ఐశ్వర్య రాజేష్ తమిళంలో ‘అండర్-18’ అనే మూవీలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా.. శరత్ కుమార్, రాధిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్గా పనిచేసిన కార్తీక్ పెరుమాల్సామి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 18 ఏళ్ల లోపు యువత చుట్టూ తిరిగే ఈ కథ, సమాజంలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది.
వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ వివాదంలో చిక్కుకుంది. తమ ‘బీవీ నెం.1’ మూవీలోని ఐకానిక్ పాటలను అనుమతి లేకుండా వాడుతున్నారంటూ పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ దర్శకుడు డేవిడ్ ధావన్పై రూ.400 కోట్ల భారీ నష్టపరిహారం దావా వేసింది. సినిమా విడుదల, ప్రమోషన్లపై స్టే ఇవ్వాలని కోరింది. పాటలు తొలగించి, టైటిల్ మార్చకపోతే మరో రూ.100 కోట్లు కట్టాలని హెచ్చరించింది.
ఢిల్లీ హైకోర్టు.. టీవీ ప్రేక్షకులకు భారీ ఊరట కల్పించే తీర్పు ఇచ్చింది. టీవీ ఛానళ్లలో ప్రకటనల సమయాన్ని గంటకు గరిష్టంగా 12 ని.లకే పరిమితం చేస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలో తెచ్చిన నిబంధనలను హైకోర్టు సమర్థించింది. 2013లో ట్రాయ్ తీసుకు వచ్చిన ప్రకటనలపై కాలపరిమితిన సవాల్ చేస్తూ బ్రాడ్ కాస్టర్లు వేసిన పిటిషన్ను కోర్టును తిరస్కరించింది.
తన పారితోషికం విషయంలో తమిళ స్టార్ ధనుష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ పెరగడంతో నిర్మాతలపై భారం పడకూడదని, ఇకపై తను నటించే సినిమాల్లో సొంత నిర్మాణ సంస్థను భాగస్వామిగా చేయాలని భావిస్తున్నాడట. అంతేకాదు, సినిమా బిజినెస్ మొత్తం పూర్తయ్యాకే తన పారితోషికం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. దీనివల్ల నిర్మాతలకు ఆర్థిక ఉపశమనం లభిస్తుందని ఇండస్ట్రీ టాక్.
విలక్షణ నటన, గంభీరమైన వాయిస్తో క్రేజ్ తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ పుకార్లపై అర్జున్ దాస్ టీమ్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యక్తిగత విషయాలపై కథనాలు రాసే ముందు నిజా నిజాలు తెలుసుకోవాలని మీడియాను కోరింది.
‘మేము ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘గోదారి గట్టుపైన’. జగపతిబాబు, లైలా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం మేలో థియేటర్లలో విడుదలై ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా సైలెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. మరి ఇక్కడ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.
‘పెద్ది’ సినిమాపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా నెగెటివిటీ క్రియేట్ చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు అసత్య ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన చిత్రబృందం, ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిందట. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. కాగా, సినిమా విషయంలో టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని జంటగా నటిస్తోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. తాజాగా ఈ సినిమాలోని శ్రీను, మంగా పాత్రలను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఇంట్రడ్యూస్ ఈవెంట్ను మే 30న సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న భారీ మూవీ ‘పెద్ది’. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. జూన్ 3 రాత్రి 11:45 గంటలకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ IMAX థియేటర్లో ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలో ప్రదర్శితమవుతున్న తొలి పాన్ ఇండియా తెలుగు ప్రీమియర్ షోగా ‘పెద్ది’ అరుదైన రికార్డు సృష్టించనుంది.
మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మిశ్రమ విమర్శలు వచ్చినప్పటికీ.. కలెక్షన్ల వర్షం కురుస్తుండటంతో మేకర్స్ సంతోషంలో ఉన్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే ‘దృశ్యం 4’పై అప్పుడే చర్చ మొదలైంది. ఈ సూపర్ హిట్ ఫ్రాంఛైజీని ఇక్కడితో ఆపేస్తారా లేక పార్ట్-4తో ముందుకు తీసుకెళ్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలను అన్ఫాలో చేయడంపై స్పందించాడు. దీనిని జాతీయ వార్తగా మార్చవద్దని ఆయన కోరాడు. ఇది కేవలం ‘డిజిటల్ డిటాక్స్’ మాత్రమేనని, ఇన్స్టాలో సమయం వృథా కాకుండా ఉండేందుకే అందరినీ అన్ఫాలో చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. వ్యూస్ కోసం చిన్న విషయాన్ని సెన్సేషన్ చేయవద్దని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్లో బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వసూళ్లు ముఖ్యమే అయినప్పటికీ.. వాటితోనే విజయాన్ని నిర్ణయించలేమన్నాడు. ‘మంచి నంబర్లు తదుపరి సినిమాలను నిర్ణయిస్తాయి. అవి బాగుంటేనే మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం లభిస్తుంది. అందుకే నంబర్లు ముఖ్యమే.. కానీ అవే విజయానికి ఏకైక కొలమానం కాదు’ అని అన్నాడు.
టాలీవుడ్ క్లాసిక్ ‘భక్త కన్నప్ప’ విడుదలై ఇవాళ్టితో 50 ఏళ్లు పూర్తయింది. కృష్ణంరాజు కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఈ భక్తిరస మూవీ టెక్నికల్ వండర్గా సంచలనం సృష్టించింది. బాపు దర్శకత్వం, ముళ్లపూడి మాటలు, రాజు గారి నటవిశ్వరూపం మూవీని అమరకావ్యంగా మార్చాయి. ‘శివశివ శంకర’ పాట ఇప్పటికీ భక్తులను ఓలలాడిస్తోంది. ఈ మూవీ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ నుంచి తప్పుకోవడం, ఆయనపై బ్యాన్ విధిస్తు FWICE నాన్-కోఆపరేషన్ ఆదేశాలు ఇవ్వడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగాడట. రణ్వీర్, ఫర్హాన్ అక్తర్లతో మంచి సంబంధాలున్న సల్మాన్.. ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, పరిశ్రమ హితం దృష్ట్యా వివాదాన్ని పెద్దది చేయవద్దని సూచించినట్లు సమాచారం.
సినీ నటుడు అక్కినేని నాగచైతన్య తన ‘వ్యక్తిత్వ హక్కుల’ పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్, ఇమేజ్లను వాణిజ్య ప్రకటనలు, ఇతర అవసరాలకు వాడకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో అమితాబ్, అనిల్ కపూర్, రజినీకాంత్ వంటి వారు కూడా ఇలాంటి హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి రక్షణ పొందారు.