PDPL: అల్లూరు గ్రామంలో శనివారం రాత్రి జాతీయ పక్షి నెమలిపై కుక్కలు దాడిచేస్తుండగా స్థానికులు గుర్తించి కాపాడారు. టుటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని జాతీయ పక్షి నెమలిని స్వాధీనం చేసుకున్నారు.
SRD: సంగారెడ్డి బైపాస్ చౌరస్తాలో ఆదివారం చేపల ధరలకు రెక్కలొచ్చాయి. వివిధ రకాలైన చేపల విక్రయాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు కిలో చేపలు రూ.300-400 వరకు విక్రయిస్తున్నారు. ప్రజలు ఉదయం 6 గంటల నుంచే చేపలు కొనడానికి వచ్చారు. దీంతో డిమాండ్ బాగా పెరిగిందని పలువురు అంటున్నారు.
జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ తన ఉదారతను చాటుకున్నాడు. జగిత్యాల-కడెం బస్సు శనివారం కడెంకు బయలుదేరింది. తిరిగి జగిత్యాలకు వస్తుండగా బుట్టాపూర్లో బస్సు ఎక్కిన దుర్గం శామ్యూల్ అనే వ్యక్తి బ్యాగును బస్సులోనే మర్చిపోయి దిగాడు. గమనించిన కండక్టర్ సుంకరపెల్లి అశోక్ బ్యాగులో రూ.27 వేలు ఉన్నట్లుగా గుర్తించి సంబంధిత వ్యక్తికి సమాచారం అందించాడు.
PDPL: ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి మంథని జూనియర్ కళాశాల మైదానంలో రూ.35 లక్షల నిధులతో చేపట్టిన సింథటిక్ టెన్నిస్ కోర్టు, రూ.10 లక్షలతో చేపట్టిన చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ మీదుగా ఈనెల 9వ తేదీ నుండి సెప్టెంబర్ 25 మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. 07717(తిరుపతి-హీసుర్), 07718(హిసూర్-తిరుపతి), 07653 కాచిగూడ -తిరుపతి, 01654 తిరుపతి -కాచిగూడ, 07219(నరసాపూర్-తిరువన్నామలై), 07220(తిరువన్నమలై-నరసాపూర్)ప్రత్యేక రైలు సర్వీసులు ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
MDK: ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ అన్నారు. మెదక్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మంది అభ్యాసకులను చేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి పాల్గొన్నారు.
NZB: మాదకద్రవ్యాల నియంత్రణ మన అందరి బాధ్యతని భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సీ. జైపాల్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, నివారణపై కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు.
MDK: అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ హై స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థులు ట్రీపుల్ ఐటీ బాసరకు ఎంపికైనట్లు HM రమేష్ తెలిపారు. పాఠశాలకు చెందిన ఇప్ప తేజశ్రీ, అఖిల్, నందు, చాకలి కీర్తన, స్రవంతి ట్రీపుల్ ఐటీకి ఎంపికైనట్లు వివరించారు. ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
NLG: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు, అలాగే PGMSTH నందు ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి 1:1 నిష్పత్తి అభ్యర్థుల జాబితా డీఈవో వెబ్సైట్, కార్యాలయం నోటీసు బోర్డుపై ఉంచడం జరిగిందని డీఈవో తెలిపారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 7న మ.12 గంటల లోపు ఆధారాలతో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
WGL: నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TPCC సభ్యులు సొంటి రంజిత్ రెడ్డి హాజరై, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేద ప్రజలకు ఇండ్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు.
MDK: తూప్రాన్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో BLOలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ టేక్మాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు మార్పులపై శిక్షణ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు వెంకటేశం, శ్రీనివాస్, నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ పాల్గొన్నారు.
MDK: తూప్రాన్ పట్టణం నుంచి నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు శనివారం భారీ వాహన ర్యాలీ చేపట్టారు. నాచారం వద్ద ఆలయ ఛైర్మన్ రవీందర్ గుప్తా అభినందన సభ ఏర్పాటు చేశారు. తూప్రాన్ నుంచి 200 వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నంద్యాల శ్రీనివాస్, మామిండ్ల కృష్ణ, డైరెక్టర్లు పాల్గొన్నారు.
NZB: జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మతులు, కనీస వసతుల కల్పనకు రూ. 3.23 కోట్లు విడుదలైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. జూనియర్ కళాశాలల బలోపేతం కోసం మంచినీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, కళాశాలలకు రంగులు, ఫర్నిచర్, బ్లాక్ బోర్డుల నిర్మాణానికి నిధులను వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో పలువురికి డెంగ్యూ లక్షణాలు ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. జ్వరాలు, డెంగ్యూ లక్షణాలు ఉండడంతో డాక్టర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.