ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ వేడికి సతమతమవుతున్న ప్రజలు ఈ చల్లదనంతో ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
KMR: జుక్కల్ MLA లక్ష్మీకాంతారావుకు AICC కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్రలో DCC అధ్యక్షుల ఎంపిక కోసం ఆయనను పరిశీలకుడిగా నియమించింది. ‘సంఘటన్ సృజన్ అభియాన్’లో భాగంగా ఈ నియామకం జరిగింది. MLA మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, AICC అధ్యక్షుడు ఖర్గే, PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లకు ధన్యవాదాలు తెలిపారు.
JN: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. కొడకండ్ల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని, పాలకుర్తి నియోజకవర్గంలో వైద్యరంగ బలోపేతానికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. వైద్యరంగ బలోపేతానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు.
WGL: నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ సేవలు సరిగా అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రక్తం, మూత్ర పరీక్షలు తదితర సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బంధువులు తెలిపారు. దీంతో వైద్య అధికారులు స్పందించి ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు న్యాయం చేయాలని కోరారు.
WGL: రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని WGL CP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇవాళ WGL కమిషనర్ కార్యాలయంలో CP మాట్లాడుతూ.. వర్షాల సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.
NRML: దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో ఎంపీఓ గోవర్ధన్ గ్రామపంచాయతీ పనులను తనిఖీ చేశారు. పారిశుధ్యం, తాగునీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది పనితీరుపై సూచనలు చేస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.
BHPL: BCలను అవమానిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని BHPL BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తొలగించి జగ్గారెడ్డికి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి మాట్లాడటం బీసీల పట్ల వ్యతిరేకతను చూపుతుందన్నారు.
KMM: భారతదేశపు తొలి సంపాదకులు, విలేకరుల చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఘనంగా బుధవారం నిర్వహించారు. టిడబ్ల్యూజెఎఫ్ (హెచ్ 2843) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటాలను ఆవిష్కరించారు.
KMM: కామేపల్లి మండలం కొత్త లింగాలలోని శ్రీ కోట మైసమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని రేపు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభిస్తారని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. వారితోపాటు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ & రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు.
RR: గేటెడ్ కమ్యూనిటీల్లో అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత బిల్డర్ దేనని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ డివిజన్ ప్యాబ్ సిటీలోని విశాల్ సంజీవని విల్లాస్లో ఆయన ఇవాళ పర్యటించారు. కాలనీవాసులు పలు సమస్యలు కేఎల్ఆర్ దృష్టికి తీసుకువచ్చారు. విల్లాస్లో జరిగే పనులను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.
MHBD: పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గ్రామానికి చెందిన BRS ముఖ్య నాయకులు సమూహంగా ఆ పార్టీకి రాజీనామా నేడు కాంగ్రెస్లో చేరారు. TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని ఆమె పార్టీలో చేరిన వారికి తెలిపారు.
HNK: బడ్జెట్లో విద్యాశాఖకు 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ వరంగల్ విభాగ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్ అన్నారు. బాలసముద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యార్థి, నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
NZB: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న మురికి కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయాడు. మృతుడి జేబులో రూ.4000 నగదు లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు.
JGL: సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయులకు విధులు కేటాయించాలని టీఆర్టీఎఫ్ నాయకులు రాయికల్ తహశీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇంతకు పూర్వం జరిగిన ఎన్నికల విధుల్లో కొంతమంది ఉపాధ్యాయులకు మూడు దశల్లో డ్యూటీలు పడగా, కొందరికి అసలే పడలేదని పేర్కొన్నారు. జనగణన విధులు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
MNCL: రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హెచ్చరించారు. రైతుబంధును చెల్లించాలని కోరుతూ.. బుధవారం లక్షెట్టిపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు పోస్ట్ కార్డులలో రాసి ప్రభుత్వానికి పంపారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి సహాయంగా అమలు చేసిన రైతుబంధు డబ్బులు చెల్లించాలన్నారు.