AP: అనంతపురం హనీట్రాప్ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారని ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీఐలు రాజేంద్రనాథ్, శ్రీహర్షను కర్నూలు వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు డీఐజీ వద్ద రిపోర్టు చేయాలని ఇద్దరు సీఐలకు ఆదేశించారు. హనీట్రాప్ ముఠాతో సంబంధాలున్న మరో 10 మందిని శిక్షణ ఎస్పీ అశ్విన్కుమార్ విచారిస్తున్నారు.
AP: అనంతపురం హనీట్రాప్ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళలను ఎరగా వేసి కేటుగాళ్లు రూ.లక్షలు దోచుకుంటున్నారు. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురంలోని పలు స్టేషన్లలో హానీట్రాప్ బాధితులు ఫిర్యాదు చేశారు.
AP: తూర్పుగోదావరి జిల్లా ప్రక్కిలంక SBI బ్రాంచ్లో భారీ మోసం చోటుచేసుకుంది. వెంకట నరసింహం అనే వ్యక్తి బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై రూ.6.87 కోట్ల విలువైన 25 ఏబీఎల్ రుణాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. 2019 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ మోసం జరిగినట్లు గుర్తించిన అధికారులు CID పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన CID పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంచికచర్ల మండలం పరిటాలలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కిడ్నీలు పాడవడంతో వైద్యం చేయించుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
AP: కృష్ణా జిల్లాలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో విక్రయించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తల్లి ఆచూకీ గుర్తిస్తామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.
AP: కాబోయే భర్త వేధింపుతలో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లాలో జరిగింది. ఐటీ ఉద్యోగి షాజహాన్ అనే వ్యక్తితో యువతికి నిశ్చితార్థం అయింది. తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, తానంటే ఇష్టం లేదంటూ యువతిని వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలి వద్ద 12 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడిపై ప్రేయసి పెట్రోల్ పోసి చంపిన ఘటన బెంగళూరులో జరిగింది. తనను పట్టించుకోవడం లేదని ప్రియుడిపై కోపం పెంచుకుంది. వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని నమ్మించి ఇంటికి పిలిచింది. అనంతరం కుర్చీలో కూర్చోబెట్టి చేతులు, కాళ్లు కట్టేసి కళ్లకు గంతలు కట్టి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
AP: ప.గో(D) నల్లజర్ల మం. అనంతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపల్లి టోల్గేట్ సమీపంలోని సూచిక బోర్డును కారు ఢీకొట్టడంతో అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను గోపాలరావు పేట ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: శ్రీశైలం ఘాట్రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తుండగా.. డోర్నాల మండలం చిన్నారుట్ల-తుమ్మలబైలు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: ప.గో. జిల్లా నరసాపురం ఏరియా ఆస్పత్రిలో అరుంధతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అద్దె బకాయి అడిగినందుకు అద్దెదారుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన ఆమె, అక్కడ బాత్రూమ్లో ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేయకపోగా, ఎదురుగా తన భార్యపైనే దొంగతనం కేసు పెడతామని బెదిరించారని భర్త రాంబాబు ఆరోపిస్తున్నారు.
ATP: శింగనమల మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. బ్యాంకులో ఉన్న ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బ్యాంకుకు వచ్చిన ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అయితే, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది మంటలను అదుపు చేశారు.
AP: విశాఖలో అనుమానాస్పద స్థితిలో GVMC ఉద్యోగి గౌరీనాయుడు మృతి చెందారు. ఆరిలోవలో గౌరీనాయుడు కుటుంబ సభ్యులు నివాసిస్తున్నారు. భార్యతో కాకుండా ఈనెల 12 నుంచి సహచర ఉద్యోగిని ఇంట్లో ఆయన ఉంటున్నారు. అయితే ఫోన్ చేసినా రాకపోవడంతో గౌరీనాయుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సహచర ఉద్యోగిని ఇంటికి వెళ్లగా ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం కనిపించింది.
TG: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో రౌడీషీటర్ హల్చల్ చేశాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం ఇద్దరిని బెదిరించాడు. వారితో డబ్బులు లేవని చెప్పడంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఉజ్జయిన్ జిల్లాలో క్వారీలో స్నానం చేస్తుండగా 9 మంది గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు ఏడుగురిని రక్షించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లోని మీర్చౌక్లో దారుణం జరిగింది. అన్న, వదినను తమ్ముడు నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.