• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సత్యసాయి: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐదో తరగతి స్థాయిలోనే తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఈ పరీక్ష ఉంటుందని వివరించారు.

February 27, 2026 / 06:00 AM IST

నేటి నుంచి రాయలచెరువు రైల్వేగేటు మూసివేత

ATP: యాడికి మండలం రాయలచెరువులోని చందన రహదారిలో ఉన్న రైల్వేగేటును శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గేటు, ట్రాక్ మరమ్మతులతో పాటు రహదారి పనులు చేపట్టడమే ఇందుకు కారణమని తెలిపారు. మార్చి 3వ తేదీ వరకు ఈ గేటు పూర్తిగా మూసి ఉంటుందని రైల్వే అధికారులు వివరించారు. స్థానికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని సూచించారు.

February 27, 2026 / 06:00 AM IST

మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్‌గా జేసీ

శ్రీకాకుళం మున్సిపాలిటీ ఇంఛార్జ్ కమిషనర్‌గా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో అతిసారం ప్రబలేందుకు బాధ్యులను చేస్తూ కమిషనరు హెచ్. కూర్మారావును బుధవారం సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.

February 27, 2026 / 06:00 AM IST

అభివృద్ధి పనులపై MLA నసీర్ ప్రత్యేక ఫోకస్

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పీఎంజేవీకే (PMJVK) పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై MLA నసీర్ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. కమ్యూనిటీ హాల్,శ్మశాన వాటికలు, సద్భావన్ మండప నిర్మాణాలపై చర్చించి, ప్రతిపాదనలను వేగంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

February 27, 2026 / 06:00 AM IST

ఆర్టీసీ ఎండీని కలిసిన రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు

ATP: సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈ-బస్సుల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూలనాగరాజు కోరారు. విజయవాడలో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బాలసుబ్రహ్మణ్యాన్ని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ రీజియన్ పరిధిలో ఆర్టీసీ అభివృద్ధి పనులపై చర్చించారు.

February 27, 2026 / 05:44 AM IST

హత్య కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్

అన్నమయ్య: గాలివీడు మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు గురువారం ఛేదించారు. భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గ పోరు కారణంగానే ఈ హత్య జరిగినట్లు SP ధీరజ్ కునిబిల్లి వెల్లడించారు. ప్రధాన నిందితుడు మహేశ్వర్ రెడ్డి నుంచి రూ. 4 లక్షల నగదు, హత్యకు వాడిన 2 కత్తులు, 7 సెల్ ఫోన్లు, కారు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.

February 27, 2026 / 05:42 AM IST

వైభవంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రారంభం

AKP: ఎలమంచిలి మండలం పెద్దపల్లిలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం దేవతామూర్తుల విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా వేద పండితులు విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

February 27, 2026 / 05:41 AM IST

‘యువత గంజాయి, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి’

కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, గురువారం రాత్రి వల్లూరు పరిధిలోని టి.జి పల్లిలో SI శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పించారు. నేరగాళ్ల బెదిరింపులకు భయపడకుండా వెంటనే 1930 లేదా 112కి కాల్ చేయాలని సూచించారు.

February 27, 2026 / 05:38 AM IST

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

NLR: ASపేటలో ఉన్న ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 2026-27 ఏడాది ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ కే. శ్రీదీప్ కోరారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ రూ. 200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 125 ఆన్ లైన్‌లో రుసుము చెల్లించి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 05:30 AM IST

స్పోర్ట్స్ మీట్‌లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రతిభ

సత్యసాయి: విజయవాడలో గురువారం రాత్రి జరిగిన ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. జావెలిన్ త్రో పోటీలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా నిలిచారు. టెన్నిస్ డబుల్స్, టికిల్ బాల్ పోటీల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి బరిలోకి దిగి విజయం సాధించారు.

February 27, 2026 / 05:30 AM IST

పేకాట శిబిరంపై దాడి. 20 మంది అరెస్ట్

కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి బాడవ గురువారం సాయంత్రం పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై చైతన్య కుమార్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి పేకాట ఆడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 32 వేల నగదు, 8 మోటార్ సైకిళ్లు, 19 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 27, 2026 / 05:30 AM IST

ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ: కలెక్టర్

KKD: మార్చి నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఈనెల 28న జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తామని కలెక్టర్ షన్మోహన్ గురువారం తెలిపారు. 2.68 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 117.02 కోట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నాడే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.

February 27, 2026 / 05:30 AM IST

కడప జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్‌గా మహేష్ బాబు

కడప ఎన్జీవో భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లా జేఏసీ ఛైర్మన్‌గా బి. శ్రీనివాసులు, సెక్రటరీ జనరల్‌గా యూటీఎఫ్ నేత పాలెం మహేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మహేష్ బాబు విమర్శించారు.పెండింగ్ సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

February 27, 2026 / 05:27 AM IST

నాలుగో రోజుకు చేరిన అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు

అన్నమయ్య: మదనపల్లెలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని వారు ఆరోపించారు.

February 27, 2026 / 05:14 AM IST

కర్నూలులో హత్య కేసులో నలుగురు అరెస్ట్

KRNL: ఖండేరి వీధికి చెందిన మనోహర్ (40) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న పాత బస్టాండ్ సమీపంలోని బార్ వద్ద జరిగిన గొడవలో తెలుగు నగేశ్, తెలుగు రాజు, ఎరుకలి రాముడు, తెలుగు ఈరన్న కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు కత్తులు స్వాధీనం చేసి రిమాండ్‌కు పంపారు.

February 27, 2026 / 05:14 AM IST