ADB: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు లంక రాఘవులు అన్నారు. ఆదివారం సత్నాల మండల కేంద్రంలో నిర్వహించిన 3వ రైతు మహాసభల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర, విత్తనాలు, ఎరువుల పంపిణీ సక్రమంగా అందేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా జరిగాయి. పవిత్ర దినాన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాసౌరవము నిర్వహించారు. సూర్యదేవుని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఆలయం భక్తుల నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
KMR: సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళ నడుమ మహిళలు బోనాలు ఎత్తుకొని పెద్దమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
KMR: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా AICC పరిశీలకుడిగా, జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతారావు పర్యటన కొనసాగుతోంది. పార్టీ బలోపేతం, సమర్థవంతమైన నాయకత్వంపై ఆయన నాయకులు, కార్యకర్తలతో నేరుగా చర్చించి అభిప్రాయాలు సేకరించారు. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై విశ్లేషణ చేశారు.
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో లోక కళ్యాణార్ధం నిర్వహించిన శ్రీ రుద్రాయాగం-చండియాగం ఘనంగా జరిగింది. ఈ మహాయాగంలో 108 దంపతులు పాల్గొని విశేష భక్తిశ్రద్దలతో యాగ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ యాగ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరై, వేద మంత్రోచ్చారణల నడుమ ప్రతేక్య పూజలు నిర్వహించారు.
BHPL: కాటారం మండలం నస్తూరిపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ. 2,063 కోట్లు జమ చేయనున్నారు. యాసంగి సాయంతో కలిపి రైతులకు మొత్తం రూ. 5,653 కోట్ల పెట్టుబడి సహాయం అందనుంది. మూడో విడత నిధులను త్వరలో అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
KMM: వైరాలోని 11వ వార్డులో కౌన్సిలర్ దొంతుబోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉచిత మెడికల్ క్యాంప్’ను వైరా ఎస్సై పుప్పాల రామారావు నేడు ప్రారంభించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించి ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సామాన్యులకు వైద్య సేవలను చేరువ చేసేందుకు నాయకులు చొరవ చూపడం మంచిదన్నారు.
MDK: శివంపేట మండలం పిల్లుట్లలో ఎదురవుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామ పంచాయతీ నడుం బిగించింది. సర్పంచ్ బుర్ర మురళి గౌడ్, పాలకవర్గ సభ్యుల చొరవతో ఆదివారం గ్రామంలో నూతన బోరుబావిని వేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఉప సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.
WGL: నల్లబెల్లి మండలం గుండ్ల పహాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఈ పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చరణ్ సింగ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
GDWL: గద్వాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ జయలక్ష్మి తెలిపారు. ఆదివారం 18, 21 వార్డుల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అమృత్ పథకంలో భాగంగా రూ.1.42 కోట్లు, రూ.1.24 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
RR: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని నేషనల్ పోలీస్ అకాడమీ రిటైర్డ్ డైరెక్టర్ అరుణ బహుగుణ అన్నారు. బూర్గుల గ్రామంలోని ZPHS పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. ఆడపిల్లలను చదువుకు దూరం చేయకుండా చూడాలని, వారిని బాగా చదివిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని తల్లిదండ్రులకు సూచించారు.
ADB: చత్రపతి శివాజీ జీవితం నుంచి యువత ప్రేరణ పొందాలని మాజీమంత్రి, BRS జిల్లాధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. బేల మండలంలో ఆదివారం నిర్వహించిన చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శివాజీ మహారాజ్ దేశభక్తితో పాటు ఐక్యత భావానికి కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
KMR: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం పడడంతో పలు పంటలు దెబ్బతిన్నాయని, రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని BRS పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఇల్లందలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆరూరి మాట్లాడుతూ… KCRను తట్టుకునే శక్తి లేక సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
BHPL: భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో రేపు జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.