ప్రకాశం: మార్కాపురం మండలం మిట్టమీదపల్లికు చెందిన ఎరుకల కులానికి చెందిన 20 కుటుంబాలను అగ్రకులాలు గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపిస్తూ సోమవారం గ్రీవెన్స్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు మంగళవారం ఎమ్మార్వో, ఎస్సై గ్రామాన్ని సందర్శించి, విచారణ చేపట్టారు. దేవాలయంలోని మైకు ద్వారా ఎస్టీలను గ్రామంలోకి రానివ్వదని హుకుం జారీ చేశారని ఆరోపించారు.
SKLM: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని నియమించి, IR 30 శాతం ప్రకటించాలని ఆమదాలవలస పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయం ఆవరణలో ప్రధాన కార్యదర్శి బీ .జనార్ధనరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. పెన్షనర్లకు రావలసిన బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
KDP: సిద్దవటం మండలం వంతాటిపల్లి గ్రామానికి చెందిన విజయకుమారి కడపలో షాపింగ్ చేసి తిరిగి వెళ్తూ ఆటోలో రూ.5 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు నెక్లెస్ ఉన్న బ్యాగ్ను మరిచిపోయారు. ఆటో డ్రైవర్ నరసింహ రాజా బ్యాగ్ను గుర్తించి కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించాడు. సీఐ చిన్న పెద్దయ్య బాధితులను గుర్తించి నెక్లెస్ను వారికి అందజేశారు.
AKP: అభివృద్ధికి సహకరిస్తామని చెబుతున్న వైసీపీ నేతలు కేసులు వేసి వెనక గోతులు తవ్వుతున్నారని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎలమంచిలి బస్టాండ్లోకి బస్సులు రావడానికి YSR విగ్రహం అడ్డంకిగా ఉందన్నారు. దానిని కుదించాలని వారికి స్పష్టం చేసామన్నారు.
BPT: అద్దంకి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో జాన్సన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పాలకవర్గాల గడువు ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో ఈ నెలాఖరు నుంచి అద్దంకి మున్సిపాలిటీ పరిపాలన ప్రత్యేక అధికారి ఉంటారు.
PPM: ప్రజారోగ్యం దృష్ట్యా మెరుగైన ఆరోగ్య అంశాలపై అవగాహన పెంపొందించాలని జిల్లా ఎన్సీ.డి అధికారి డాక్టర్ జగన్ మోహనరావు సూచించారు. మక్కువ, సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన ఆశా డే కార్యక్రమాల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరపగా, సచివాలయాల వారిగా నివేదికలను పరిశీలించారు.
NTR: జి.కొండూరు (M) చిన్న నందిగామ గ్రామ రైతులు ఇటీవల ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందిరా ప్రియదర్శని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోతుల వాగులో నూతన పంపు హౌస్ నిర్మాణం చేపట్టాలని కోరారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, మంగళవారం ఆవాగును పరిశీలించి నూతన పంపు హౌస్ నిర్మాణానికి భరోసా ఇచ్చారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని ఎన్జీవో హోం సెంటర్లో బీసీ నాయకులు గుంటూరు తులసిరామ్ ఆధ్వర్యంలో మంగళవారం సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.
ASR: డుంబ్రిగూడలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్లకోమా కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే వ్యాధి అని వైద్యులు తెలిపారు. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే శాశ్వత అంధత్వానికి దారితీసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు, ఆశా కార్యకర్తలకు గ్లకోమా లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ATP: గుంతకల్లు షికారి కాలనీలో బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలని ప్రజలకు సూచించారు.
నెల్లూరు వనంతోపు సెంటర్కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు.
TPT: తిరుపతిలో గరుడ వారధిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ మౌర్యల సమీక్ష అనంతరం ఇకపై వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ ట్రాన్స్పోర్ట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ప్రజల భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ పాటించాలన్నారు.
VZM: జిల్లాలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులకు వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సుఖీభవ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పీఎస్వీ రామారావు మాట్లాడుతూ.. గడిచిన 20 సంవత్సరాలుగా విజయనగర ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించామన్నారు. ప్రస్తుతం నూతన సుఖీభవ ద్వారా నెంబర్ ఆఫ్ డాక్టర్స్తో సేవలు అందించనున్నట్లు తెలిపారు.
W.G: పెంటపాడు డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంగళవారం రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీవీ. కృష్ణాజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్ధులకు సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బోధన, కళాశాల అభివృద్ధిపై ఆర్జేడీ అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు.