NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ, కేజీబీవీ (KGBV) విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కేజీబీవీలో అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ విభాగంలో ఐశ్వర్య 500 మార్కులకు గాను 495 మార్కులు సాధించగా, బైపీసీలో అక్షయ 440కి 402 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి తెలిపారు. ఇక గురుకుల కళాశాల ఏకంగా 98% ఉత్తీర్ణతతో సత్తా చాటింది.
SDPT: ప్రముఖ కవి కొండి మల్లారెడ్డి రాసిన “చెట్టుకూలుతున్న చప్పుడు” కవిత్వ సంపుటి కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ సభ ఏప్రిల్ 17న సాయంత్రం 6 గంటలకు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కవి యాకూబ్, బూర్ల వెంకటేశ్వర్లు, గఫూర్ శిక్షక్ అతిథులుగా హాజరుకానున్నారు.
GDWL: పేదరికం చదువుకు అడ్డుకాదని గద్వాల మండలం బింగిదొడ్డికి చెందిన ఉప్పరి సాయి చరణ్ నిరూపించాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన వీరేశ్ కుమారుడు సాయి చరణ్.. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 470కి 467 మార్కులు సాధించి అదరగొట్టాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, అతడి తల్లిదండ్రులను గ్రామస్థులు ఘనంగా అభినందించారు.
SRD: హైదరాబాద్ రవీంద్రభారతిలో కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం జరిగింది. జిన్నారం మున్సిపాలిటీ కొడకంచి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి మొగలిమాల పద్యకవితా వినిపించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి దైవజ్ఞశర్మ, సభాధ్యక్షుడు మల్లిక్ చేతుల మీదుగా ఆయనను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.
MDCL: మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 286 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 251 ద్విచక్ర వాహనదారులు, 9 త్రిచక్ర డ్రైవర్లు, 26 నాలుగు చక్ర వాహనదారులు ఉన్నారు. BAC ప్రకారం 36–200 mgలో 259 మంది, 201–300 mgలో 17 మంది, 301–550 mgలో 10 మంది గుర్తించారు. అన్ని కేసులను కోర్టులో ప్రవేశ పెడతామన్నారు.
SRPT: ఇంటర్ ఫలితాల్లో హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా సెకండ్ ఇయర్లో వనజ 987 మార్కులు సాధించగా, ఫస్ట్ ఇయర్ ఈశ్వరి తేజ 470కి 467 మార్కులతో సత్తా చాటింది. రికార్డు స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ గీత, అధ్యాపకులు అభినందించారు.
VKB: కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో దౌల్తాబాద్ మండల కేంద్రానికి చేరుకున్న సీఎంకు మంత్రి వాకిటి శ్రీహరి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమెహ్రా, కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ స్వాగతం పలికారు.
NLG: నందికొండలోని మహాత్మ జ్యోతిబాఫూలే జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. తమ కళాశాలలో 100% ఫలితాలు రావడంపై సిబ్బంది సంజయ్ సాగర్, శివ, రోహిత్, ఉదయ్ శంకర్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.
SRD: తాడ్దాన్పల్లి టోల్ ప్లాజా వద్ద ఆదివారం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారాంతం కావడంతో పాటు పెళ్లిళ్ల సీజన్ వల్ల వాహనాల రద్దీ అంచనాకు మించి పెరిగింది. అయితే, టోల్ ప్లాజా వద్ద తగినన్ని కౌంటర్లు తెరవకపోవడంతో వాహనదారులు ఎండలో అరగంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. దీనివల్ల సమయం, ఇంధనం వృథా అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 132 రోజులకు చేరుకున్నాయి. R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి ఊర్లను ముంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.
NLG: త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ అంకతీ సత్యం ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఐకేపీ ఏర్పాటుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
PDPL: ఇవాళ ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ధర్మారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 43.7%, ప్రథమ సంవత్సరం 25% విద్యార్థులు ఉత్తీర్ణత పొందారని ప్రిన్సిపాల్ అనంత రామకృష్ణ తెలిపారు. ప్రథమ సంవత్సరం చొప్పదండి అనిల్ కుమార్ (C.E.C) 472/500, ద్వితీయ సంవత్సరం E. ఝాన్సీ రాణి (B.P.C) 802/1000 టాపర్గా నిలిచారని పేర్కొన్నారు.
JGL: నిరుపేదలకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండలం మంగేళ గ్రామంలో మహేందర్, వైష్ణవి కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేదల జీవితాల్లో మార్పు వస్తోందన్నారు. లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MHBD: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్మ్యాన్డ్, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తొర్రూరులో చేపడుతున్న నిరాహార దీక్షకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతు తెలిపారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
ASF: తెలంగాణ డీజీపీ పర్యటన నేపథ్యంలో ఆసిఫాబాద్లో బాంబ్ స్క్వాడ్ ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టింది. బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, జిల్లా అంతటా ముందస్తు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.