MDCL: జనగణన 2027కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అల్వాల్ సర్కిల్లో ఈ నెల 18 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో, వెంకటాపురం కమ్యూనిటీ హాల్లో, లయోలా కాలేజ్ కమిటీ హాల్లో జరుగుతున్న ఈ శిక్షణలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు మాస్టర్ ట్రైనర్లు మార్గదర్శనం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కైలాసపతి, జి. సత్యనారాయణ, డి.ఈ.ఈ పాల్గొన్నారు.
KMM: ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ పి. శ్రీనివాస్ రెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజలకు సమస్యల పరిష్కారంలో అలసత్వం కనిపించకూడదని అన్నారు.
KNR: వందల ఏళ్ల కిందటే కుల, లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బసవేశ్వర జయంతి నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. విద్యను ఆధారంగా చేసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు.
BDK: కొత్తగూడెం IDOC కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ప్రజలు తమ వ్యక్తిగత, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
NRML: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, బోధన విధానాన్ని పరిశీలించారు. సంక్షేమ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
MLG: వెంకటాపూర్ మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ. 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పెద్దమ్మ గుడికి రాష్ట్ర మంత్రి సీతక్క సోమవారం శంకుస్థాపన చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ స్వామి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ తదితరులు ఉన్నారు.
VKB: ఆర్టీవో కార్యాలయం ముందు పారిశుద్ధ్యం పడకేసింది. కార్యాలయ ద్వారం వద్దే డ్రైనేజీ నీరు నిలిచి మురుగు కుంటను తలపిస్తుండటంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లక్ష్యాలు ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BHNG: వలిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో రైతులు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
NLG: డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ బ్యాంకింగ్పై అవగాహనా సదస్సును దామరచర్ల మండలం వాడపల్లిలో సోమవారం నిర్వహించారు. సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ లిటరసీ (Cfl) కో ఆర్డినేటర్ అనిల్ మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను, ఫోన్ కాల్స్కు స్పందించవద్దన్నారు. అదే విధంగా ఓటీపీ, పిన్ నంబర్లను అనుమానిత వ్యక్తులకు తెలియజేయవద్దని తెలిపారు.
SRPT: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 61 అర్జీలు అందాయి. భూ సమస్యలకు సంబంధించి 31, ఇతర శాఖలకు చెందిన 30 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దరఖాస్తులను తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
NGKL: నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లవద్దని, నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని కోరారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపుని SI వెంకటేష్ గౌడ్, ప్రిన్సిపల్ రాజారాం సోమవారం ప్రారంభించారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక క్రీడాంశాన్ని ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రామ్మోహన్ గౌడ్, కరాటి మాస్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
GDWL: జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 83 ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి సమస్యను అధికారులు బాధ్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 141 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ విక్టర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను, ఆయా శాఖల అధికారులకు అప్పగించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని వివరించినట్లు ఆయన చెప్పారు.