KMM: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఈనెల 21న ఖమ్మంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరాం తెలిపారు. ముస్తఫానగర్లోని వీవీసీ డెవలప్మెంట్ సెంటర్లో టెలీకాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉండి, 18-32 ఏళ్ల వయస్సు గల వారు అర్హులని తెలిపారు.
HYD: నగరంలో ఇటీవల డిజిటల్ సేవల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు ఆన్లైన్ సేవలను విస్తరించడంతో ప్రజలకు పనులు సులభంగా పూర్తవుతున్నాయి. సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపులు, ఫిర్యాదుల నమోదు వంటి సేవలు మొబైల్ ద్వారా అందుబాటులోకి రావడంతో సమయం, ఖర్చు ఆదా అవుతోంది. ఈ మార్పులు నగర అభివృద్ధికి దోహదపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
NRML: బాసర స్టేషన్ రైల్వే పరిధిలో గోదావరి నదిపై నిర్మిస్తున్న నూతన రైల్వే బ్రిడ్జి పనులు, రైల్వేట్రాక్ ఆధునీకరణతో పాటు డబ్లింగ్ లైన్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే కమిషనర్ మాధవి, డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
KMR: తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు జిల్లా కేంద్రానికి రానున్నారు. మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొని పాత బస్టాండ్లోని ఇందిరా గాంధీ నూతన విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుందని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం 73 మంది నూతన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
BDK: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించాల్సిన కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కొత్త దశలోకి అడుగుపెట్టింది. గతంలో సుజాతనగర్ మండలంలోని గరీబ్పేట ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పరిశీలించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ప్రతికూల నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దుమ్ముగూడెం అనువైన ప్రదేశంగా గుర్తించారు.
ADB: సంక్రాంతి పండగ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ సంస్థకు రూ. 1.27 కోట్ల ఆదాయం వచ్చిందని సంస్థ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేకంగా 346 ప్రత్యేక బస్సులు నడపడంతో ఉమ్మడి జిల్లాలోని 6 డిపోల్లో ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ప్రతి ఉద్యోగికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
PDPL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. సోమవారం ఆయన పెద్దపల్లి పట్టణంలో 18,19, 20, 22, 24, 25, 30, 34, 35 వార్డులలో ఇందిర ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ ఆఫిసర్స్ క్యాలండర్, డైరీని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులంతా నూతన సంవత్సరంలో చక్కటి విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు.
NZB: చందూర్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల వరప్రసాద్ను తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాడతానని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
NZB: ఈ నెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, 22న 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) తిరుమలపూడి రవికుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు కచ్చితంగా చేరుకోవాలని, ప్రతి విద్యార్థి తప్పని సరిగా హాజరుకావాలన్నారు.
SRD: సంగారెడ్డి జిల్లాలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 21, 22 తేదీల్లో ఇంగ్లీష్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. పరీక్షలకు గైర్హాజర్ అయితే ఫెయిల్ అయినట్లు పరిగణిస్తామని పేర్కొన్నారు.
JGL: వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ప్రణాళికలను ముందస్తుగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వహించిన జిల్లా నీటి, పారిశుధ్య కమిటీ సమావేశంలో నీటి సరఫరా, నాణ్యత, ఎఫెచ్ఎసీల పురోగతి, ఆపరేషన్ పనులను సమీక్షించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించాలన్నారు.
BHNG: వలిగొండలోని ప్రధాన రహదారిపై గత కొన్ని నెలలుగా కృష్ణా నీరు వృథాగా పోతోంది. బీసీ కాలనీకి వెళ్లే దారిలో పైపులైన్ లీకేజీ వల్ల నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పెద్ద గుంట ఏర్పడింది. దీనివల్ల వాహనదారులు, కాలినడకన వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
SRD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ వెంకట రామయ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు చీరలు అందజేశారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
SRD: 2023- 24, 2024-25 సంవత్సరాలకు సంబంధించిన 356 మహిళా సంఘాలకు 1.05 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ విడుదలైనట్లు మున్సిపల్ కమిషనర్ శివాజీ మంగళవారం తెలిపారు. వడ్డీ రాయితీని నేరుగా మహిళా సంఘాల ఖాతాలు జమ చేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులు వినియోగించుకోవాలని కోరారు.