SRPT: అర్వపల్లి మండల పరిధిలోని సాగు భూములకు వారబందీ విధానంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చివరి విడత గోదావరి జలాలను విడుదల చేశారు. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం 5 తడుల నీటిని విజయవంతంగా పంపిణీ చేసిన జలవనరుల శాఖ, తాజాగా 6వ తడి కింద సుమారు 1,333 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదిలింది. వారబందీ పద్ధతిలో భాగంగా ఈ నీటి సరఫరా మరో వారం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది.
WNP: ఆత్మకూరు పట్టణంలో పెట్రోల్ కొరత ఒక్కసారిగా తలెత్తింది. శుక్రవారం సాయంత్రం నుంచి అనేక పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధనం కోసం కిలోమీటర్ల దూరం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
PLD: మార్కాపురం బస్సు ప్రమాదం నేపథ్యంలో పిడుగురాళ్ల-హైదరాబాద్ రహదారిపై రవాణా శాఖ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. డీటీవో సంజీవరావు, ఆర్టీవో కృష్ణ ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా బస్సుల్లో ‘ఎమర్జెన్సీ ఎగ్జిట్’ సౌకర్యంపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై వలితో సిబ్బంది పాల్గొన్నారు.
WGL: గీసుగొండ(M) మొగిలిచెర్ల గ్రామ శివారులోని SRSP కెనాల్ కాలువలో నిన్న ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ మృతదేహం 3 రోజులుగా కనిపించకుండా పోయిన శాయంపేట (M) గట్లకానిపర్తి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ పూజారి విజయ్ కుమార్ గౌడ్ (45)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG: రాష్ట్ర బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కు రూ.10 వేల కోట్లు కేటాయించాలని బీసీ JAC ఛైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్రెడ్డిని కోరారు. బీసీ కులవృత్తుల వారికి రూ.10 లక్షల సబ్సిడీ రుణం అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 13 ఏళ్లలో ఒక్క బీసీ కుటుంబానికి కూడా సబ్సిడీ రుణం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ASR: కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో బంగారమ్మ, మరిడిమాంబ అమ్మవార్ల జాతర శనివారం జరగనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్లబళ్ల పరుగు, కోలాటం పోటీలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల ఈ విషయాన్ని గమనించి అమ్మవార్లను దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు.
KKD: గండేపల్లి మండలం సూరంపాలెంలో విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. లోన్ యాప్లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) ఆదిత్య యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అప్పు ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపానికి గురై తన గదిలో ఉరేసుకున్నాడు.
TPT: వాకాడు (M) గొల్లపాలెంలో ఎస్సై నిఖిల్ కుమార్ నిన్న రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిన్న రాత్రిపూట అక్కడే బస చేసి నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలిస్తూ, ప్రజలకు పారదర్శకమైన పాలనపై భరోసా కల్పించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల చెంతకు చేరేందుకే ఈ కార్యక్రమమని తెలిపారు.
IPLలో సుదీర్ఘంగా బ్రేక్ కాని రికార్డుల్లో షేన్ వార్న్(RR) ‘2008లో 13 విజయాల’ రికార్డు ఒకటి. కెప్టెన్గా ఓ సీజన్లో అత్యధికంగా అందుకున్న విజయాల్లో ఇదే అత్యధికం. ఆపై ధోనీ(2017-CSK), జార్జ్ బెయిలీ(2014-PBKS), రోహిత్(2017-MI) తలో 12 విజయాలు సాధించారు. ఇక IPL 2026లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లిన జట్లు 16/17 మ్యాచులు ఆడతాయి. మరి వార్న్ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో చూడాలి.
ADB: కెరమెరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెర్ల నాగప్ప అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ శుక్రవారం రాత్రి వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నాగప్ప పార్టీకి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
నిర్మల్ జిల్లాలో రేపు FLNAT/NIOS పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అభ్యాసకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని, SERP సిబ్బంది వద్ద నమోదు చేసుకుని పరీక్ష రాయాలని సూచించారు. పరీక్షకు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.
కోనసీమ: కపీలేశ్వరపురం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాతపూడి గ్రామ అధ్యక్షులు భూల వీరబాబు ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగుదేశంకు చెందిన 25 మంది బీసీ కార్యకర్తలు మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ కండువాలు వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో శనివారం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుక కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలు, కాషాయ తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం 11:00 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.
లడఖ్లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతిచెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ‘X’ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో కళాకారులు సందడి చేశారు. పాండు చెరువు కట్ట కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం నుంచి శుక్రవారం రాత్రి సీతారాముల శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రత్యేక కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.