NZB: గిరిరాజ్ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జి, కెరీర్ గైడెన్స్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. టెక్ మహీంద్రా, మత్తూట్, జస్ట్ డైల్, టాటాఏఐజీ, మొదలైన కంపెనీలు ఇందులో పాల్గొంటాయన్నారు. ఆసక్తి గల యువత జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.
CTR: జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని JC ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు, సందేహాలు ఉంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 08572-242734 నంబర్కు ఫోన్ చేయాలన్నారు.
E.G: హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూడా ఛైర్మన్, తూర్పుగోదావరి జిల్లా TDP అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆయనను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
కోనసీమ: 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం సోమవారం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరవచ్చ అని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సుల సమయాలలో మార్పులు చేశామన్నారు.
ADB: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీ నిధుల ద్వారా చెల్లించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2వ తేదీన ఇచ్చిన సర్క్యులర్ను రద్దు చేయాలన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణం కాపువాడలో లబ్ధిదారుడు తిరుపతి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి MLC విఠల్ ఆదివారం హాజరయ్యారు. నూతన దంపతులకు బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, వారికి ఆత్మగౌరవంతో కూడిన నివాసాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.
AP: హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి A2 సునీల్ యాదవ్ వెళ్లినట్లు అతని తల్లే చెప్పినప్పుడు దర్యాప్తు చేయాలి కదా? అని YS సునీత ప్రశ్నించారు. ‘కాదు ఆ రోజు అన్న సునీల్ ఇంట్లోనే ఉన్నాడు, అమ్మపై ఒత్తిడి తెచ్చి అలా చెప్పించారు’ అని కిరణ్ యాదవ్ చెబుతున్నాడని.. ఈ పరస్పర విరుద్ధ వాంగ్మూలను పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరిని రక్షించేందుకు CBI ప్రయత్నాలు అంటూ నిలదీశార.
AKP: ఎస్.రాయవరం మండలంలో ‘అక్షరాంధ్ర పరీక్ష’ ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. మండలంలో 93 కేంద్రాల్లో 4,000 మంది పరీక్ష రాస్తున్నట్లు ఉపాధి హామీ పథకం ఏపీడీ ఎరకయ్య తెలిపారు. 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష రాసే అబ్యాసకులకు అవసరమైన సౌకర్యాలను పరీక్ష కేంద్రాల్లో కల్పించమన్నారు. అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.
HYD: ముషీరాబాద్ భోలక్పూర్లోని అంజుమన్ గర్ల్స్ హై స్కూల్లో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో BRS ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. నగరంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి, బస్తీ దవఖాన వంటివి కూడా అమలు చేయలేకపోతున్నాయని విమర్శించారు.
NDL: ప్రభుత్వం ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమాలతో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తుండగా, కిందిస్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాగలమర్రి మండలం ముత్యాలపాడులో గ్రామపంచాయతీకి చెత్త తరలించేందుకు మంజూరైన చెత్త బండ్లు వినియోగం లేక చెత్తలోనే కూరుకుపోయాయి. దీంతో అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
MHBD: మరిపెడ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ 11, 13వ వార్డులలో ఛైర్ పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తూ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
MHBD: గాలివారిగూడెంలోని ANR గార్డెన్ వద్ద మూడు రోజుల క్రితం జరిగిన బైక్ చోరీ కేసును SI వీరభద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు చేదించారు. పోలీసుల తనిఖీలు చేపట్టగా.. కార్గిల్ సెంటర్ వద్ద నిందితులు గోపీచంద్, మనోజ్ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 బైకులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
NTR: చంద్రబాబుపై రాళ్లదాడి కేసులో నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2022లో చందర్లపాడు రోడ్షోలో రాళ్లదాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన నలుగురికి మంజూరైన బెయిల్ను కోర్టు రద్దు చేసింది. అప్పట్లో పోలీసులు నిందితులను నందిగామ కోర్టులో హాజరుపర్చగా బెయిల్ మంజూరైంది. అయితే వెంటనే బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించి బెయిల్ రద్దు చేసింది.
WGL: జిల్లాలో విషాదం నెలకొంది. నర్సంపేట పట్టణంలోని శశి ఆసుపత్రి వైద్యుడు డా.శశిధర్ రెడ్డి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించి ఉండవచ్చని తోటి వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు, సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి సంబంధించి కారణాలపై స్పష్టత లేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
PDPL: రామగుండం 50వ డివిజన్ అశోక్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం అన్నప్రాసన, అక్షరాభ్యాస వేడుకలు జరిగాయి. 50వ డివిజన్ కార్పొరేటర్ ధూళికట్ట సతీష్, 59వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని తిరుపతి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించి, అక్షరాభ్యాసం ప్రారంభించిన సతీష్ మాట్లాడుతూ.. బాల్యంలోనే మంచి ఆహారం, అందుతుందన్నారు.