MNCL: బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని నెన్నెల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టు మల్లేష్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. BJP నాయకుడు ఏమాజీకి MLAను విమర్శించే అర్హత లేదన్నారు. ఏమాజీ తాను లాయర్ అని చెప్పి ఎన్ని అక్రమ వసూళ్లు చేశాడో తమ వద్ద చిట్టా ఉందని ఆరోపించారు. MLAపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
KMM: సీపీఐ (ఎం) పార్టీ నాయకుడు సామినేని రామారావు హత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు తెలిపారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దోషులను కఠినంగా శిక్షించే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని, దీనికి ప్రజాస్వామ్య ప్రజాతంత్ర వాదులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
NLG: చింతపల్లి మండలంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సోమవారం పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు చింతపల్లిలోని పెద్ద చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఎస్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల అశోక్ నగర్కు చెందిన చింతకింది సోమయ్య (55) ఆర్థిక ఇబ్బందులతో మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆదివారం ఉదయం వాగులో శవం లభ్యం కాగా పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
SDPT: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు సత్యనారాయణ వ్రతం పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయాలు చేకూరాలని సత్యనారాయణ వ్రతం చేసినట్లు తెలిపారు.
BHNG: ఆత్మకూరు (ఎం) మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ యాస పద్మా రెడ్డి సీనియర్ సిటిజన్స్ ఆత్మకూర్ (ఎం) మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా, నేతాజీ యువజన మండలి వారు ఈరోజు వారి నివాసంలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్కి, NYMకి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు.
ADB: బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని బోథ్కి చెందిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్&ఇన్ఫ్రా స్ట్రక్చర్ GM డా. రుక్మారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు ఆగిపోయాయని సూపరింటెండెంట్ డా.రవికుమార్ తెలిపారు. ఈ మేరకు నిధులు విడుదల అయ్యేలా చూస్తానన్నారు.
HYD: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు ఇంఛార్జ్ ఇటుక శ్రీకిషన్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం ఢిల్లీ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చలో ఢిల్లీ పిలుపు మేరకు నవంబర్ 17న మహాధర్నాకు ప్రతిఒక్కరు తరలివస్తున్నారని తెలిపారు.
SRD: ఖేడ్ మండలం లింగాపూర్ గ్రామంలో కొలువైన మార్కండేయ స్వామి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా పద్మశాలి కుల బాంధవులు, ఆలయ కమిటీ, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణం తిలకించారు.
NRPT: తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందని మోసగాళ్లు చెప్పే గొలుసుకట్టు (Multi-Level Marketing) వ్యాపారాల జోలికి ప్రజలు వెళ్లవద్దని జిల్లా ఎస్పీ వినీత్ హెచ్చరించారు. ఈ వ్యాపారాల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, మాయ మాటలు నమ్మి మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను కూడా నమ్మకూడదని తెలిపారు.
ADB: ఈ నెల 25వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో CITU ఆధ్వర్యంలో జరిగే 5వ మహాసభను జయప్రదం చేయాలని అంగన్వాడీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం నార్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో సమావేశమయ్యారు. అంగన్వాడీలకు ఉన్న సమస్యలపై చర్చించనున్నామని ఆమె పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో మొత్తం 6362 కేసులు పరిష్కరించబడ్డాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్ల్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు కేసులు 548, డ్రంక్ అండ్ డ్రైవ్ / MV యాక్ట్ కేసులు 2515, పెట్టి కేసులు 3254 పరిష్కరించారు. అలాగే సైబర్ క్రైమ్ 45 కేసుల్లో రూ. 8,84,642 రూపాయలు బాధితులకు తిరిగి అందజేశారు.
NZB: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి అన్నారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో ఆదివారం జరిగిన ZPHS కోలిప్యాక్ స్కూల్ అసిస్టెంట్ జెస్సు వినోద్ కుమార్ ఉద్యోగ విరమణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాలన్నారు.
MDK: జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నందున జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు జరగవని జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఐ జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో ఎల్1, ఎల్2 పద్ధతి అనుసరించడంతో, దానిని వ్యతిరేకిస్తూ బందు చేస్తున్నట్లు తెలిపారు. మిల్లులు బంద్ ఉన్న కారణంగా పత్తిని తీసుకురావద్దన్నారు.
MDK: మైదాన ప్రాంత గిరిజనులకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఇవాళ శివంపేటలో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. 12 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు గిరిజనులకు కేటాయించి, అందులో మైదాన ప్రాంత గిరిజనులకు ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం కేటాయించాలన్నారు.