SKLM: సంతబొమ్మాలి మండలం వల్లేవలస శ్రీ చిన్మయానంద స్వామి ఆశ్రమం వద్ద ఈనెల 30న సాయంత్రం 3 గంటలకు జిల్లా స్థాయి బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలో వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు, మహిళలు), తీత సంగిడి, ఈడుపు సంగిడి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా శనివారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. పట్టణంలో ఎయిర్టెల్, ఫైబర్ నెట్వర్క్ పేరుతో రోడ్లన్నీ తవ్వి గుంతల మయం చేస్తున్నారన్నారు. తవ్విన గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తక్షణమే గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు.
KRNL: ఆలూరులో జరుగుతున్న ఏఐటీయూసీ 24వ జిల్లా మహాసభలకు కోడుమూరు మండలం నుంచి సీపీఐ, ఏఐటీయూసీ నేతలు శనివారం తరలివెళ్లారు. ఎర్రజెండాలు చేతబూని నినాదాలు చేస్తూ బయలుదేరిన కార్యకర్తలు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు, వామపక్ష నాయకులు పెద్దఎత్తున హాజరవుతున్నారని వారు తెలిపారు.
మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఎం. విజయ సునీత శనివారం కలెక్టరేట్లోని ఆమె కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
CTR: పుంగనూరులో ఈనెల 31న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరీనల్స్, మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద గల ఖాళీ స్థలలు, ఖాళీగా ఉన్న జనరల్ షాపు రూములు, ఖాళీగా ఉన్న ఐ.డీ.ఎస్.యం.టీ. షాపు రూములకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్నమయ్య జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పిలుపునిచ్చారు. పాఠశాలల వద్ద ప్రత్యేక నిఘా పెట్టి డ్రగ్స్ నెట్వర్క్పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 112 మంది అనుమానితులపై నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1972ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
CTR: చిత్తూరు జిల్లాలోని అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో శనివారం సుమారు 14 అడుగుల కింగ్ కోబ్రా ప్రత్యక్షమై భయాందోళన సృష్టించింది. భారీ విషసర్పాన్ని చూసిన స్థానికులు భయంతో దానిని హతమార్చారు. ఇటీవల అటవీప్రాంతాల్లో కింగ్ కోబ్రాలు తరచూ కనిపిస్తున్నాయని, పోడు వ్యవసాయానికి వెళ్లడానికే భయంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NTR: విజయవాడ సత్యనారాయణపురంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పునూరు గౌతమ్ రెడ్డి జెండా ఆవిష్కరించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల రక్షణ కోసం యూనియన్ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.
PLD: నరసరావుపేట కలెక్టరేట్లో ప్రముఖ కవి, పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ సూచన మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీ సంజన సింహా పాల్గొని, పుట్టపర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహితీ సేవలను, గ్రంథ రచనలను కొనియాడారు. జిల్లా అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
PPM: జిల్లాలో మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరింది. ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ విమల పాలకొండలో రైతు సంఘం నాయకుడు బుడితి అప్పలనాయుడిని శనివారం కలసి సమస్య పరిష్కారంపై చర్యలు వివరించారు.
NDL: బనగానపల్లె మండలం పసుపల గ్రామంలో ఇవాళ బండలాగుడు పోటీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి ఘనంగా ప్రారంభించారు. రైతు సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ రాజారెడ్డి పాల్గొన్నారు. అనంతరం బండలాగుడు పోటీలలో గెలుపొందిన వారికి ఆయన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
VZM: జిల్లాలో నేరాలను అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఎస్పీ దామోదర్ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 10 ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
GNTR: గ్రూప్-2 ద్వారా ఎంపికైన 10 మంది అభ్యర్థులకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం నియామక పత్రాలు అందజేశారు. విధుల్లో చేరే ముందు అభ్యర్థులు 12 రోజుల శాఖాపరమైన శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సేవల్లో క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని తెలిపారు.