సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. కాంగ్రెస్ లో ఎంఎన్ఎం విలీనం కాబోతోందంటూ ఆ పార్టీ వెబ్సైట్లో హ్యాకర్లు తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొనడం, ఈరోడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఎన్ఎం మద్దతు ప్రకటించడంతో అందరూ విలీనం నిజమేనని అనుకున్నారు. కానీ దీనిపై ఎంఎన్ఎం వివరణ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో ఎంఎన్ఎం విలీనం అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, తమ వెబ్సైట్ను ఎవరో హ్యాక్ చేశారని ఆ పార్టీ తెలిపింది. ‘‘కాంగ్రెస్ తో విలీనం అన్న వార్త పూర్తిగా అబద్ధం అని, అలాంటి ఆలోచనలు ఏమీ లేవని, కాకపోతే ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మాత్రం మద్దతిస్తున్నామని, దీనిపై తమ నేత కమల్హాసన్ త్వరలో అధికారిక ప్రకటన చేస్తారని ఎంఎన్ఎం ప్రతినిధి మురళి అబ్బాస్ మీడియాకు తెలిపారు. కాగా 2019లో లోక్ సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఎన్ఎం ఒక్క సీటు కూడా సాధించకపోవడం గమనార్హం.