SKLM: నరసన్నపేట మండలం జమ్ము జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. శుక్రవారం ఉదయం జమ్ముకు సమీర్ ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లడంతో అదే దిశగా వస్తున్న జగనన్న కాలనీకి చెందిన చౌదరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సమీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చౌదరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
NLR: చేజర్ల(M) ఆదూరుపల్లి ఎస్టీ కాలనీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. చెంచయ్యతో పాటు అతని ఇద్దరు కుమారుల ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. చెంచయ్య తన మనవడి పెళ్లి కోసం దాచిన రూ.3లక్షల నగదు, మూడు సవర్ల బంగారం బూడిదైపోయింది. దీంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
GNTR: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన గురువారం రాత్రి దొండపాడు సమీపంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుపై చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పనులు ముగించుకొని బైక్పై తుళ్లూరు నుంచి వైకుంఠపురం వెళుతున్న గోపిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపి కాలు విరగడంతో పాటు తలకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: కనగల్ మండల పరిధిలోని పగడిమర్రి గ్రామంలో గురువారం రోజు చాపల వేటకు వెళ్ళిన యువకుడు అబ్బిడి నాగార్జున రెడ్డి అదే గ్రామానికి చెందిన కుంటలో గురువారం రోజు మృతి చెందినట్లు స్థానిక తహసీల్దార్ పద్మ తెలిపారు. మృతిడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగార్జున మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
SRPT: సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి ఐలాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం లారీని వెనక నుండి కారు ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పితంపురాలోని గురుగోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లైబ్రరీలో మంటలు చెలరేగాయి.12 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా వరకు లైబ్రరీలోని పుస్తకాలు, సామాగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: భీమవరం వన్ టౌన్ పరిధిలోని పలు లాడ్జిల్లో సీఐ నాగరాజు మంగళవారం రాత్రి సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొత్త బస్టాండ్ వద్ద ఎన్ఆర్కే లాడ్జిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా అనుచిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సూచించారు.
KMM: కరెంట్ షాక్తో యువతి మృతిచెందిన ఘటన అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. అబ్బుగూడెంకి చెందిన మామిడి రెమెల్య మర్రిగూడెంలో కూలీకి వెళ్లింది. ఈక్రమంలో ధాన్యం తూర్పార పోసే మిషన్ ద్వారా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె చెల్లికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమచారం తెలియాల్సి ఉంది.
HYD: భార్యను భర్త హత్య చేసిన ఘటన బాలాపూర్లో కలకలం రేపింది. పోలీసుల కథనం.. దంపతులు నజియాబేగం, జకీర్ న్యూ గ్రీన్ సిటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. గతంలో వీరు గోల్కొండ ప్రాంతంలో ఉండేవారు. కొద్ది రోజులుగా జకీర్కు భార్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విచక్షణా రహితంగా ఆమెను కొట్టి చంపాడు. ఉదయం అత్త రుబీనాకు చెప్పి పారిపోయాడు.
KMR: దోమకొండ మండలం లింగుపల్లి శివారులో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్సై స్రవంతి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బెస్త సురేశ్(45)గా గుర్తించారు. సురేశ్కు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.
HYD: ఉప్పల్ భగాయత్లో విషాదం నెలకొంది. పిల్లర్ గుంతలోని నీటిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుల సంఘాల భవన నిర్మాణం కోసం ఈ గుంతలు తీశారు. నిన్న అదృశ్యమైన మణికంఠ, అర్జున్ ఇదే గుంతలో విగతజీవులుగా కనిపించారు. డీఆర్ఎఫ్ బృందాల ద్వారా మృతదేహాలను బయటకు తీశారు. వీరు సుజాత, వెంకటేశ్ దంపతులకు చెందిన పిలల్లుగా అని తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
మార్కాపురం పట్టణంలోని అన్నా క్యాంటీన్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు చేతికి ఉన్న బంగారు గాజులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోట, రావికంటిపేట మార్గంలో గత రెండు రోజుల క్రితం వేసిన నూతన విద్యుత్ స్తంభాలు సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు విరిగి నేల పడ్డాయని పలువురు స్థానికులు మంగళవారం తెలిపారు. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకు పాత స్తంభాలు పడిపోగా.. వాటి స్థానంలో రెండు రోజుల క్రితమే కొత్త స్తంభాలు వేశారని తెలిపారు.
BHNG: చిట్యాల పట్టణంలో గుండె పోటుతో దినసరి కూలి మంగళవారం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన పల్లపు కోటేశ్వరరావు ఉపాధి కోసం తన కొడుకుని వెంటబెట్టుకుని చిట్యాలకు వచ్చాడు. గుండె పోటు రావడంతో పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
MBNR: జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో ఆదివారం వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభానికి మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినా సరఫరా జరగడంతో ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై స్థానికులు, మృతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.