ప్రకాశం: జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దోర్నాలలో మంగళవారం వెలిగొండ ప్రాజెక్టుపై 3 గంటల సమీక్ష నిర్వహించారు. టన్నెల్ లైనింగ్ పనులు నెమ్మదించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు తెలిపారు. ఇంధనం, కార్మికులు, యంత్రాల సమస్యలను అధిగమించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులలో అలసత్వం వహించవద్దన్నారు.
PLD: నరసరావుపేట పట్టణాన్ని పరిశుభ్రంగా, క్రమబద్ధంగా అభివృద్ధి చేయడంపై ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం మున్సిపల్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శానిటేషన్ డ్రైవ్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
TPT: నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
SKLM: హెల్మెట్ ధారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కాశీబుగ్గ పట్టణంలో అభయం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ టి భవాని మూడు రోడ్లు కూడలి వద్ద అభయం హెల్మెట్ బ్యాంక్ ప్రారంభించి వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ప్రజలంతా హెల్మెట్ ధారణను అలవాటు చేసుకుని, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు.
W.G: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతమైందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 632 దరఖాస్తులు అందగా, అందులో 235 పరిష్కరించామని, 114 దరఖాస్తులను నిబంధనల మేరకు తిరస్కరించామని చెప్పారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 283 దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
CTR: వెదురుకుప్పం, దేవరగుడిపల్లిలో పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మల్బరీ సాగుతో అధిక ఆదాయం వస్తుందని జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ తెలిపారు. పట్టు సాగుకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
AKP: పాయకరావుపేట మండలం గుంటపల్లి జడ్పీ హైస్కూల్కు చెందిన విజయోత్సవ యాత్రను మంగళవారం నిర్వహించారు. ముందుగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి స్వీట్లు పంచి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం గ్రామం నుంచి పీఎల్ పురం,వడ్డిమెట్ట, సీతారాంపురం గ్రామాల్లో విద్యార్థులు విజయోత్సవ యాత్ర చేపట్టారు.
AKP: మాడుగుల మండలం ఓమ్మలిలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో రైతులకు సంబంధించిన పాసుపుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో ముద్రించి రైతును అనేక ఇబ్బందులు గురి చేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రాజముద్ర కలిగిన పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
W.G: రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాలకు 2500 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిని రూ.34 కోట్ల మేర ఆర్థిక నష్టం కలిగిందని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో మాట్లాడారు. ప్రధానంగా మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి తోటలు దెబ్బతిన్నట్లు వివరించారు.
ATP: నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కృష్ణా జలాల పోరాట సమాలోచన సభలో వైసీపీ నేత సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. గ్రేటర్ రాయలసీమకు జీవనాడి వంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి CM చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
అన్నమయ్య: చిట్వేల్ మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు లారీ సుబ్బారాయుడు రాష్ట్ర కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులను కలిశారు. మండలంలో నెలకొన్న అభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలపై సమగ్రంగా వివరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నాయకులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని అంగన్వాడి కేంద్రం -7 నందు మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PD నాగమణి పాల్గొన్నారు. తొలుత ఆమె కిశోర బాలికలతో కలిసి ర్యాలీ చేపట్టారు. కిశోర వికాసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమం జూన్ 7వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
PPM: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీరఘట్టం కానిస్టేబుల్ పి.రవి కుటుంబానికి ఇవాళ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి GPAI ద్వారా మంజూరైన రూ.20.65 లక్షలను అందజేశారు. అనంతరం కానిస్టేబుల్ సతీమణి లలితకు ధైర్యం చెప్పారు. పిల్లల భవిష్యత్కు ఈ నగదును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
NTR: విజయవాడ నగరపాలక సంస్థలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధనపై కమిషనర్ ధ్యానచంద్ర కన్సల్టెంట్లతో సమావేశమయ్యారు. నగరానికి వచ్చే 15 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా (రూ.319 కోట్లు), భూగర్భ డ్రైనేజ్ (రూ.733 కోట్లు) ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్రం 25%, రాష్ట్రం 25% నిధులు అందించగా, మిగతా 50% మున్సిపల్ బాండ్లు, బ్యాంకుల ద్వారా సమీకరించనున్నారు.
కోనసీమ: ఉపాధి కోసం ఖతర్ వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న కొమరాడకు చెందిన కనకదుర్గ సురక్షితంగా స్వగ్రామం చేరుకున్నారు. అక్కడ యజమానుల వేధింపులు, ఆహార సమస్యలతో సతమతమవుతున్న ఆమె దీనస్థితిని భర్త నాగరాజు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మహేష్ కుమార్ తక్షణమే స్పందించి, దౌత్య మార్గాల ద్వారా ఆమెను రప్పించడంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు.