జనరల్ టికెట్తో స్లీపర్ క్లాస్ బోగీలో పట్టుబడ్డ ప్రయాణికున్ని టీటీఈ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్త గొడవకు దారి తీసింది. కోపంతో టీటీఈని తోసేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది.
Viral News: ఓ ప్రయాణికుడిని నిలదీసిన పాపానికి ఓ టీటీఈ బలి అయిపోయాడు. జనరల్ టికెట్తో స్లీపర్ క్లాస్ బోగీలోకి ప్రయాణిస్తున్న పాసింజర్ టీటీఈకి పట్టుబడ్డాడు. ఏంటని అడిగితే బుకాయించాడు. ఇలా ప్రయాణం చేయడం నేరం అన్నందుకు టీటీఈని రైలులో నుంచి తోసేశాడు. దాంతో పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ పై మరో ట్రైన్ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దారుణమైన ఘటన కేరళలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్నాకులం నుంచి పాట్నా వెళ్లే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో వి.వినోద్ (47) టీటీఈ గా ఉన్నారు. ఆయన విధుల నిమిత్తం మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో స్లీపర్ క్లాస్లో టికెట్లు చెక్ చేస్తుండగా రజనీకాంత్ అనే ప్రయాణికుడు జనరల్ టికెట్తో కనిపించాడు. ఇలా చేయడం తప్పు కదా అని టీటీఈ మందలించాడు. పాసింజర్ సైతం వినకుండా అధికారితో గొడవకు దిగాడు.
ఫైన్ కట్టమని చెప్పడంతో రజనీకాంత్కు కోపం వచ్చింది. ఈ గొడవలో డోర్ దగ్గర ఉన్న టీటీఈను రజనీకాంత్ తోసేశాడు. రన్నింగ్లో ఉన్న ట్రైన్లోంచి వినోద్ పక్కన ట్రాక్పై పడ్డాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన మరో ట్రైన్ వినోద్పై నుంచి వెళ్లింది. చూస్తుండగానే వినోద్ శరీరం ముక్కలుముక్కలైంది. స్పాట్లోనే మరణించాడు. ముళంగున్నతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. దీన్ని చూసిన తోటి ప్రయాణికులు షాక్కు గురయ్యారు. కాసేపటికి తేరుకొని నిందితుడిని పట్టుకున్నారు. తరువాత స్టేషన్లో రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో రైల్వే సిబ్బంది, అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని బాడీ కలెక్ట్ చేసుకున్నారు. రజనీకాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు.