ATP: గుత్తిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత విచిత్రమైన దొంగతనం జరిగింది. తాడిపత్రి రోడ్డులోని మురళీకృష్ణ జనరల్ స్టోర్లో ఉప్పు ప్యాకెట్లు చోరీకి గురయ్యాయి. ఓ మహిళ ముఖానికి మాస్కు ధరించి అంగడి బయట ఉన్న 15 ఉప్పు ప్యాకెట్ల డబ్బాను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు.
NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు.
KMR: సదాశివనగర్ మండలం కుప్రియాల్ శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లాకు చెందిన రాజశేఖర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు రోడ్డు కిందికి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
AP: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ బజారులో బంగారం వ్యాపారి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. దంపతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్(పదో తరగతి), భువనేశ్(ఆరో తరగతి) ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా విషం తాగి ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ సమీపంలో శ్మశాన వాటిక వద్ద శనివారం పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నుంచి 21 కిలోల గంజాయితో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శనివారం మీడియా సమావేశంలో డీఎస్పీ వివేకానంద వివరించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామన్నారు.
NLR: నగరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం(D) పెద్దచెర్లోపల్లి(M)కి చెందిన ఓ కుటుంబ కలవాయి(M) చీపినాపి గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా శనివారం తెల్లవారుజామున వరికుంటపాడు హైవేపై ప్రమాదానికి గురయ్యారు. విజయవాడ నుంచి కదిరికి బంతిపూల కోసం వెళ్తున్న మినీ ట్రాలీ వారి కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి.
MBNR: ఉరేసుకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. గురుకుల పాఠశాల సమీపంలో ఉండే మణిదీప్ (18) ఉదయం పూట పేపర్ బాయ్గా పని చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఏమైందో కారణం తెలియదు కానీ.. ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మేడ్చల్: ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. రన్నింగ్లో ఉన్న బైక్ని నవత ట్రాన్స్పోర్ట్స్కి చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ రైడర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జోసెఫ్గా పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా కొర్రెండులోని చర్చిలో ఫాస్టర్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.
హన్మకొండ: బైకు అదుపు తప్పి తండ్రి, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కాజీపేట మండలం కడిపికొండ శివారు గృహకల్పవద్ద గురువారం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్కు చెందిన దేవేందర్ సరిత తండ్రి కూతురు తమ బైకుపై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై గుంతలు పడి కంకర తేలివుండడంతో బైకు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తండ్రి, కూతురుకి తీవ్ర గాయాలయ్యాయి.
JGL: కొండగట్టు ఘాట్ రోడ్డులో గురువారం ప్రమాదం జరిగింది.స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఘాటు రోడ్డు దిగే సమయంలో వాహనం పైకి ఎక్కిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం మొత్తం చిత్తడిగా మారిపోవడంతో మృతుడు ఎవరనేది తెలియరాలేదు. ఏదైనా వాహనం ఢీకొట్టిందో తెలియాల్సి ఉంది.
TPT: పుత్తూరు మండలం గోవిందపాలెం హైవేపై బుధవారం కారు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి తిరుపతికి వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్: జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్ మార్కెట్ లేన్లో కాటి నర్సింహా భార్య సుమలత, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను చూసేందుకు ఇటీవల సుమలత తల్లి పుల్లమ్మ ఇంటికి వచ్చింది. స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టగా బన్నీ(4) ఆడుకుంటూ అందులో పడిపోయి మృతి చెందాడు.
అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ నీట మునిగి చనిపోయాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
WGL: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఇవాళ సంగెం మండలంలోని ఆశాలపల్లిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజమహకూర్ తన కుటుంబంతో కలిసి మూడు నెలలుగా ఆశాలపల్లి శివారులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. వారి ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడిపోయింది. వేంటనే MGM ఆసుపత్రికి తరలించినా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.