ADB: గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేరడీగొండ మండల కేంద్రంలోని ప్రత్యేక మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొని సమావేశంలో మాట్లాడారు. మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
GDWL: భారత విప్లవ యోధుడు కామ్రేడ్ రాయల్ సుభాష్ చంద్రబోస్ (రవన్న) 10వ వర్ధంతి సభను గద్వాలలో CPI(ML) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి హనుమంతు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి ఉద్యమం స్థాయి నుంచి సాయుధ దళపతిగా ఎదిగిన రవన్న సేవలను స్మరించారు.
KNR: గంగాధర మండలంలోని కాచిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు పెద్ది సత్తవ్వ-మల్లేశం దంపతుల గృహప్రవేశ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. నిరుపేదల సొంతింటి కలలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమకు గృహయోగం కల్పించినందుకు లబ్ధిదారుల కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది.
NGKL: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నిపుణుల వైద్య సేవలను వారి ముంగిటకే చేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
MBNR: పొన్నాకల్ స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన రవి, నాగన్న కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
KMM: శ్రీస్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపు సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ గావిస్తారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు కొండపై స్వాతి నక్షత్ర జ్యోతిని వెలిగిస్తారని ఆలయ ఈవో తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
WGL: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాన్ని దరఖాస్తుదారులు సులభంగా తెలుసుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాల్సిందిగా మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా సాఫ్ట్ వేర్ రూపొందించాలని అన్నారు.
BDK: 10 రోజుల ప్రత్యేక డ్రైవ్లో శుక్రవారం దమ్మపేట పంచాయతీ పారిశుధ్య సిబ్బందితో కలిసి పాలక వర్గ సభ్యులు, కార్యదర్శి ప్రధాన సెంటర్ బాలాజీనగర్ రోడ్డుకు ఇరువైపుల చెత్తను తొలగించి శుభ్రం చేసే డ్రైవ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బండి అనంత్ కుమార్ మాట్లాడుతూ, నేటి నుండి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
HNK: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నేటి నుంచి జూన్ 12 వరకు నాలుగు దశల్లో వైద్య శిబిరాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని HNK జిల్లా డాక్టర్ అప్పయ్య తెలిపారు. మొదటి దశలో నేటి నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
NZB: ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో కుమారుడిని గొడ్డలితో హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డబ్బుల విషయమై తండ్రి కొత్తగుళ్ల కిషన్కు తన కుమారుడు భాను ప్రకాశ్ (22)తో గొడవ ఏర్పడిందని పోలీసులు తెలిపారు. కోపంతో గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు చెప్పారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు పంపారు.
MDCL: ప్రొడెన్షియల్ బ్యాంక్ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. శుక్రవారం బోయినపల్లిలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కాలనీలో నివసిస్తున్న యువత, వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.
WNP: అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని MLA మేఘారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశాలలో ఎమ్మెల్యే పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ శాఖలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పైన, వైద్య సదుపాయాల పైన దృష్టి సారించాలన్నారు.
PDPL: గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జీ. నరేందర్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువత పాత్ర కీలకమన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
ASF: రోడ్డు ప్రమాదంలో గాయపడిన AR హెడ్ క్వార్టర్స్ హోంగార్డు పవర్ ధాంజి (42) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. లింగాపూర్ మండలం మోతిపటార్కు చెందిన ధాంజి భౌతికకాయానికి RI విద్యాసాగర్, ఇన్స్పెక్టర్ రమేష్ నివాళులర్పించారు. SP నితికా పంత్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి రూ. 10,000 తక్షణ సాయం అందజేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
SDPT: కళాశాల అభివృద్ధిలో విద్యార్థులే కీలకమని వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ అయోధ్య రెడ్డి సూచించారు.శుక్రవారం కళాశాలలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.