ADB: పోలీసు విధులను ఆటంకపరిచిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. జిల్లాలో ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు SP వెల్లడించారు.
VSP: గత YCP పాలనలో బీసీలను వెంటాడి వేధించారని మంత్రి లోకేష్ విమర్శించారు. ఈమేరకు ఆయన సోమవారం విశాఖలో మాట్లాడారు. అలాగే, శెట్టిబలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోడసకుర్రులో ఆరు నెలల్లో విగ్రహం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
TG: ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. గ్యారెంటీ హామీలు ఎందుకు అమలు కావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భట్టి మాటలకు అర్థాలు వేరులే అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై అనేక లెక్కలు చెప్పిందన్నారు. కానీ వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. ప్రభుత్వం గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
MBNR: నగరంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ‘మినీ సరస్ ఫెయిర్’లో భరోసా కేంద్రం అవగాహన స్టాల్ను సోమవారం మేయర్ గుమ్మాల మమత ప్రారంభించారు. ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ఈ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ నెల 23 నుంచి 29 వరకు జరిగే ఈ ప్రదర్శనలో స్వయం సహాయక సంఘాల హస్తకళలు, ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
KDP: రాజంపేట మండలం ఎస్.ఎర్రబల్లి దొంగతనం కేసును మన్నూరు పోలీసులు చేధించి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.9 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెన్నై తిరువళ్ళూరుకు చెందిన గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే వెల్లడించారు.
JGL: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఒంటి పూట బడి అమలు చేయాలని, మే నెలలో పూర్తి సెలవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారుల ఆరోగ్యం, సిబ్బంది సమస్యలను అధికారులు గుర్తించాలన్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
PDPL: సమీకృత కలెక్టరేట్లోని కార్యాలయాలను జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాడైపోయిన సామాగ్రి తొలగించాలని తెలిపారు. కార్యాలయాలకు వచ్చే ప్రజల దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాలని ఆదేశించారు.
ప్రకాశం: ఏపీకే ఫైల్స్ లింకుల జోలికి పోవద్దని కొండపి సీఐ సోమశేఖర్ ప్రజలను హెచ్చరించారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో పాత్రికేయలతో మాట్లాడుతూ.. ఇటీవల సైబర్ నెరగాళ్లు అమాయకుల బ్యాంకు ఖాతాలో నుంచి వివిధ రూపాలలో నగదు కాజేచేస్తున్నారని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులు ఏవి ఓపెన్ చేసేందుకు ప్రయత్నించవద్దని తెలిపారు.
NRML: పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9719 మంది విద్యార్థులకు గాను 9714 మంది హాజరయ్యారు. బాలురు 4792 మందిలో 4789 మంది, బాలికలు 4927 మందిలో 4925 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 5 మంది గైర్హాజరయ్యారని డీఈవో భోజన్న ఓ ప్రకటనలో తెలిపారు.
KNR: అమరవీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్వ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వీణవంక మండలం చల్లూరులో వీరి 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ పాల్గొన్నారు.
TG: ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా అవసరమైన అన్నిరకాల పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కాంగ్రెస్ ప్రజా పాలన రెండేళ్లలో సుమారు 10 వేల పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశలో ఉందని మంత్రి వెల్లడించారు.
MI కెప్టెన్గా పాండ్యా తప్పుకోవాలని కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ముంబై జట్టులో భారత జట్టుకు T20 WCను అందించిన రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ వంటి అనుభవజ్ఞులైన కెప్టెన్లు ఉన్నారని గుర్తు చేశాడు. అందుకే పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని, సూర్యకు కెప్టెన్సీ అప్పగించాలని సూచించాడు. ఇది MI భవిష్యత్తుకు మేలు చేస్తుందని పేర్కొన్నాడు
కృష్ణా: పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను విద్యార్థులతో భట్టీ పట్టించవద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం మోపిదేవి మండలం వెంకటాపురం ఎంపీపీ స్కూలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పఠన సామర్థ్యం పరిశీలించగా, విద్యార్థులు చూసి చదవటాన్ని గమనించి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం: సింగరాయకొండ పాకాల బీచ్కు వచ్చే సందర్శకుల భద్రతే తమకు ముఖ్యమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. సోమవారం 30 లైఫ్ జాకెట్లను దాతల సహకారంతో మంత్రి పంపిణీ చేశారు. సముద్ర తీరంలో విపత్తు నిర్వహణ సమయంలో ఈ లైఫ్ జాకెట్లు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. సంబంధిత పోలీసు అధికారులకు మంత్రి లైఫ్ జాకెట్లు అందించారు.
AP: తిరుమల శ్రీవారిని దర్శించుకొవాలనుకునే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ లో స్వామివారిని దర్శించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన కోటా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.