BHPL: మహాదేవపురం మండలం కాళేశ్వరలో సరస్వతి పుష్కరాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు కాళేశ్వరంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు మజ్జిగ, తాగునీరు అందిస్తున్నారు.
NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు, ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 42,380 పెండింగ్ చలాన్లు వసూలు చేశారు.
AP: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అంతరాయాలపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. అధిక వేడి, గాలి వానల వల్లే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యుత్ కోతలపై ప్రజలకు సమాచారం అందించాలని.. 24 గంటలూ 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండాలని, నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
NLR: కోవూరు మండలం పడుగుపాడు మీదుగా నెల్లూరుకు వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పనుల నిమిత్తం అక్కడ పనిచేస్తున్న జేసీబీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. గాయాలు అయిన వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
KDP: టీడీపీ కార్యకర్తలు నడి బజారులో రాళ్లు రువ్వుకున్నా పోలీసులు కేసు కట్టరా? అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బుధవారం ప్రశ్నించారు. ప్రొద్దుటూరు పౌరుల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే విధంగా రాళ్లు విసురుకుంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
హీరో మోటోకార్ప్ సరికొత్త ‘సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.0’ బైక్ను రూ.86,500(ఎక్స్షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. 124.7cc ఇంజన్తో వచ్చే ఈ బైక్ లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/SMS అలర్ట్స్ వచ్చే డిజిటల్ మీటర్, USB టైప్-సి చార్జింగ్ పోర్ట్, సైలెంట్ స్టార్ట్ ఫీచర్ ఉన్నాయి. ఇది 5 రంగుల్లో లభిస్తుంది.
MNCL: బాల్క సుమన్ BRS కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని మంత్రి వివేక్ ఆరోపించారు. జైపూర్ మండల కేంద్రంలో బుధవారం మాట్లాడుతూ.. సుమన్ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆందోళనలకు పిలుపునిస్తున్నారన్నారు. రైతుల పేరిట నిర్వహించే ధర్నాల్లో నలుగురైదుగురు రైతులు తప్ప మిగతా వారు పార్టీ కార్యకర్తలే ఉంటున్నారని సుమన్ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు
PLD: బక్రీద్ పండుగ వేళ గురజాలలో జంతు సంక్షేమ, ప్రజారోగ్య నియమాలను కఠినంగా అమలు చేస్తామని బుధవారం మున్సిపల్ కమిషనర్ శివన్నారాయణ తెలిపారు. అనుమతి లేని స్థలాల్లో మాంసం అమ్మడం చట్టవిరుద్ధమని, వ్యాపారులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలంతా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.
CTR: ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రాధా రాణి సూచించారు. సదుం మండలం పాలమందలో పలు కార్యక్రమాలలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ప్రజలతోపాటు స్వయం సహాయ సంఘ సభ్యులకు పాడి ఆవుల మంజూరు, పశువుల తొట్టెల నిర్మాణ పనులు మంజూరు చేస్తామన్నారు. పాఠశాల వద్దనున్న వాటర్ ప్లాంట్ మరమ్మత్తులు చేసి బాగు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
KRNL: ఆదోని మండలం పాండవగల్లు గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై ఆదోని వైపు వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
AP: మహానాడు తొలి రోజున పార్టీకి రూ.11 కోట్ల భారీ విరాళాలు వచ్చినట్లు TDP ప్రకటించింది. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు రూ.5 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ.1.50 కోట్లు, సానా సతీష్ రూ.1.50 కోట్లు, భాష్యం రామకృష్ణ రూ.1 కోటి, మరి కొందరు నాయకులు మిగిలిన మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చారని TDP అధినేత చంద్రబాబు ప్రకటించారు.
MDCL: ఉప్పల్, కాప్రా సర్కిళ్లలో చెత్త వేయకుండా నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మైకులు పనిచేయకపోవడంతో మళ్లీ చెత్త కుప్పలు పెరుగుతున్నాయి. తొలుత మంచి ఫలితాలు ఇచ్చిన ఈ వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యంతో దెబ్బతింది. పలు చోట్ల కెమెరాలు మూగబోగా, కొన్ని దొంగతనానికి గురయ్యాయి. దీంతో నాలాలు, ఖాళీ స్థలాల్లో మళ్లీ చెత్త వేస్తున్నారు.
KNR : తెలంగాణలో వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ బొమ్మకల్లోని ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మంత్రులు అధికారుల మధ్య సమన్వయం లేదని అన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.
ADB: అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని CI నరేష్ కుమార్ హెచ్చరించారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మహిళతో అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని పంచాయతీ నిర్వహించి రూ.1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయభ్రాంతులకు గురైన బాధితుడి చేసిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు CI వెల్లడించారు.
GDWL: మల్దకల్ మండలం మద్దెలబండ గ్రామంలో జరుగుతున్న శ్రీ గోకరమయ్య స్వామి ఉత్సవాల్లో బుధవారం ఒక చిన్న పాప తప్పిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పాపని కమిటీ సిబ్బంది తమ వద్ద క్షేమంగా ఉంచుకున్నారు. ఆ పాప కోసం తల్లిదండ్రులు కూడా ఎవరూ రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాపను ఎవరైనా గుర్తిస్తే స్థానిక పీఎస్లో, ఉత్సవ కమిటీని సంప్రదించాలని కోరుతున్నారు.