భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, తాము భారత్లో ఆడబోమని, తమ మ్యాచ్లను మరో చోటుకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. తాజాగా దీనిపై బీసీబీ స్పందించింది. తన ప్రతిపాదనలు ICCకి అందాయని చెప్తోంది. BCBతో కలిసి పనిచేసేందుకు ICC సానుకూలంగా స్పందించిందని బంగ్లా క్రికెట్ బోర్డ్ తెలిపింది.
ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్కు (BPL) ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్న భారత్కు చెందిన రిధిమా పాఠక్ హోస్టింగ్ ప్యానల్ నుంచి తప్పుకుంది. అయితే, ప్యానల్ నుంచి తనను ఎవరూ తొలగించలేదని, తానే స్వచ్ఛందంగా తప్పుకున్నానని రిధిమా పాఠక్ SMలో వెల్లడించింది.
యాషెస్ సిరీస్ చివరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ అద్భుత శతకం చేసి.. 142 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 119 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్తో అర్జున్కు ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. తాజాగా, వీరి వివాహ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. మార్చి 5న ముంబైలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 600కు పైగా పరుగులు సాధించాడు. అయినప్పటికీ, అతడికి భారత జట్టులో చోటు దక్కడం లేదు. దీనిపై పడిక్కల్ స్పందిస్తూ.. జట్టులో చోటు దక్కకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. అయితే, ప్రస్తుతం టీమిండియాలో చోటు సంపాదించడం అంత సులభం కాదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో చోటు దక్కాలంటే ముంబై, ఢిల్లీ లేదా పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలని అతడు అన్నాడు. జట్టులో ఆ రాష్ట్రాల ఆటగాళ్లకు మాత్రమే సుస్థిర స్థానం ఉంటుందని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుతం భారత జట్టులో సగానికి పైగా ఆటగాళ్లు ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం గమనార్హం.
మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ను ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు మెంటార్గా నియమించనున్నట్లు ACA అధ్యక్షుడు కేశినేని శివనాథ్ అధికారికంగా ప్రకటించారు. క్రికెట్లో ఆమెకు ఉన్న సుదీర్ఘ అనుభవం ఆంధ్ర జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవలే విశాఖ స్టేడియంలోని ఒక స్టాండ్కు మిథాలీ రాజ్ పేరు పెట్టిన విషయం తెలిసిందే.
యాషెస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 384 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 567 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ధాటిగా బదులిస్తోంది. యువ సంచలనం జాకబ్ బెథెల్ సెంచరీ పూర్తి చేసుకుని 106 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ENG 219/4 పరుగులు చేసి, 36 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత్ పర్యటనకు ముందే న్యూజిలాండ్ తన టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. సారథిగా మిచెల్ శాంట్నర్ జట్టును నడిపించనున్నాడు. జట్టులో అలెన్, బ్రేస్వెల్, చాప్మన్, కాన్వే, జాకబ్ డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిచెల్, ఆడమ్ మిల్నే, నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫెర్ట్, ఇష్ సోధి సభ్యులుగా ఉన్నారు, అలాగే జెమీసన్ను ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపిక చేశారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 567 పరుగులకు ఆలౌటైంది. దీంతో 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించింది. స్మిత్(138), హెడ్(163) సెంచరీలు చేయగా, వెబ్స్టార్ 71* పరుగులతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 4 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 33/1.
మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ తొలి రౌండ్లో ముందంజ వేశాడు. సింగపూర్కు చెందిన జియా హోంగ్ జాసన్ టెహ్పై 21-16, 15-21, 21-14 తేడాతో అద్భుత విజయం సాధించాడు. మరో మ్యాచ్లో ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ఒలింపిక్ కాంస్య పతక విజేత లీ జి జియాకు షాకిస్తూ.. 21-12, 21-17 తేడాతో విజయం సాధించాడు.
అంధుల క్రికెట్లో భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టును రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఘనంగా సత్కరించారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫౌండేషన్ తరపున ఆ టీమ్కు నీతా అంబానీ రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, సచిన్, రోహిత్ శర్మ పాల్గొన్నారు.
కివీస్తో వన్డే, టీ20 సిరీస్లలో గిల్, సూర్యకుమార్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. గిల్ మరో 225 పరుగులు చేస్తే సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ అమ్లా రికార్డు గల్లంతవుతుంది. 57 ఇన్సింగ్స్లో హషీమ్ 3000 పరుగులు చేశాడు. గిల్ ఆ పరుగులు చేస్తే వేగవంతమైన భారత బ్యాటర్ అవుతాడు. అలాగే, సూర్యకుమార్ 246 రన్స్ చేస్తే టీ20ల్లో 3000 పరుగులు చేసిన వారి జాబితాలో చేరతాడు.
1983 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ 67 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ.270 కోట్లు ఉంటుందని అంచనా. ఓ నివేదిక ప్రకారం కపిల్ దేవ్ ఏటా రూ.12 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన సంపదలో బ్రాండ్ ఎండార్స్మెంట్లు, బహిరంగ ప్రదర్శనలు, క్రీడలకు సంబంధించిన పెట్టుబడులతో పాటు కపిల్ దేవ్స్ ఎలెవెన్ అనే రెస్టారెంట్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూప్ విజేతగా బీహార్ నిలించింది. మణిపూర్తో జరిగిన ఫైనల్లో బీహార్ 6 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 47.5 ఓవర్లలో 169 పరుగులకే చతికిలపడింది. షబీర్ ఖాన్ 7 వికెట్లు తీసి మణిపూర్ పతనాన్ని శాసించాడు. అనంతరం బరిలోకి దిగిన బీహార్ కేవలం 31.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.