ఈ సీజన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఓటమి లేకుండా దూసుకుపోతోంది. ఈ టోర్నీలో భాగంగా ఈనెల 25న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆ జట్టు తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్కు కీలక ప్లేయర్ కూపర్ కనోలీ దూరమయ్యే అవకాశం ఉంది. ఫిట్నెస్ పరీక్షల కోసం అతడు ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది పంజాబ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
ఐపీఎల్లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో, రాజస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. IPL చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా.. రాజస్థాన్ 4, లక్నో 2 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఇవాళ మ్యాచ్ జరుగుతున్న లక్నోలోని ఏకనా స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగ్గా, అందులో కూడా రాజస్థానే గెలిచింది. కాగా, ఈ స్టేడియంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 173 పరుగులుగా ఉంది.
SRH యువ పేసర్ సాకిబ్ హుస్సేన్ తన అద్భుత బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ సీజన్లో 3 మ్యాచ్ల్లో 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మొత్తంగా 72 బంతులు (12 ఓవర్లు) వేసిన సాకిబ్, 85 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ 72 బంతుల్లో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, అతడు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ SRH గెలిచింది.
పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఒక మెట్టు ముందున్నాడని వ్యాఖ్యానించాడు. అతడిలో అద్భుతమైన ప్రతిభతో పాటు పెద్ద ఇన్నింగ్స్లు ఆడే సామర్థ్యం కూడా ఉందని కొనియాడాడు. కాగా, ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో ఈ యువ ఆటగాడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
పాక్ క్రికెటర్ మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా తేలాడు. ఈ ఘటనపై PCB తీవ్రంగా స్పందిస్తూ.. నవాజ్ సెంట్రల్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు బోర్డు తెలిపింది. ఒకవేళ నవాజ్ నేరం రుజువైతే, అతడిపై శాశ్వత నిషేధం విధించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల ముగిసిన T20 WCలో అతడు నిషేధిత డ్రగ్స్ వాడినట్లు నిరూపితమైంది.
భారత్, దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య ఈరోజు రాత్రి 9:30 గంటలకు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్.. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ రేసులో నిలుస్తుంది. దీంతో గెలుపే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు, ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది.
MS ధోనీపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ప్రశంసల వర్షం కురిపించారు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ధోనీ ఎంతో కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘గౌరవ హోదాలో కేటాయించిన పదవులకు కఠిన శిక్షణ తప్పనిసరి కాదు. అయినప్పటికీ, ధోనీ స్వయంగా ముందుకొచ్చి ఆ కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశాడు. అతడు సిసలైన సైనికుడిగా వ్యవహరించాడు’ అని భాటియా కొనియాడారు.
SRH కెప్టెన్గా ఇషాన్ కిషన్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అయితే, రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో, కెప్టెన్గా కిషన్నే కొనసాగిస్తే బాగుంటుందని మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. జట్టులోని ఆటగాళ్ల బలబలాలపై కిషన్కు పూర్తి అవగాహన ఉందని, ఈ సమయంలో కెప్టెన్సీ మార్పు సరైన నిర్ణయం కాబోదని తెలిపాడు.
SRHతో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. ‘కీలక సమయంలో క్యాచ్లను వదిలేయడం, రనౌట్ చేసే అవకాశాన్ని వదులుకోవడం మ్యాచ్లో వెనకబడిపోయాం. ఇక్కడ మా బౌలర్ల తప్పేమీలేదు. వారు బాగానే బౌలింగ్ వేశారు. కానీ, ప్రత్యర్థి బ్యాటర్లు ఆ స్థాయిలో ఆడితే ఎవరేం చేయలేరు. ఫీల్డింగ్లో బాగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది’ అనితెలిపాడు.
ఐపీఎల్ చరిత్రలో SRH జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. వరుసగా ఏడు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. కాగా, IPL-2026 సీజన్లో SRH తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ వరుసగా ఏడు మ్యాచుల్లో టాస్ ఓడి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ, SRH ఈ ఏడు మ్యాచ్ల్లో నాలుగింట్లో విజయం సాధించింది.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో విజయం అనంతరం SRH స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన తండ్రి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నేను అండర్-12లో ఉన్నప్పటి నుంచి మా నాన్న కూర్చుని నాకు ఎలా ఆడాలో చెబుతూనే ఉన్నారు. ఆయన ఎప్పుడూ స్టాండ్స్లోంచి నన్ను చూస్తుండటం, నేను ఆయనను చూస్తుండటం, ఆయన నాకు సూచనలు ఇవ్వడం నిజంగా అద్భుతం’ అని అన్నాడు.
తమ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతోనే తన సెంచరీని ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నానని SRH విధ్వంసకరం బ్యాటర్ అభిషేక్ శర్మ తెలిపాడు. ’20వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయాలని మా కోచ్ కోరుకున్నాడు. బహుశా నేను 20వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే ఆ సెలబ్రేషన్. ఈ గ్రౌండ్లో సెంచరీ చేయడం ఎప్పుడూ స్పెషలే’ అని చెప్పుకొచ్చాడు.
IPL 2026 సీజన్లో ఇప్పటి వరకు నలుగురు ప్లేయర్లు సెంచరీలతో అదరగొట్టగా.. వారంతా నాటౌట్గా నిలవడం విశేషం. ముంబై బ్యాటర్లు క్వింటన్ డికాక్ (112*), తిలక్ వర్మ (101*), చెన్నై స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్(115*), SRH విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ (135*) పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ సీజన్లో అభిషేక్ అత్యధిక పరుగులు(135*) చేయడంతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన చేస్తుంది. సఫారీ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్న షఫాలీ ఐసీసీ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి… ఆరో ర్యాంక్కు చేరింది. కాగా, డర్బన్ వేదికగా జరిగిన రెండో టీ20లో షఫాలీ 38 బంతుల్లోనే 57 పరుగులు చేయడంతో ఈ ఫీట్ సాధించింది.
IPL 2026: ఉప్పల్ మ్యాచ్లో ఢిల్లీపై హైదరాబాద్ 40 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత SRH 242/2 స్కోర్ చేయగా.. లక్ష్యఛేదనలో ఢిల్లీ 195/9కే పరిమితమైంది. DC బ్యాటర్లలో KL రాహుల్(37), నితీష్ రాణా(57), సమీర్ రిజ్వీ(41) రాణించారు. అటు SRH బౌలర్లలో ఈషన్ మలింగ 4, హర్ష్ దూబే 3, సాకిబ్ హుసేన్, మధుషంక చెరో వికెట్ పడగొట్టారు. సొంత మైదానంలో SRHకు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం.