JN: పాలకుర్తిలో బీఎస్పీ నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసెంబ్లీ అధ్యక్షుడు ఈదునూరి ప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఉదిత్ రాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుజన నాయకులను టార్గెట్ చేసిందని విమర్శించారు.
JN: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. ఇవాళ జనగామ మండలం యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజ మహేంద్ర నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
BHPL: ఈనెల 21, 22వ తేదీలలో ఎస్ఎఫ్ఎ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఎస్ఎఫ్ఎ నేతలు ఆవిష్కరించారు. టెన్త్ టాలెంట్ టెస్ట్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
BHPL: తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ నూతన భూపాలపల్లి కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిశారు. ఎమ్మెల్యే వారిని ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్ ఉన్నారు.
MNCL: జిల్లాలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో బుధవారం ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫిట్నెస్ సెంటర్ సభ్యులు తులా ఆంజనేయులు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ నేటి యువతరానికి ఆదర్శప్రాయం అన్నారు.
NRML: జాతీయ రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీఓ గోవర్ధన్ అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామం సమీపంలోని జాతీయ రహదారులను వారు పరిశీలించారు. జాతీయ రహదారుల మార్గంలో ప్రతినిత్యం శుభ్రంగా ఉంచేలా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. వీరి వెంట పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
MNCL: లైంగిక దాడికి గురైన బాధితులు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్కు వచ్చే వరకు పరిహారం ఇప్పించే వరకు భరోసా సెంటర్ వారికి అండగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. నస్పూర్లోని భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. లీగల్, మెడికల్ చిన్నారుల కౌన్సిలింగ్ గదులను పరిశీలించారు.
ADB: గుడిహత్నూర్ మండలం మచ్చపూర్ గ్రామంలో శ్రీ హనుమాన్ మందిర 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్ బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. యువకులు జిల్లా, రాష్ట్రస్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు.
HYD: మహానగరంలో ఎప్పటి లాగే నీటి ఎద్దడి మొదలైంది. దీంతో వాటర్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, హాస్టల్లోని బోర్లు అడుగంటి నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. నిర్వాహకులు ఒక్కో ట్యాంకర్కు రూ.800 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే 3 నెలలు నీటి ఎద్దడి మరింత తీవ్రం కానుంది.
KMM: అప్పు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అప్పు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు
NGKL: మానవ అక్రమ రవాణా నివారణ పై అవగాహనలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అండ్ లేబర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్ను ఉప్పునుంతల తహశీల్దార్ ప్రమీల మంగళవారం ఆవిష్కరించారు. వెట్టిచాకిరీ, ఇతర ఇబ్బందికర పనుల కోసం మనుషులను ఉపయోగిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.
NGKL: తాడూర్ మండలంలోని ఐతోల్ గ్రామంలో నేడు ఛత్రపతి శివాజి మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ పాల్గొంటారని అన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
వనపర్తి: జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా నిరంతర విద్యుత్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు ఎవరైనా విద్యుత్ సమస్యలు ఉంటే 1912 హెల్ లైన్కు ఫోన్ చేయాలన్నారు.
SRD: పోస్టల్ యాక్ట్ – 2023 అమలు చేయవద్దని కోరుతూ తపాలా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోస్టల్ శాఖను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.