KRNL: ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో కౌతాళం (మం) ఉరుకుందలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. దర్శనం, ప్రసాదం, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం అంశాల్లో మెరుగైన సేవలతో వరుసగా మూడోసారి టాప్లో నిలిచింది. భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని డిప్యూటీ కమిషనర్ కే.వాణి తెలిపారు.
ATP: గ్రామాల్లో నిర్వీర్యమైన చెత్త నిర్వహణ యూనిట్లు, కంపోస్ట్ షెడ్లను పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా BJPఅధ్యక్షుడు రాజేష్ కలెక్టర్ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు పారిశుద్ధ్య సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. నిర్వహణ లోపం వల్ల షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర కమిషనర్ బాలకృష్ణ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బుచ్చి నూతన కమిషనర్గా ఇనమల చినబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.
KKD: తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగి ఇసరపు రాజు, సత్యవతి దంపతుల తాటాకిల్లు, ఆ పక్కనే ఉన్న గడ్డివాము దగ్ధమైంది. కొత్త ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బుతో పాటు ఇంటిలోని ప్రతి వస్తువు కాలి బూడిదైంది. కట్టుబట్టలతో మిగిలిపోయారు. సుమారు రూ.8 లక్షలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
TPT: తిరుపతి నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 27 వినతులు అందాయని అదనపు కమిషనర్ శారదా దేవి తెలిపారు. కార్యాలయానికి నేరుగా 23 మంది, ఫోన్ ద్వారా 4 మంది తమ సమస్యలు తెలియజేశారు. వాకర్స్ వే ఆక్రమణలు, కాలువ నిర్మాణం, త్రాగునీటి సమస్యలు, చెత్త నిర్వహణ వంటి అంశాలపై వినతులు రావడంతో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సత్యసాయి: పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన 10 లక్షల 22,000 వేల రూపాయుల విలువైన చెక్కులను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని తెలిపారు.
AKP: క్లాప్ మిత్రలు ప్రతిరోజు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలని ఎస్ రాయవరం మండల డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ సూచించారు. సోమవారం పెట్టగోళ్లపల్లిలో చెత్త సేకరణపై క్లాత్ మిత్రలకు అవగాహన కల్పించారు. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అలాగే, మురికి కాలువలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలన్నారు.
NDL: ఎలాంటి జీవో లేని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1085 లష్కర్ పోస్టులు భర్తీ చేయడం దారుణమని బాధితులు ఎస్. జయన్న ఆరోపించారు. నంది కొట్కూరులో ఇవాళ GO.MS 98 బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరాయి. శ్యామల మాట్లాడుతూ.. ముగ్గురు టీడీపీ ముఖ్య నాయకులు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం దారుణమని కన్నీటి పర్యాంతమయ్యారు.
విశాఖలోని 13వ వార్డు వైసీపీ కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి హాజరయ్యారు. వార్డు కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
KRNL: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి కలెక్టర్ డా.సిరి అర్జీలు స్వీకరించారు. PGRS అర్జీలు రీ-ఓపెన్ కాకూడదని, అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నూరుల్, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.
గుంటూరు జిల్లా నూతన PGRS భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని ప్రజల నుంచి 146 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని నిర్ణీత కాలంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదుదారులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించగా, పోలీస్ సిబ్బంది సహకరించారు. ప్రజలు నిస్సంకోచంగా తమ సమస్యలు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.
PLD: ముప్పాళ్ళ మండలంలోని లంకెలకూరపాడు గ్రామంలో వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని పంచాయతీ ప్రత్యేక అధికారి కేవీ శివ ప్రసాద్ (డిప్యూటీ ఎంపీడీవో) ప్రారంభించారు. గ్రామ ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ చర్యలు చేపట్టారు.
W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను సోషల్ అడిట్ బృందం సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేసింది. తాడేపల్లిగూడెంలోని వెంక్రమన్నగూడెం, రామన్నగూడెం, గ్రామలతో పాటు పెంటపాడు మండలం కోరుమిల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో 6 రోడ్లను సోషల్ అడిట్ బృందం పరిశీలించింది. నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసింది. సాంకేతిక నిపుణులు కొలతలను సేకరించారు.
VZM: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను సోమవారం జిల్లా కోర్టు విధించింది. తెర్లాం మండలానికి చెందిన హరికృష్ణపై ఆరోపణలు రుజువవడంతో రూ.3,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేసింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
PLD: కలెక్టర్ కార్యాలయాన్ని భాష్యం పాఠశాల విద్యార్థులు సందర్శించారు. కార్యాలయ పనితీరును తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని విభాగాల పనితీరు, ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదుల స్వీకరణ విధానం గురించి విద్యార్థులకు వివరించారు.