NDL: ఆత్మకూరులో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
W.G: అత్తిలిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు తణుకు CI డి.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం అందిన ఫిర్యాదుతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3 వేల నగదు, ల్యాప్టాప్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
W.G: నిషేధిత భూముల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రామ సభ నిర్వహించినట్లు VRO చిన్నారావు తెలిపారు. ఉండి మండలం మహాదేపట్నం గ్రామంలో సోమవారం గ్రామ సభ జరిగింది. కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, SR డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయికి సింగరాయకొండ చెందిన దంపూరి పుష్వాంత్ కుమార్ 234 గ్రాముల వెండి పట్టీలు బహుకరించారు. సోమవారం వాటిని ఆలయ నిర్వాహకులకు కుటుంబ సమేతంగా వచ్చి అందజేశారు. దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సత్యసాయి: ఈనెల 26న అనంతపురంలో నిర్వహించనున్న ‘బీసీల గళం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను హిందూపురం YCP ఇంఛార్జ్ టీఎన్ దీపిక విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో బీసీలకు రాజకీయంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, సముచిత ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు.
PPM: మాదక ద్రవ్యాల వ్యసనంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి డాక్టర్ జి. నాగభూషణరావు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ జగన్ మోహనరావుతో కలిసి జిల్లా పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఇంతవరకు ఎంతమందిని డీ అడిక్షన్ కేంద్రంలో చేర్చారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
PLD: ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 115 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, మోసాలు, వేధింపులు, రోడ్డు ప్రమాదాలు తదితర సమస్యలపై వినతులు అందాయి. ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ చేసి త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్లతో ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలన్నారు. వివరాలకు 8639846568 నంబర్లో సంప్రదించాలన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు స్వీకరించబడినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి, సమస్యలను నాణ్యంగా, గడువులో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఆలస్యం, నిర్లక్ష్యానికి తావులేకుండా పని చేయాలని హెచ్చరించారు.
ATP: ప్రముఖ హేతువాది, నాస్తిక సమాజ జాతీయ నాయకులు డాక్టర్ బైరి నరేష్ సోమవారం గుంతకల్లులో “బుద్ధ విహార్” ను సందర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మంత్రాలు, తంత్రాలు అంటూ రోగాలను నయం చేస్తాం అని చెప్పేవారు ఎక్కువయ్యారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తి నాగయ్య, కె.ఎల్ స్వామిదాస్, జయరాం, శ్రీనివాసులు పాల్గొన్నారు.
VSP: జీవీఎంసీలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 55 వినతులు అందాయని అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి తెలిపారు. భీమిలి నుంచి 1, ఈస్ట్ జోన్ 13 సహా అన్ని జోన్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అధికారులందరూ వెంటనే స్పందించి నిర్ణీత కాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
VSP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మారికవలసలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న స్వర్ణాంధ్ర స్వాప్నికుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లో భోజనం రుచి చూసిన ఆయన, రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు.
ప్రకాశం: పామూరు మండలం కంబాలదిన్నె పంచాయితీ గరండల వద్ద మోపాడు రిజర్వాయర్ ప్రధాన కాలువను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ.. మోపాడు రిజర్వాయర్ ద్వారా వందలాది ఎకరాలకు నీళ్లు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా 27 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. వీటిలో 7 భూతగాదాలు, 5 కుటుంబ కలహాలు, 5 మోసాలు మరియు నగదు వ్యవహారాల కేసులు ఉన్నాయి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.