MDCL: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి బొడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ మోడల్ డంపింగ్ యార్డ్ను సందర్శించారు. జోనల్ కమిషనర్లు రాధిక గుప్తా, హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజతో కలిసి వ్యర్థాల వర్గీకరణ, కంపోస్ట్ తయారీ విధానాన్ని సమీక్షించారు. తడి, పొడి వ్యర్థాలను వేరు చేసే విధానం వివరించారు.
SDPT: వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని DMHO ధనరాజ్ ఆదేశించారు. చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ పీహెచ్సీలో నిర్వహిస్తున్న ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక వైద్య శిబిరాన్ని శనివారం సందర్శించి ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. వైద్య శిబిరానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
HNK: కాజీపేట మండలం మడికొండ శివారులొ రాధిక పౌల్ట్రీ ఫారంలో పేకాట ఆడుతున్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹30,250 నగదు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు నిమిత్తం మడికొండ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
RR: ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసి వారిని సన్మానించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం ఎల్లప్పుడు మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
KMM: కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన గుంపెనపల్లి విజయలక్ష్మి మోకాలు నొప్పితో బాధపడుతుంది. ఇది తెలుసుకున్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యులకు శనివారం రూ.2.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా LOCని అందజేశారు. బాధితురాలు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎంపీ ఆకాంక్షించారు.
NLG: చిట్యాలలో ఎట్టకేలకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్న ఈ పనుల వల్ల ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ కూడలి వద్ద భారీ క్రేన్ల సహాయంతో పిల్లర్లపై నిలువు దిమ్మెలను అమర్చుతున్నారు. సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ మళ్లింపుతో దుమ్ము, రద్దీతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
RR: భూ భారతి భూ సర్వే కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండలంలోని నవలయపల్లి, అంతారం గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు తహసీల్దార్ కృష్ణయ్య తెలిపారు. నవలయపల్లిలో గ్రామసభ నిర్వహించి భూముల సరిహద్దులు, యాజమాన్య వివరాలను సర్వే చేసి డిజిటల్ రికార్డులుగా నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామస్వామి, ఆర్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.
WGL: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలోని సినెట్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9, 10 తేదీల్లో జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు సంచాలకులు డాక్టర్ బీ. దీపా జ్యోతి తెలిపారు. “Literature, Leadership and Innovation: Women Shaping Viksit Bharat – 2047” అనే అంశాల పై ప్రముఖుల ప్రసంగాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు.
MDCL: బోడుప్పల్ 10వ సర్కిల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శానిటేషన్ కార్మికులను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఈ.శ్యామ్ సుందర్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.జాహ్నవి శశాంక్ పాల్గొని నగర పరిశుభ్రతకు మహిళా కార్మికులు చేస్తున్న సేవలను అభినందించారు.
ASF: భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశాలలో చేర్చాలని జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న రథయాత్ర శనివారం ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ని కలిసి మెమోరాండం అందజేశారు. భారత రాజ్యాంగం ప్రజలకు అర్ధం కావాలంటే చదువులలో ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు.
KMR: భిక్కనూర్ (M) బాగిర్తిపల్లి ZPHSలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం, పథకం అమలులో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. శనివారం కామారెడ్డి ఆర్డీవో, భిక్కనూర్ ఎమ్మార్వో, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాఠశాలను సందర్శించి లోపాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు DEO రాజు తెలిపారు. తక్షణమే ఆ ఏజెన్సీని రద్దు చేస్తునట్లు తెలిపారు.
MBNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళలందరికీ ఎస్పీ జానకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలకు గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపిస్తూ దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆమె తెలిపారు.
BDK: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఈనెల 4న నెహ్రూ బస్తీకి చెందిన నరేష్పై నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, ఉదయ్, రాజేశ్వరరావు రోకలిబండతో దాడి చేసినట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు. హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను కొత్తగూడెం-1 టౌన్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్థలం విషయంలో గొడవ జరిగినట్లు తెలిపారు.
MHBD: ద్రోహులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని తొర్రూరు మండల కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, సాయిమల్లు, గిరిధర్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కాకిరాల హరిప్రసాద్, రామ సహాయం కిషోర్ రెడ్డిలు కారణమయ్యారని, పొంతనలేని ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని సన్మానించారు. వారి చేత కేక్ కట్ చేయించారు. సమాజంలో మహిళల ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డా. విజయ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.