IPLలో అదరగొట్టిన 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై IIM ఇండోర్ ప్రత్యేక అధ్యయనం నిర్వహించనుంది. చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధించే బాల మేధావులపై ఖ్యాతి, ఒత్తిడి ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఈ పరిశోధన సాగనుంది. వారి ప్రాక్టీస్, మనస్తత్వం, కోచ్లు, తల్లిదండ్రుల సహకారం వంటి విషయాలను పరిశీలిస్తామని IIM డైరెక్టర్ హిమాంశు రాయ్ తెలిపారు.
IPLలో అత్యధిక పరుగులతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. అతను వచ్చే వేలంలోకి వస్తే రూ.20 కోట్లు పలుకుతాడని అంచనా. గతంలో కాంప్లాన్, రెడ్బుల్ బ్రాండ్లకు రూ.కోటి చొప్పున తీసుకున్న వైభవ్, ఇప్పుడు ఒక్కో ఎండార్స్మెంట్కు రూ.1.5-2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం అతని తండ్రే ఈ డీల్స్ చూస్తున్నారు.
ఆఫ్ఘానిస్థాన్తో జరగబోయే టీ20 సిరీస్తో శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో కెప్టెన్గా శ్రేయస్ వ్యవహరించే అవకాశం ఉండగా.. ఇషాన్ కిషన్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
అఫ్ఘానిస్థాన్తో టెస్టు సిరీస్కు జమ్మూకాశ్మీర్ స్పీడ్స్టార్ ఆకిబ్ నబీకి చోటు దక్కకపోవడంతో బీసీసీఐపై విమర్శల వర్షం కురిసింది. దీంతో ఈ విమర్శలకు తలొగ్గిన బీసీసీఐ.. ప్రస్తుతానికి అతడిని ఈ సిరీస్కు నెట్ బౌలర్గా ఎంపిక చేసింది. అయితే, సిరాజ్కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో నబీకి ప్రధాన జట్టులో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇండోనేషియా ఓపెన్-2026 తొలి రోజున భారత బృందం మిశ్రమ ఫలితాలను చవిచూసింది. థాయ్లాండ్ ప్లేయర్ బుసనన్తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్లో సింధు.. 25-23, 21-16 తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్కు చేరుకుంది. అయితే, పురుషుల సింగిల్స్లో ఇండోనేషియా ప్లేయర్ అల్వి ఫర్హాన్ చేతిలో 19-21, 16-21 తేడాతో ఓడిపోయిన లక్ష్యసేన్.. టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
FIFA ప్రపంచకప్ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 48 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై ప్రముఖ అనలిటిక్స్ సంస్థ ‘ఆప్టా’ తన సూపర్ కంప్యూటర్ ద్వారా విశ్లేషణ జరిపింది. ఈసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు అత్యధికంగా స్పెయిన్ జట్టుకే ఉన్నట్లు పేర్కొంది.
SRH మాజీ స్పీడ్స్టార్ సిద్ధార్థ్ కౌల్ ప్రస్తుతం చండీగఢ్లోని SBI బ్రాంచ్లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. సాధారణంగా IPL ఆడిన క్రికెటర్లు లగ్జరీ లైఫ్ గడుపుతుంటే, సిద్ధార్థ్ ఇలా బ్యాంక్ ఉద్యోగిగా సాధారణ జీవితం గడపడం అందరినీ ఆకట్టుకుంటోంది. క్రీడా కోటా కింద అతడు ఈ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియాపై పాక్ బౌలర్లు రెండో వన్డేలోనూ చెలరేగారు. తొలి వన్డేలో ఆసీస్ను 200 పరుగులకే ఆలౌట్ చేసి గెలిచిన పాక్, రెండో వన్డేలోనూ ఆసీస్ను 231/9 పరుగులకే పరిమితం చేసింది. PAK బౌలర్లలో అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా.. హారిస్ రౌఫ్, మిన్హాస్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు. ఇంగ్లిస్(51), గ్రీన్(53), రెన్షా(43) మినహా మిగతా బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.
IPLలోని పలు ఫ్రాంఛైజీల తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని పూర్తిగా పరిశీలించకుండానే, లోకల్ టోర్నీల్లో రాణించిన ప్లేయర్లపై కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నాయని విమర్శించాడు. వారంతా కేవలం ‘వన్ మ్యాచ్ వండర్స్’గా మిగిలిపోతారని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల పూర్తి సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాతే కొనుగోలు చేయాలన్నాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ.. కాంప్లాన్, గూగుల్ పే, బీహార్ ఆరోగ్య శాఖ, Sareen Sports సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. సూర్యవంశీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడిని తమ ప్రచారకర్తగా నియమించుకోవడం కోసం ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయి.
భారత్-ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈనెల 6 నుంచి ప్రారంభం కానుంది. న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తాజాగా, ఈ మ్యాచ్ టికెట్ల ధరలను PCA ప్రకటించింది. టికెట్ ధర రూ. 250 నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 10,000 వరకు ఉండనుంది. అయితే, ఈ మ్యాచ్ టికెట్ ఐదు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
IPL ఫైనల్ను బెంగళూరు నుంచి తరలించడం అన్యాయమంటూ కర్ణాటక డిప్యూటీ CM శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. IPL ఫైనల్ను తరలించడానికి ప్రధాన కారణం చిన్నస్వామి స్టేడియం సీటింగ్ కెపాసిటీ తక్కువగా ఉండటమేనని చెప్పారు. అందుకే లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్ స్టేడియానికి తరలించినట్లు స్పష్టం చేశారు.
టీమిండియా కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులేను ఎంపిక చేసినట్లుగా BCCI ప్రకటించింది. 53 ఏళ్ల సాయిరాజ్ ప్రస్తుత IPL సీజన్లో PBKSకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. గతంలో భారత్-A, RR, కేరళ, బెంగాల్, గుజరాత్ జట్లకు కోచ్గా పనిచేశాడు. కాగా, హెడ్ కోచ్గా గంభీర్, సహాయ కోచ్గా టెన్ డస్కేటే, బౌలింగ్ కోచ్గా మోర్కెల్ వ్యవహరిస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన ఆటగాళ్ల జాబితాలోకి కృనాల్ పాండ్యా చేరాడు. IPL-2026 సీజన్తో కలిపి కృనాల్ తన కెరీర్లో మొత్తంగా 5వ ఐపీఎల్ ట్రోఫీని గెలిచాడు. దీంతో ధోనీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, పొలార్డ్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, అంబటి రాయుడు చెరో 6 టైటిల్స్తో టాప్లో ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో RCB సరికొత్త చరిత్ర సృష్టించింది. మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇన్స్టాగ్రామ్లో 25 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటిన మొదటి IPL జట్టుగా RCB రికార్డులకెక్కింది. కోహ్లీ, RCBకి ఉన్న ఫ్యాన్ బేస్ వల్లే ఇది సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. IPL-2026 విజేతగా నిలిచిన తర్వాత RCB క్రేజ్ SMలో మరింత పెరిగింది.