KMM: ఈనెల 14, 15 తేదీల్లో సూర్యపేటలో జరిగే TUCI రాష్ట్ర రాజకీయ తరగతులను జయప్రదం చేయాలని TUCI జిల్లా అధ్యక్షుడు వెంకన్న అన్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం కాలరాస్తుందని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకుని అధికారులతో చర్చించారు. వార్డులో పాడైపోయిన బోర్లు, బావులను త్వరితగతిన మరమ్మతులు చేయించి ప్రజలకు తాగునీటి అందించాలని అధికారులకు ఆదేశించారు.
BDK: బంజారా జాతి ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అడుగు జాడలలో నడిచి ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి గిరిజన బిడ్డ కృషి చేయాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుక నిర్వహించారు.
NZB: హుందా రాజకీయాలకు ఇందూరు పార్లమెంట్ నాంది అని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన నూతన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి పోయారని, రేవంత్ రెడ్డి దాన్ని పాతాళానికి తొక్కుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు నడవాలని ఎంపీ తెలిపారు.
BHPL: ఉప సర్పంచ్ ఫోరం జిల్లా కార్యదర్శిగా చిట్యాల గ్రామ ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నేతలు వెంకటేష్ గౌడ్కు నియమక పత్రం అందజేశారు. అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఉప సర్పంచ్ల సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు ఉన్నారు.
JN: చిల్పూర్ మండల కేంద్రంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS) మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈనెల 13న జిల్లా మహాసభను జయప్రదం చేయాలని, 10, 11 తేదీల్లో జనగామ జిల్లా MLAలకు వినతిపత్రాలు అందజేయాలని, 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
MHBD: మరిపెడ మున్సిపాలిటీ నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు నేడు బాధ్యతలను స్వీకరించారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ను ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ సన్మానించారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేస్తూ మరిపెడ మున్సిపాలిటీనీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విప్ అన్నారు.
SRPT: కోదాడ మండల పరిధిలోని తోగర్రాయి గ్రామంలో వేణుగోపాల స్వామి వారి కళ్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇవాళ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా, అనంతరం ఆయన స్థానిక భక్తులు, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు.
SRCL: చందుర్తి మండలానికి కేటాయించిన మహిళా సమాఖ్య భవనాలను జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. యువతకు జాబ్ మేళాలు నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ కింద జిల్లాలోని రైతులు తమ వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీన ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామసభ ఉంటుందన్నారు.
MNCL: రాష్ట్రంలోని బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని శనివారం మంచిర్యాలలోని గాంధీ పార్కుల్లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలలో కుల వివక్షకు గురైన కులాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
SRD: సంగారెడ్డి నుంచి బీహెచ్ఎల్ వరకు పెరిగిపోతున్న కాలుష్యంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మెదక్లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న కంకర మిషన్ల వద్ద దుమ్ము వెదజల్లుతున్నా పొల్యూషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఈ సమస్య పై ప్రత్యేక దృష్టి సారించలన్నారు.
VKB: పెద్దేముల్ మండల మదనంతాపూర్ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 8 ట్రాక్టర్ల ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు, ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్ చేశామని వివరించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
NLG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను హాలియా మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్ ఎడమ కాలువ ప్రాంతంలో వైస్ ఛైర్మన్ రాజా రమేష్ యాదవ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి పారిశుధ్య పనులు నిర్వహించారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలోని పిల్లిగుండ్ల గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి ఇవాళ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పాలని మాజీ సర్పంచ్కు హరీష్ రావు సూచించారు.
MBNR: చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం 2029లో అమలులోకి రాబోతుందని ఎంపీ డీకే అరుణ స్పష్టంచేశారు. ఇవాళ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు జిల్లా ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోడీ మహిళ సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.