MDK: శివంపేట మండలం గుండ్లపల్లిలో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులను అభినందించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
NZB: మోపాల్ మండలం కులాస్పూర్ సర్పంచ్ గుడి జనార్దన్రెడ్డి నిజామాబాద్ రూరల్ MLA రేకులపల్లి డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగా రెడ్డి, తాడేం సర్పంచ్ జలేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
PDPL: మంథని పట్టణంలోని బొక్కలవాగు చెక్డ్యాం గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలతో పూర్తిగా కప్పుకుపోయింది. ఇరువైపులా భారీగా పెరగడంతో నిల్వ నీరు తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. గుర్రపుడెక్క అధికంగా నీటిని పీల్చుకోవడంతో సాగునీటి సరఫరా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం మొక్కలను తొలగించి చెక్డ్యాం పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
BHPL: మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి రమేష్ ఆధ్వర్యంలో GP సిబ్బంది డ్రైనేజ్ కాలువలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో మంచినీటి సరఫరాకు ఆటంకం కలగకుండా పైప్లైన్ లీకేజీ మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు.
JGL: రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన కట్ట గంగన్న ఇటీవల సౌదీ దేశంలో మరణించాడు. విషయం తెలుసుకున్న సౌదీ అల్లీపూర్ సంఘం సభ్యులు ఆదివారం అందరు కలిసి గంగన్న భార్యకు రూ. 1,36,830 ఆర్థిక సహాయం అందించారు. గంగన్న కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్థులు అభినందించారు.
BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికలలో మున్నూరు కాపు కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదివారం పాల్గొన్నారు. రానున్న కాలంలో అన్ని కులాలు, మతాలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాటు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ జూపల్లి రమేష్ పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా పెద్ద మునగాళ్ చేడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆయన తెలిపారు. ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే చెప్పారు.
HNK: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ డివిజన్ అధ్యక్షులు కుమ్మరి రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బూత్ కమిటీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పాలు అడుగుల శివకుమార్ పాల్గొన్నారు.
BHNG: భువనగిరి 12వ వార్డు పగిడిపల్లిలో గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్డు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. కడమంచి రాములు ఇంటి వద్ద ఆగిపోయిన రోడ్డు పనుల గురించి ఆదివారం కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించారు. గ్రామ పెద్దలు, యువత సహకారంతో అడ్డంకులను తొలగించి సర్వీస్ రోడ్డును క్లియర్ చేశారు.
NLG: యూరియా కొరతపై సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు పొట్టదశలో ఉన్న తరుణంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, సాంకేతిక అవగాహన లేక యాప్ ద్వారా కొనుగోలు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందికరంగా పరిణమించిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
BHPL: పలిమెల మండలం పంకెన గ్రామ శివారులోని గోదావరి నది తీరంలో అర్ధరాత్రి వేళ భారీ యంత్రాలతో రహస్య తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తుల్లో కలకలం రేపుతోంది. ఇది ఇసుక అక్రమ రవాణా కోసమా లేక నిధి అన్వేషణ కోసమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
SRPT: నడిగూడెంలోని పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984-85 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ కొల్లు పాపయ్య చౌదరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ ఎదుగుదలకు కారణమైన గురువుల విద్యాబోధనను, తల్లిదండ్రుల సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.
ASF: కాగజ్ నగర్ ఆదివాసి గిరిజన సంఘం సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాలో తూనికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన టెండర్లను వెంటనే పూర్తి చేసి కొమ్మకొట్టుడు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కట్ట రేటును రూ. 10కు పెంచి, 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బోనస్ బకాయిలు చెల్లించాలన్నారు.
NZB: భీంగల్ పట్టణంలోని గ్రామ దేవత పోచమ్మ ఆలయ అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ హద్దులు గుర్తించి కాంపౌండ్ వాల్ నిర్మించాలని, భక్తుల సౌకర్యార్థం నల్లాలు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. అలాగే మొక్కులు తీర్చుకోవడానికి ప్రత్యేక స్థలం, భక్తులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేసి హైందవ ధర్మాన్ని చాటాలన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం వల్లభురావుపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ జ్యోతి ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేరుస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ మహేశ్, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.