MBNR: జిల్లా కేంద్రంలోని ఫ్రీడమ్ మైదానంలో ఈ నెల 11న అండర్-23 ‘టుడే లీగ్’ క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు సొంత కిట్టు, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు మైదానంలో సంప్రదించాలన్నారు.
VKB: గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన VKB జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరులో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దూస శ్రీనివాస్ గుండెపోటుకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. శ్రీనివాస్ మృతి పట్ల వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులతోపాటుగా పలువురు ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.
WNP: అమరచింత పెద్ద చెరువు ఆధునీకరణకు మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పటికే శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మళ్లీ బీజేపీ నాయకులు ప్రారంభం చేయడం మంత్రిని అవమానించడమేనని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అరుణ్ కుమార్ గురువారం విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో రూ.314 లక్షల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయని, దీనిపై రాజకీయాలు చేయొద్దని అన్నారు.
MBNR: రాజాపూర్ మండల పరిధిలోని తిర్మలాపూర్లో ‘ఆది చింతల మునిరంగ స్వామి’ వీధి నాటకం భక్తులను విశేషంగా అలరించింది. స్వామి కృప గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ.. ఉండాలని భక్తులు కోరుకున్నారు. ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామీణ కళలు, భక్తి సంప్రదాయాల పరిరక్షణలో వీధి నాటకాలు కీలకమని తెలిపారు.
RR: బీజేపీ, RSSలను ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఖండించారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను నివారించాలని తెలిపారు.
HYDలో ఈ నెల 12న జరగనున్న CDS, ఎన్డీయే పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని 27 కేంద్రాల్లో 10,967 మంది అభ్యర్థులు హాజరుకానుండగా ఈసారి ‘ఫేస్ అథెంటికేషన్’ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని DRO వెంకటాచారి అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు ఈ-అడ్మిట్ కార్డ్, ID ప్రూఫ్తోనే రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
MULG: వెంకటాపురం మండలం వెలుతుర్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గంటోజు సుగుణ, కడారి శ్రీలత అనే ఇద్దరు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
BDK: గజ్వేల్కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజును భద్రాచల దేవస్థానం అధికారులు ఘనంగా సత్కరించారు. 3 దశాబ్దాలుగా భక్తులతో రామకోటిని రాయిస్తున్న ఆయన.. ఏటా స్వామివారి కల్యాణానికి గోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా 300 కిలోల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్ ఆయనను శాలువాతో సన్మానించారు.
RR: ఇబ్రహీపట్నంలోని మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో ఎస్టీ మినీ గురుకుల (బాలికల) హాస్టల్లో 2026- 27 సంవత్సరానికి గానూ 1వ తరగతి, 2వ తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ ప్రతిభ తెలిపారు. గిరిజన బాలికల తల్లిదండ్రులు పిల్లల ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
KMR: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ‘టీటా’సహకారంతో నిర్వహించే ఈ మేళాలో 10 నుంచి PG వరకు చదివిన 18-30 ఏళ్ల యువతీ యువకులు అర్హులన్నారు. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీఐ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి గలవారు 15వ తేదీ ఉ 9 గంటలకు హాజరుకావాలన్నారు.
NZB: TU పరిధిలోని M.Ed మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 15 వరకు, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 20 వరకు విద్యార్థులు తమ ఫీజులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని ఆయన తెలిపారు.
JN: రఘునాథపల్లి మండలం మల్లంపల్లికి చెందిన ఓ మహిళ మగబిడ్డ కోసం పసికందును అపహరించేందుకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. ఎంసీహెచ్ ఆసుపత్రిలో డైపర్ మార్చే పేరుతో పిల్లల వార్డులోకి వెళ్లిన ఆమె, బాబును తీసుకుని ఆటోలో పరారయ్యేందుకు యత్నించినట్లు ఏసీపీ పండరీ చేతన్ తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటపడి ఆమెను పట్టుకుని బిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తీసుకువచ్చారు.
SDPT: గజ్వేల్ మండలం బూర్గుపల్లికి చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు గజ్వేల్ MCH హాస్పిటల్ తీసుకువచ్చారు. అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది ప్లేట్లెట్స్ తక్కువ ఉండడంతో GGH సిద్దిపేటకు రిఫర్ చేశారు. దీంతో 108 కుకునూరుపల్లి అంబులెన్స్ లో తీసుకొని వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో కల్పన మగ బిడ్డకు జన్మనిచ్చింది.
NRPT: మక్తల్ పట్టణ అభివృద్ధిలో భాగంగా విద్యుత్ మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం విద్యుత్ శాఖ అధికారులను కలిసి టీచర్స్ కాలనీ, వినాయకనగర్, శ్రీనివాస, అంజనాద్రి కాలనీల సమస్యలు వివరించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్ల మార్పిడి చేపట్టాలని కోరారు.
ADB: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ యోగాసనాలు వేశారు. మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు, శారీరక, మానసిక సమతుల్యత సాధించేందుకు యోగా అత్యుత్తమ సాధనమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.