SRPT: ఈ నెల 10న హైదరాబాద్లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజలు విసుగు చెందారని, 2028లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆయన అన్నారు.
NLG: మునుగోడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ పేద విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు నారబోయిన రవి మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీఐ రాములు, తహసీల్దార్ నరేష్, ఎస్సై రవి, సర్పంచ్ రమాదేవి తదితరులు పాల్గొని లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు.
NRML: జిల్లా తానూర్ మండలంలోని బోంద్రేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో రైతులు షిందే సుదర్శన్, కావేరి, జనార్ధన్లకు చెందిన సుమారు 6 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైంది. అప్పులు చేసి కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ASF: బైక్ అదుపుతప్పి తిర్యాణి మండలం గిన్నెదరికి చెందిన ఉపాధ్యాయుడు మడావి రవి (36) అక్కడికక్కడే మృతి చెందాడు. సుంగాపూర్ పాఠశాలలో CRTగా పనిచేస్తున్న రవి మంగళవారం స్వగ్రామం గిన్నెదారికి బైక్పై బయలుదేరారు. తుంపల్లి శివారులోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుకు తలబలంగా ఢీకొట్టడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
SRCL: జిల్లాలో 11 సబ్ స్టేషన్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశం అనంతరం ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ మంత్రులు ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు, నాగేశ్వరరావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు.
PDPL: రైతులు పంట మార్పిడి చేసి లాభదాయక పంటలపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామణరావు సూచించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎలిగేడు మండలంలో నిర్వహించిన రైతు వారోత్సవంలో పాల్గొన్నారు ప్రతి రైతు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలని సూచించారు.
KNR: శంకరపట్నం మండలం గద్దపాకలో విషాదం నెలకొంది. మంగళవారం సాయంత్రం మబ్బులు కమ్మేయడంతో ధాన్యాన్ని కుప్పలు పోస్తుండగా గ్రామానికి చెందిన కొయ్యడ ఐలయ్య ఒక్కసారిగా కుప్పకూలినట్లు స్థానిక రైతులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
SDPT: ప్రజలు తెలంగాణ రక్షణ సేన(TRS) పార్టీని ఆదరించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దుబ్బాకలోని రామాలయ దర్శనానికి వెళ్తూ మంగళవారం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆమె కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే సిద్దిపేటలో పర్యటించి అన్ని కమిటీలను నియమిస్తామని తెలిపారు. ఇక్కడి ప్రజలు తమకు అండగా ఉంటారనే నమ్మకం ఉందన్నారు.
MLG: ములుగు, మల్లంపల్లి మండలాల్లో త్వరలో జరగనున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నేపథ్యంలో మండల స్థాయి పోటీల్లో పాల్గొనదలచిన జట్లు మే 10లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంగళవారం డీఎస్పీ ఎన్. రవీందర్ తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ లేదా ములుగు పోలీస్ స్టేషన్ (8712670082) నంబర్ కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
MDK: మెదక్ మార్కెట్ ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు మెరుపు దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.37,335 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో వెంకట్, హుస్సేన్, శేఖర్, రంగారాం, రాజు ఉన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
VKB: జనాభా గణనపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఇవాళ్టితో ముగిసింది. ఈ ముగింపు సభలో మున్సిపల్ కమిషనర్, ఛార్జ్ ఆఫీసర్ వెంకటయ్య పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గణన ప్రక్రియలో ఎటువంటి తప్పులు దొర్లకుండా, ఖచ్చితమైన వివరాలను సేకరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.
MHBD: మే 10వ తేదీన హైదరాబాద్లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బహిరంగ సభను పురస్కరించుకొని మహబూబాబాద్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు మహబూబాబాద్ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
VKB: రైతులు ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ ఉద్యానవన పంటల సాగుతో అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి లాభదాయకమైన ఉద్యాన పంటల వైపు మళ్లాలని సూచించారు.
WGL: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని BJP జిల్లాఅధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. బహిరంగ క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కేంద్రం WGL జిల్లాకు మామునూరు ఎయిర్పోర్టు, గిరిజన యూనివర్సిటీ, రైల్వే ప్రాజెక్టులు వంటి అనేక నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు.
JGL: కోరుట్ల పట్టణంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు శాంతి సమావేశం నిర్వహించారు. సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని హెచ్చరించారు. గోవుల రక్షణ పేరుతో వాహనాలను అడ్డుకోవద్దని తెలిపారు.