NGKL: సలేశ్వరం జాతరకు వెళ్లే భక్తులు అటవీ నిబంధనలు పాటించాలని లింగాల ఎస్సై వెంకటేష్ గౌడ్ సూచించారు. లింగాల నుంచి అప్పాయిపల్లి వరకు బస్సులు, అక్కడి నుంచి గిరిజగుండం వరకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భక్తులు వెంట తాగునీరు తీసుకెళ్లాలని, అడవిలో చెత్త వేయకూడదని కోరారు.
BHPL: టేకుమట్ల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అమూల్యను MRPS-TS జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య, నేతలు కలిశారు. టేకుమట్ల మండలానికి సంబంధించి పలు అంశాలపై నూతన ఎస్సైతో వారు చర్చించారు. రాష్ట్ర కార్యదర్శి తిరుపతి, టేకుమట్ల మండల అధ్యక్షుడు రాము, రమేష్, తదితరులు ఉన్నారు.
ATP: గుంతకల్లులోని కసాపురం రోడ్డులో గురువారం సొసైటీ బ్యాంకు ఛైర్మన్ తలారి మస్తానప్ప ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ..వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన దాతలను వారు అభినందించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలన్నారు.
కామారెడ్డి: బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామ పంచాయతీని డివిజన్ పంచాయతీ అధికారి సందర్శించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కంపోస్ట్ షెడ్ను సందర్శించి, ఎరువు తయారీ ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసిన ఆయన, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కార్యదర్శిని ఆదేశించారు.
AP: రాష్ట్రంలో పదో తరగతి పేపర్ల వాల్యుయేషన్ ఏప్రిల్ 4 నుండి 13 వరకు జరగనుంది. పారదర్శకత కోసం CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈసారి ట్యాబ్ల ద్వారా మార్కులను ఎప్పటికప్పుడు నమోదు చేసే కొత్త విధానాన్ని తెచ్చారు. ఏప్రిల్ మూడో వారంలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వాల్యుయేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అమరజీవి బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతి వేడుకలు ఇవాళ హుజూర్నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీత పనివారల సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కొనకల మెట్ల మండలం పెదారికట్ట గ్రామానికి చెందిన అంబటి అనిల్, అతని 5 నెలల కుమారుడు బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. స్వగ్రామమైన పెదారికట్టకు తన కుమారుడికి బారసాల చేసేందుకు వస్తుండగా బస్సులో అగ్నికి ఆహుతి అయ్యాడని అనిల్, చిన్నారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
MHBD: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కురవి వీరభద్రస్వామి ఆలయ పురోహితులు పెనుగొండ నాగేందర్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయంలోని పురోహిత సమస్యపై ఆయన మంత్రికి వివరించారు. ఈ విషయమై ఆలయ ఈవోతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
MDCL: మేడ్చల్ వంతెన నిర్మాణ పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. నెలలుగా పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు సరిపోక వాహనదారులు గంటల పాటు నిలిచిపోతున్నారు. స్థానికులు పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుని వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.
PLD: శ్రీరామనవమి పురస్కరించుకుని నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లకు రంగం సిద్ధమైంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, భారీ విద్యుత్ ప్రభలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రేపు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరగనున్నాయి. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ అన్ని మౌలిక వసతులు కల్పించింది.
MHBD: గూడూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ST కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చు నాయక్ ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కేసముద్రం మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
MNCL: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మండల కేంద్రం, లంబడితండ (కె) గ్రామాల్లో పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం పల్లె దవాఖానను సందర్శించి వార్డులు, మందుల నిల్వలను తనిఖీ చేసి, పనులు వేగవంతం చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
SDPT: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని AIYF మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి అమలు చేయక నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు. చలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా కార్యకర్తల అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఖండించారు.
బాపట్ల పట్టణంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగును వెంటనే తొలగించాలని కమిషనర్ రఘునాథరెడ్డి సూచించారు. గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. అంబేద్కర్ భవన్ రోడ్డులో పేరుకుపోయిన మురుగుపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ప్రవాహం ఎప్పుడూ నిరాటంకంగా ఉండేలా సిబ్బందికి సూచించారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు కొరియన్ బాంబూ సాల్ట్. దీని కిలో ధర సుమారు రూ.35,000పైగా ఉంటుందట. సముద్రపు ఉప్పును వెదురు గొట్టాల్లో నింపి, దేవదారు కట్టెలతో తొమ్మిది సార్లు, దాదాపు 50 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చి దీనిని తయారు చేస్తారు. ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ ఉప్పును ఔషధ గుణాల కోసం వైద్యంలో, ప్రత్యేక రుచి కోసం వంటల్లో వాడుతుంటారు.