాజుకు తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరగగా విజయరాజు రోకలిబండతో అన్న దైవ భక్తుడుపై దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నేలవంచలో విషాదం చోటుచేసుకుంది. బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. విద్యార్థులను శ్రీజ(9), చైత్ర(9)గా గుర్తించారు. విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
AP: ప్రకాశం జిల్లా ధర్మవరంలో RMP డాక్టర్ కోటిరెడ్డి(47) హత్యకు గురయ్యాడు. ముగ్గురు దుండగులు వైద్యం కోసమని అర్ధరాత్రి డాక్టర్ ఇంటి తలుపు తట్టారు. తలుపు తీయగానే కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో డాక్టర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కోటిరెడ్డి భార్య భయాందోళనతో స్పృహ కోల్పోయింది. దుండగులు మాస్కులు ధరించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బొలేరోలో 20 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. బొలేరో వాహనం నర్సాపురం నుంచి సత్తెనపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.