SDPT: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 18 వేల ఆర్టీజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈనెల 10న హైదరాబాద్ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ టీవీఏసి జెఎసి నాయకులు గౌటే భాస్కర్ పిలుపునిచ్చారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ సబ్ స్టేషన్లో మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
SRCL: ఎల్లారెడ్డిపేట సీఐగా ఓదెల వెంకటేష్ నియామకమయ్యారు. ఎల్లారెడ్డిపేట సీఐగా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ బదిలీ అయ్యారు. కరీంనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్న సీఐ ఓదెల వెంకటేష్ను ఎల్లారెడ్డిపేటకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని గ్రామీణ ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సందర్శించారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఆయన, కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు.
MDK: రాష్ట్రంలోని అసంఘటిత, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, SSA ఉద్యోగులకు రూ.60 లక్షల ప్రమాద బీమా కల్పించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. ఈ మేరకు మెదక్ కలెక్టరేట్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆపద కాలంలో కార్మికులకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.
PDPL: 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 6 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక డ్రైవ్లో ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.
MLG: ఏటూరునాగారం పట్టణంలోని ప్రభుత్వ RITI (T)లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మార్చి 2 నుంచి 15 వరకు దరఖాస్తు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వరంగల్ ITI బాయ్స్ క్యాంపస్ను సంప్రదించాలని ఆయన సూచించారు.
VKB: అంగన్వాడీ కేంద్రాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించాలని కౌన్సిలర్ విశ్వనాథం రాఘవేందర్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని 23వ వార్డు వెంకటేశ్వరనగర్ కాలనీలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలు స్థానికులతో ప్రతిజ్ఞ చేయిస్తూ రాబోయే 99 రోజులలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
NLG: జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ మలుపు వద్ద తెరిచి ఉన్న గేట్ వాల్ వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. స్కూల్ వెనుక వైపు నివసించే స్థానికులు, వాహన దారులు ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో, మున్సిపల్ అధికారులు వెంటనే ప్రమాదాలను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
VKB: పరిగి మండలం మాదారం గ్రామంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్, డీజీపీ సందీప్ షాండిల్లా, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నపిల్లల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆడ పిల్లలను వారి తల్లిదండ్రులు మాత్రమే తాకాలన్నారు.
MHBD: తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి పరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.
KMM: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పేదలకు అందవలసిన రేషన్ బియ్యం పక్కదోవ పడుతుందని, రాష్ట్ర కన్జ్యూమర్ కౌన్సిల్ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో విచ్చలవిడిగా రేషన్ బియ్యం తెలంగాణ మీదగా సరఫరా అవుతుంది. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్ట్ వద్ద నిఘా పెంచాలని సూచించారు.
NGKL: పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ నిర్వహించిన నేషనల్ డెంటిస్ట్ డే కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దంత వైద్యుల సేవలను కొనియాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు.
HNK: హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్టలోని రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆరు అడుగుల భారీ నాగుపాము కలకలం రేపింది. పామును చూసిన విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకొని సమీపంలోని గుట్టల్లోకి వదిలిపెట్టడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలని విజ్ఞప్తి చేశారు.
WGL: నాటుసారా నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట మండలం ముత్తోజిపేట వద్ద తనిఖీలు చేపట్టగా, నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన బానోతు రాజన్న కారులో 300 కిలోల పట్టిక, 100 కిలోల బెల్లం, 5 లీటర్ల నాటుసారను రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. నింధితుల వద్ద కారు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.