‘వాలా 2’ కేరళ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 25 రోజుల్లోనే రూ.123 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు టాక్. దీంతో లోక, తుడరుమ్ రికార్డులను చెరిపివేసి ఆల్టైమ్ నంబర్ 1 ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకుపైగా రాబట్టిన ఈ మూవీ, 2000 సంవత్సరం తర్వాత కేరళలో 80 లక్షల టికెట్ల మార్కును దాటిన మూడవ సినిమాగా రికార్డుకెక్కింది.
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘అగధ’. ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ వరుసగా నటీనటుల పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నటి ఉల్కా గుప్తా ఫస్ట్ లుక్ పోస్టర్ను వదిలారు. ఇందులో ఆమె ‘మహిమ’ అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ‘కరుప్పు’ మూవీ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా కోసం సంతకం చేసిన మొదటి వ్యక్తి ఆయనేనని, అయితే సినిమా విడుదల కాకముందే సాయి మరో 73 సినిమాలకు సంతకం చేసే స్థాయికి ఎదిగారని బాలాజీ తెలిపాడు. ఆయన ఎదుగుదల చూస్తుంటే గర్వంగా ఉందని, ఆయన్ని ఎంచుకోవడమే తన మొదటి విజయమని పేర్కొన్నాడు.
తెలంగాణలో మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్కు ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చారు. రెంటల్ విధానం వల్ల నష్టపోతున్నామని, మల్టీప్లెక్స్ల తరహాలో పర్సంటేజీ (షేర్) పద్ధతిని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓటీటీ విడుదలపై 8 వారాల లాక్-ఇన్ పీరియడ్, విద్యుత్ సబ్సిడీలను కోరుతున్నారు. ఏప్రిల్ 30లోగా పరిష్కారం లభించని పక్షంలో 450 థియేటర్లు మూతపడుతాయని చెప్పారు.
బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి తనను మోసం చేసిందని బాధితుడు ధర్మేంద్ర ఆరోపించాడు. ఇండియా, యూకేలలో లోన్లు తీసుకుని మరీ ఆమె కోసం ఖర్చు చేశానని, తీరా డబ్బులు అడిగితే లేదా పెళ్లి ప్రస్తావన తెస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని, కేసు పెడతానంటే బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన వెల్లడించాడు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా నటి అనీషా అంబ్రోస్ షేర్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో అనీషా, వెంకటేష్ కాకుమానుతో పాటు శివాత్మిక రాజశేఖర్ కూడా ఉండటంతో, ఆమె ఈ సీక్వెల్లో హీరోయిన్గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.
మోహన్ లాల్, జీతూ జోసెఫ్ క్రేజీ కాంబోలో రాబోతున్న ‘దృశ్యం 3’ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మే 21న సినిమా విడుదల కానుంది. అయితే రిలీజ్కు నెల రోజులే సమయమున్నా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. కేవలం ఫ్రాంచైజీ ఇమేజ్పైనే ఆధారపడి ప్రమోషన్స్ ఊసే ఎత్తకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. సస్పెన్స్ కోసమే ఈ మౌనమా? లేక ఇదో వినూత్న స్ట్రాటజీనా? అనేది మిస్టరీ.
బిగ్బాస్ 9 ఫేమ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి వెండితెరపై మెరవనున్నారు. గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా, వైఎన్ లోహిత్ దర్శకత్వంలో వస్తున్న ‘చీన్ టపాక్ డుం డుం’ మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్, దర్శకుడు రామ్ కుమార్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో దిలీప్ను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, శివకార్తికేయన్, దిలీప్ కలిసి నటించడం సినిమాపై అంచనాలను పెంచడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఏప్రిల్ 24న విడుదలైన ఈ మూవీ తొలి రోజే $217.4M (సుమారు రూ.2000 కోట్లు) గ్రాస్ వసూలు సాధించినట్లు టాక్. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక బయోపిక్కు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. $155M బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ, కేవలం ఒక్క రోజులోనే పెట్టుబడిని వెనక్కి రాబట్టింది.
ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి సీక్వెల్’పై నయా అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని స్పెషల్ రోల్లో తమిళ హీరో శింబు కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన పాత్ర ఈ మూవీ క్లైమాక్స్లో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ను వేసున్నారట. అక్కడే యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారట.
మాస్ మహారాజా రవితేజ, నిర్మాత దిల్ రాజు కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు టాక్. ‘మత్తు వదలరా’ ఫేమ్ హాసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే దర్శకుడు చెప్పిన కథకు రవితేజ, దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘అక్కాయిలు బాగున్నారా!’ అనే ఆసక్తికరమైన టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
బాలీవుడ్ నటి అర్చన పూరన్ సింగ్ చిన్న కుమారుడు ఆయుష్మాన్ సేథీ ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ మోసానికి గురై రూ. 87,000 కోల్పోయాడు. తన ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి డబ్బు డెబిట్ కావడంతో అతను షాక్కు గురయ్యాడు. ఈ విషయాన్ని అతని సోదరుడు ఆర్యమాన్ తన వ్లాగ్లో వెల్లడిస్తూ.. ఆన్లైన్ లావాదేవీలు, గేమింగ్ సబ్స్క్రిప్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.
‘కర’ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని హీరో ధనుష్ చెప్పాడు. ‘ఇది నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా. అసాధారణ సమస్యలను ఎదుర్కొనే ఓ సామాన్యుడి కథ ఇది. దర్శకుడు విఘ్నేశ్ నాకు ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించారు. భవిష్యత్తులో ఆయన పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది, కచ్చితంగా గొప్ప విజయాన్ని అందుకుంటుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.