ADB: గాదిగూడ మండలం మేడిగూడ గ్రామంలో శనివారం భూతగాదాల్లో ఒకరిపై కత్తితో దాడి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామ్ సిందే, ఆకాష్ సిందే అన్నదమ్ముల కొడుకులు. భూమి విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. గొడవ పెరగడంతో ఆగ్రహానికి గురైన ఆకాష్, రామ్ సిందేపై కత్తితో రెండు చోట్ల పొడిచాడు. బాధితుడి భార్య విజయమాల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రణయ్ కేసు నమోదు చేశారు.
AP: అనంతపురంలో గన్స్ సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గన్తో భార్యను భర్త రాజశేఖర్ బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జిమ్ ఓనర్ రాజశేఖర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఠా గన్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. నలుగురిని అరెస్ట్ చేసి 4 రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నారు.
TG: హైదరాబాద్ నల్లకుంట పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. నల్లకుంట వడ్డేరబస్తీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మొదటి అంతస్తులో ఉన్న ఏడుగురిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: కందుకూరులోని ఎన్టీఆర్ బొమ్మ సర్కిల్ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిని ఢీ కొట్టింది. బస్సు టైరు కాలు పైకి వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది. గాయపడిన వ్యక్తిని పక్కనే ఉన్న ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితుడు ఇప్పగుంట గ్రామానికి చెందిన సత్తెనపల్లి నరసయ్యగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
కర్ణాటక పావుగడలో APSRTC బస్సు ప్రమాదానికి గురైంది. సత్యసాయి జిల్లా పెనుగొండ నుంచి పావుగడ వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టగా.. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బస్సులోని దాదాపు 25 మంది ప్రయాణికులు గాయపడగా.. వారందరినీ పావుగడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట మాధవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితుడు గురుమూర్తికి మరదలుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ ఎఫైర్ కారణంగానే తరచూ గురుమూర్తి, మాధవి మధ్య గొడవలు జరిగేవని తెలిసింది. ఇదే విషయంపై పలుమార్లు పంచాయతీ చేసినా గురుమూర్తి తీరు మారలేదు. మళ్లీ అదే విషయంపై గొడవ పడటంతో మాధవిని హత్య చేసినట్లు సమాచారం.
తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రూ.3 కోట్ల బీమా డబ్బుల కోసం కన్నతండ్రిని కుమారులే పాముతో కాటు వేయించి చంపేశారు. ఆయనది సహజ మరణమని ఇన్సూరెన్స్ సంస్థ అధికారులను నమ్మించే క్రమంలో దొరికిపోయారు. ముందుగానే తండ్రి పేరిట బీమా చేయించి ఈ ఘాతకానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
సత్యసాయి: పెనుగొండ-పావగడ మార్గంలో శనివారం ఉదయం పెనుగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఉదయం 6 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తుండగా కారును ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: కందుకూరు రూరల్ పరిధిలోని మాచవరం గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, అతనికి రిమాండ్ విధించినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై రేవతి, సిబ్బంది పాల్గొన్నారు.
KRNL: చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామంలో శుక్రవారం 15 ఎకరాల్లో కంది, మిరప పంటల మధ్య గంజాయి సాగు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు, పోలీసులు గుర్తించారు. సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉనేబాద్ శివయ్య భూముల్లో దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆలూరు, చిప్పగిరి ఎస్సైలు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు పరిశీలనలు కొనసాగిస్తున్నారు.
AP: విశాఖలోని సింహాచలం-వేపగుంటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HNK: కాజీపేట పట్టణంలో శుక్రవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందారు. స్థానిక ఎస్సై లవన్ కుమార్ కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వృద్ధుడు మరణించినట్లుగా బాటసారులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతుడి వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటుందని, వివరాలకు 8712685005 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు.
2010లో జరిగిన అనుపమ గులాటీ హత్య కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా రాజేష్ గులాటి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఎలక్ట్రిక్ రంపంతో 72 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. కింది కోర్టు 2017లో అతనికి జీవిత ఖైదు, రూ.15 లక్షల జరిమానా విధించింది. తాజాగా హైకోర్టు ఈ శిక్షను సమర్థిస్తూ అతని బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
AP: శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిల్లుండలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు వరి పొలానికి నిప్పు పెట్టారు. దీంతో భారీగా మంటలు ఎగిసిపడి 20 ఎకరాలకు వ్యాపించాయి. కొద్దిసేపట్లోనే 20 ఎకరాల వరి అగ్నికి ఆహుతైంది. వరి పంట బుగ్గిపాలవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
AP: విజయవాడ కొత్తపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగడానికి రూ.10 ఇవ్వలేదని తాతాజీ అనే వ్యక్తిని ఓ బాలుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావమై తాతాజీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.