WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఏకాగ్రతతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని” MLA విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు.
NRPT: దామరగిద్ద మండలానికి చెందిన పలువురు రైతులు క్షేత్ర పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాలను సందర్శించారు. అక్కడ అమలవుతున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నిపుణుల ద్వారా అవగాహన పెంపొందించుకున్నారు. రసాయన ఎరువులు లేకుండా జీవామృతం తయారీ, మట్టి సారాన్ని కాపాడుకుంటూ పంటలు సాగు చేసే విధానాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
MBNR:హన్వాడ మండల కేంద్రంలోని 167వ జాతీయ రహదారిపై మురుగునీరు పారుతుండటంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
VZM: ఈనెల 15న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో వినియోగదారుల కమిషన్ DSO మురళీనాథ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు సరైన అవగాహన కల్పించాలని DSO తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూనికల కొలతలు అధికారి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
VSP: ఏయూ పరీక్షల ఫలితాలను విద్యార్థులు నేరుగా వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చని వీసీ ఆచార్య జీ.పీ. రాజశేఖర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మనమిత్ర యాప్ ఉపయోగించి ఫలితాలు పొందే విధానాన్ని డెమో ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం ఏయూ విద్యార్థిని వాట్సాప్ ఉపయోగించి తన రిజిస్టర్ నంబర్లో ఫలితాలు పొందే విధానం లైవ్లో చూపించారు.
KDP: ఒంటిమిట్ట మండలంలోని దర్జపల్లి గ్రామానికి ఉచిత RTC పల్లె వెలుగు బస్సును చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించబోతున్నట్లు ఒంటిమిట్ట టీడీపీ శ్రేణులు తెలిపారు. ఒంటిమిట్ట నుంచి దర్జపల్లి వరకు మొత్తం 9 గ్రామాల ప్రజలకు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఊరటను ఇస్తుందని అంటున్నారు. పరీక్షలకు వెళ్లే కళాశాల, పాఠశాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
కృష్ణా: బాపులపాడులో ఇంటి పన్నుల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. 12 ఏళ్ల క్రితం పెంచిన పన్నులు సరికాదని గ్రామసభలో అధికారులు అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు తగ్గింపు చర్యలు చేపట్టలేదని సామాజికవేత్త V.రాము, న్యాయవాది G.విజయబాబు శుక్రవారం విమర్శించారు. పన్నులు చెల్లించలేదంటూ కుళాయిలకు డమ్మీలు వేయడం, చెత్త సేకరణ నిలిపివేయడం చట్ట విరుద్ధమన్నారు.
సత్యసాయి: సోమందేపల్లిలోని జామియా మజీద్లో ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో రంజాన్ మాసపు 24వ ఉపవాసాన్ని ప్రారంభించారు. సేహరీ అనంతరం మసీదులో ప్రత్యేక నమాజులు నిర్వహించి అల్లాహ్ ప్రార్థనలు చేశారు. రంజాన్ మాసం ఆధ్యాత్మికతను పెంపొందించే పవిత్ర కాలమని, ఈ నెలలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దానధర్మాలు నిర్వహించడం ద్వారా అల్లాహ్ కృపను పొందవచ్చని తెలిపారు.
TG: కొత్తగా రూ. 2,540 కోట్ల రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం బాండ్లను వేలానికి పెట్టింది. వీటిని ఈ నెల 17న వేలం వేయనున్నట్లు రిజర్వు బ్యాంకు తెలిపింది. మొత్తం 21 రాష్ట్రాల కోసం రూ. 58,420 కోట్ల సేకరణకు బాండ్లను వేలం వేస్తున్నట్లు తెలిపింది.
శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. మార్చి 6న రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT వేదిక ఈటీవీ విన్లో మార్చి 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా… అలీ, ధన్రాజ్, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
TG: మూసీ నది అసలు పేరు ముచ్కుంద. ఒకప్పుడు హైదరాబాద్ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చింది. తిరిగి అదే మాదిరి ప్రజల జీవనాడిగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలోని పరివాహక ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించి మూసీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
JGL: ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలోని శ్రీ సాంబ శివ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వేడుకల్లో పాల్గొని శ్రీ పార్వతి సాంబశివ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారు భక్తులకు దివ్య మంగళ ప్రవచనాలు అందించారు.
TPT: చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెలోని క్వారీల్లో పేలుళ్లు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. పేలుళ్ల ధాటికి కొండపై నుంచి భారీ బండరాయి దొర్లుకుంటూ వచ్చి చంద్రగిరి-నాగయ్య గారిపల్లె రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలుళ్ల శబ్దానికి అంజనేయపురం గ్రామంలోని ఇళ్లు కంపించాయని స్థానికులు తెలిపారు.
KDP: సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిల్లను, 3ఆటోలను స్వాధీనం చేసుకున్నామని ముద్దునూరు సీఐ నగేష్ బాబు తెలిపారు. శనివారం నాడు ముద్దునూరు గ్రామంలో LM కాంపౌండ్ ప్రాంతంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి వాహనానికి సంబంధిత రికార్డులన్నీ క్షుణ్ణంగా ఉండాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎర్రగుంట్ల, తాళ్ల పొద్దుటూరు, కొండాపురం సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
SDPT: పంటలకు సాగు నీటిని అందించాలని చిన్నకోడూరు మండలం గంగాపూర్లో రైతులు రైల్వే లైన్ పనులను అడ్డుకోని ఆందోళన చేపట్టారు. రంగనాయకసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న పిల్ల కాలువ పక్కన రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయని, రైల్వే లైన్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా, పనులు నిలిచిపోవడంతో సాగు నీరు వెళ్లడానికి అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.