JGL: పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రధాన ఆలయాల్లో ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఉగాది పంచాంగ శ్రవణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పచ్చడి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జరగబోయే వాటిపై ఆలయ పూజారులు పంచాంగాన్ని తెలియజేశారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. మిత్రులందరితో కలిసి ఉగాది పచ్చడిని సేవించారు. కార్యక్రమంలో మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 200. మే 3న ప్రవేశ పరీక్ష ఉంటుంది. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
MHBD: గూడూరు మండలం గాజులగట్టులో పండుగ పూట విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు ధారవత్ నార్య (52) గురువారం వ్యవసాయ భూమిలో మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాస్తు కాలు జారి బావిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించారు. నార్య మృతితో గాజులగట్టులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో 400 భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. ఉగాది పండుగ సందర్భంగా గురువారం పలు ప్రాంతాలను భారీగా భక్తులు ఆ దేవాలయానికి తరలి వచ్చారు. వేద పండితుల సమక్షంలో దేవాలయంలోని యజ్ఞశాలలో 400 మంది భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. హనుమాన్ జయంతి వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
GDWL: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గద్వాల ఉర్దూ భవన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరితో కలిసి విందు ఆరగించి, రంజాన్ పండుగ సోదరభావాన్ని చాటిచెప్పారు.
MDCL: మేడిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేశ్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న వేళ బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి రవి ఇతర నాయకులు పాల్గొన్నారు.
GDWL: కొత్త ఏడాది కొత్త ఆశలకు, ఆశయాలకు నాంది పలకాలి అని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలందరూ రాజ్యాంగబద్ధమైన హక్కులు, విధులను గౌరవిస్తూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరిస్తూ, సమాజంలో సౌహార్ద్ర వాతావరణాన్ని నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.
MDK: తూప్రాన్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వాహన డ్రైవర్లు, ఓనర్ల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని చలివేంద్రాన్ని మున్సిపల్ మాజీ ఛైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జైపాల్ నాయక్, నాయకులు కొక్కొండ కాశిరెడ్డి, వాహన డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.
SRD: సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి బడ్జెట్లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనేత్తాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ పాల్గొన్నారు.
NLG: చిట్యాల(మం) గుండ్రాంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎమ్మెల్యే వేముల వీరేశంలకు గురువారం బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేసి, అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు.
ADB: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, నాయకులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
JGL: కథలాపూర్ మండలం పోసానిపేట, చింతకుంట గ్రామాల్లో 30 లక్షలతో నిర్మిస్తున్న మూడు మహిళా సమైక్య సంఘం నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సమైక్య సంఘాల బలోపేతం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు.
KMM: సత్తుపల్లి మండలం రామానగరంలో పండుగ వేళ విషాదవం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం 15వ బెటాలియన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బుద్ధ శ్రీనివాసరావు (50) గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాసరావు మృతి పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
NZB: ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పురోహితుడితో పంచాంగ శ్రవణం చేయించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పల గణేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు గ్రామప్రజలు పాల్గొన్నారు.