JGL: భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ చెక్కపల్లి స్వాతి ఆధ్వర్యంలో గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
MDCL: జిల్లా పరిధిలో ఈ వేసవి కాలంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ శిక్షణ అందించనున్నారు. ఏ అంశాలపై శిక్షణ అవసరమో తెలుసుకునేందుకు సర్వే ఫారమ్ను అధికారిక కేంద్రాలకు పంపించారు. మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ASF: నిర్ణయాత్మక శక్తిగా మహిళలు ఎదిగినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ హరిత పునరుద్ఘాటించారు. ASF వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలసి హాజరయ్యారు. మహిళ సాధికారిత సాధ్యం కావాలంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలన్నారు.
SRPT: నడిగూడెం మండలంలోని కరివిరాలలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనం పనులు నాసిరకంగా చేస్తున్నారని గ్రామానికి చెందిన డీవైఎఫ్ఐ నాయకుడు భద్రయ్య ఆదివారం పనులను అడ్డుకున్నాడు. అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అధికారులెవరూ రాకపోగా పనులు అడ్డుకున్న తనపైనే కొందరు సిమెంట్ కాంక్రీటు పోశారని భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
HYDలో 91 మందితో పాటు ఇండియా, యూకే దేశాల్లోని దాదాపు 7,000 మంది పై నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఉబకాయం పెరుగుతోందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓబీసీటీ కారణంగా భవిష్యత్లో డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
KMM: ఖమ్మం ఆర్టీవో జగదీష్ విధులకు సంబంధించిన శిక్షణ నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆయన 45 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. గ్రూప్-1 విభాగంలో ఆర్టీవోగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రవాణా శాఖ చేపట్టిన సంస్కరణలకు సంబంధించి శిక్షణ కోసం వెళ్లారని ఆ శాఖ సిబ్బంది తెలిపారు. ఆయన వచ్చేవరకు ఎంవీఐ శ్రీనివాస్ ఇంఛార్జ్ RTOగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ADB: ఆదిమ గిరిజనులైన నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉమ్మడి జిల్లా ఆదివాసీలతో సమావేశమయ్యారు. టైగర్ జోన్ పరిధిలోని గ్రామాల్లో ఆదివాసీ అటవీ హక్కు చట్టం ప్రకారం రాయితీలు కల్పించాలన్నారు. పట్టా భూమి గల ఆదివాసీలకు సాగునీరు అందించాలనీ పేర్కొన్నారు.
GDWL: మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు ఆదేశించారు. 11.94 TMCల నీటి సామర్థ్యం పూడిక వల్ల 9 TMCలకు పడిపోవడంపై సమీక్ష చేశారు. నిల్వ సామర్థ్యం పెంచి, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు త్వరగా చేపట్టాలని సూచించారు.
KMR: పట్టణంలోని స్టేషన్ రోడ్డులో డీసీబీ బ్యాంక్ ఎదుట ఆదివారం సాయంత్రం సుమారు 55 ఏళ్ల మహిళ మెడలోని బంగారు తాడును లాక్కొని పారిపోతున్న వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. బంగారు చైన్తో సహా పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్యూటీలో సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లు మధు, కళ్యాణ్లను పట్టణ సీఐ నరహరి అభినందించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జె. భవాని శంకర్ తెలిపారు. కొండ కింద గల వ్రత మండపం హాల్ నంబర్ 2లో ఉదయం 7 గంటలకు హుండీల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
NLG: నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన BPL 5వ సీజన్ ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఫైనల్లో నెర్మట జట్టు విజేతగా నిలవగా, బంగారిగడ్డ జట్టు రన్నరప్, చండూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ముఖ్య అతిథులుగా MLC నెల్లికంటి సత్యం, మున్సిపల్ ఛైర్మన్ డా. కోడి శ్రీనివాసులు పాల్గొని బహుమతులు అందజేశారు.
RR: కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం జరిగిన మూడవ జాతీయ కరాటే పోటీల్లో శంకర్పల్లి మున్సిపాలిటీకి చెందిన ఎల్బీకే బుడోకాన్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 20 మంది విద్యార్థులు పోటీపడగా.. 8 బంగారు, 7 వెండి, 5 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విద్యార్థుల ప్రతిభను మాస్టర్ రవీందర్ యాదవ్ అభినందించారు.
VKB: ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి భూములు సేకరిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని పరిగి మండలం రాపోల్, కాళాపూర్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు భూములను పరిశ్రమల పేరిట తీసుకోవడం వల్ల జీవనాధారం కోల్పోతామని వారు వాపోయారు. ఎన్నికల వేళ హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతుల భూములను లాక్కుని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
SDPT: సింగరేణి ఓవర్ బర్డెన్ (OB) టెండర్లలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ప్రభావంతో కాంట్రాక్టర్లు రింగ్గా ఏర్పడ్డారని, అందుకే SRP OC-II టెండర్ వాయిదా పడుతూ వచ్చిందని ‘X’ వేదికగా విమర్శించారు. బీఆర్ఎస్ పోరాటంతోనే వాస్తవాలు బయటపడుతున్నాయని అని అన్నారు.
NRPT: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక మోటివేషనల్ సెషన్ నేడు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు T-SAT యూట్యూబ్ ద్వారా నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా IAS పాల్గొని విద్యార్థులకు పరీక్షలపై మార్గనిర్దేశం చేయనున్నారు.