MNCL: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని SCR సికింద్రాబాద్ డివిజన్ అధికారులు ఈనెల 11,12 తేదీల్లో హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు ( 07473/07474) నడిపించడానికి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా స్పెషల్ రైళ్లతో 2 రోజుల పాటు మరో రెండు ట్రిప్పులు నడపనున్నారు. రైల్వే అధికారుల తాజా నిర్ణయంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
PDPL: గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఆదివారం జరిగే మంత్రుల బహిరంగ సభ నేపథ్యంలో RGM పోలీస్ కమిషనరేట్ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఏసీపీ రమేశ్ పోలీస్ సిబ్బందితో సమావేశమై విధులపై దిశానిర్దేశం చేశారు. వేదిక, గ్యాలరీలు,హెలిప్యాడ్ వద్ద పకడ్బందీ నిఘా ఉంచాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల పార్కింగ్, మళ్లింపుపై స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ADB: ఉట్నూర్ మండలంలోని హాసన్పూర్ గ్రామానికి చెందిన స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు MLA అనిల్ జాదవ్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి రావాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు పేర్కొన్నారు.
KMM: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకోవాలని Dy.CM భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం జిల్లాలో రవాణా అధికారి ధర్మపురి జగదీష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరుగుతున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల అవగాహన కార్యక్రమాల గురించి భట్టి అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని సూచించారు.
PDPL: రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతూ, దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ రైల్వే మేనేజర్ సంజీవ్ రావుకు మల్యాలపల్లి, బద్రి పల్లి గ్రామస్తులు వినతి అందజేశారు. మల్యాలపల్లి, బద్రిపల్లి ప్రాంతంలో రైల్వే ఎగ్జిట్ గేటు లేక ఈ రెండు గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఈ వినతి ద్వారా కోరారు.
KNR: తిమ్మాపూర్ మండలం అలుగునూర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో ఓ ముస్లిం యువతి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గులపై ఉన్న మక్కువతో పోటీల్లో పాల్గొన్న ఆమె, రంగుల మేళవింపుతో అద్భుతమైన ముగ్గును తీర్చిదిద్దింది. ఈ దృశ్యం మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. తోటి మహిళలు, సందర్శకులు అభినందించారు.
RR: ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంకితభావం కలిగిన యువ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అసెంబ్లీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో యూత్ కాంగ్రెస్ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు.
WGL: పట్టణ కేంద్రంలో ఇవాళ MLA నాయిని రాజేందర్ రెడ్డిని శ్రీ భద్రకాళి ఆలయ చైర్మన్ శివ సుబ్రమణ్యం, ఈవో సునీత మర్యాదపూర్వకంగా కలిసి.. సన్మానించారు. ఈ సందర్భంగా MLA నాయిని మాట్లాడుతూ.. దసరా నవరాత్రి ఉత్సవాలకు ముందే భద్రకాళి అమ్మవారి దివ్యకళ, శిల్ప సంప్రదాయాలకు తగినట్లుగా అన్ని హంగులతో పెద్ద రథం నిర్మించాలని MLA సూచించారు. ఆలయ సభ్యులు తదితరులు ఉన్నారు.
KNR: తనపై నమ్మకంతో పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్ష పదవిని అప్పగించిన అధిష్ఠానానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లో జరిగిన సన్మాన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమమే లక్ష్యంగా, వారిని కాంగ్రెస్ వైపు నడిపించే బాధ్యతగా ఈ పదవిని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
KNR: సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తులు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు.
BHNG: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య ఖజానాకు శనివారం రూ.24,41,053 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,39,950, కళ్యాణ కట్టతో రూ.55,500, బ్రేక్ దర్శనాలతో రూ.2,18,400, VIP దర్శనాలతో రూ.2,55,000, ప్రసాద విక్రయాలతో రూ.10,01,120, కార్ పార్కింగ్తో రూ.3,65,500, వ్రతాలతో రూ.89 వేలు, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.
SRD: అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సదాశివపేట పట్టణంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను పేదలకు 3,500 ఇళ్ల పట్టాలు ఇస్తే, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. మీ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలివి లేదని ఆరోపించారు.
NZB: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇటీవల మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే NZB పేరును ఇందూరుగా మారుస్తామన్నారు. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. ఎంపీ అర్వింద్ మాటలకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు శనివారం తెలిపారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ నగరం పేరును ఇందూరుగా మారుస్తామన్నారు.
KNR: సైదాపూర్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా, సైదాపూర్ మండల కేంద్రంలో అవగాహన నిర్వహించారు. సర్పంచ్లు, ఉపసర్పంచ్ల ఆధ్వర్యంలో వినూత్నంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ముగ్గుల రూపంలో రహదారి నిబంధనలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ రూరల్ సీఐ హాజరై ప్రసంగించారు.