కృష్ణా: సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలు, మార్ఫింగ్ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎం జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
VSP: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సీతంపేటలో ఆయనను జర్నలిస్టుల జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సత్కరించి సింహాద్రినాథుడి జ్ఞాపిక అందజేశారు. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని పల్లా హామీ ఇచ్చారు.
VZM: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైన గంట్యాడ శ్రీదేవి శుక్రవారం ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలో తనకు ఈ గౌరవప్రదమైన పదవిని దక్కేలా ప్రోత్సహించినందుకు ఆమె హర్షం వ్యక్తం చేశారు.
అన్నమయ్య: జిల్లా ఖజానా ఆదాయం పెంపు లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంపుతో ఆదాయ వృద్ధి సాధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
W.G: రాష్ట్రంలో ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు తన కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఈ నమోదు చేపట్టారు. నరసాపురం ఆర్డీవో దాసురాజు మంత్రికి ఈ విధానం, ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.
NLR: కూటమి పాలనలో సంక్షేమం కరువైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం గొట్లపాలెం, పిడూరులో ఆయన పర్యటించారు. చంద్రబాబుకు అమరావతిలో దోపిడీ తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. ఎన్నికలకు ముందు సూపర్-6 వంటి హామీలు ఇచ్చి ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని విమర్శించారు.
KRNL: జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి స్వీయ గణన పద్ధతిలో ఇవాళ కర్నూలులో తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ప్రజలందరూ జనగణనలో తప్పనిసరిగా పాల్గొని, తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆమె సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి సరైన గణాంకాలు లభించి అభివృద్ధి కార్యక్రమాల అమలు సులభమవుతుందని స్పష్టం చేశారు.
KDP: దువ్వూరు రైతు సేవా కేంద్రం వద్ద జొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ నాగసుధ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రబీలో సాగు చేసిన జొన్న పంట ఈ-క్రాప్లో నమోదైన రైతులు ప్రభుత్వ మద్దతు ధరతో (క్వింటా రూ.3699) కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవచ్చన్నారు. ఇందు కోసం రైతు సేవా కేంద్రం పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
కోనసీమ: జన గణన దేశ భవిష్యత్తుకు పునాదని, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి ప్రణాళికలకు ఎంతో కీలకమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం మారేడుబాక గ్రామంలో జనగణనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తొలి విడతగా ఇళ్ల జాబితా, వసతుల స్వీయ గణన జరుగుతుందన్నారు.
CTR: చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో అక్రమ మైనింగ్, రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల్లో పత్రాలు లేకుండా గ్రానైట్ తరలిస్తున్న ఒక లారీతో పాటు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రకాశం: కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో పొగాకు గూడెం నందు పేకాట ఆడుతున్న 9 మందిని ఎస్సై శివ నాగరాజు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 9,330 స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై శివ నాగరాజు హెచ్చరించారు. మత్తుపదార్థాలకు, పేకాటకు యువత దూరంగా ఉండాలని సూచించారు.
కృష్ణా: గన్నవరం ఎస్ఎం కళ్యాణ మండపంలో హజ్ యాత్రికులకు అందుతున్న సదుపాయాల గురించి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హజ్ కమిటీ సభ్యులను శుక్రవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్వహిస్తున్న హజ్ యాత్రలో భాగంగా యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
CTR: భారత జనగణన-2027లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వయం గణన, మే 1 నుంచి 30 వరకు ఇంటింటి గణన జరుగుతుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. జనగణన సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అడగరని స్పష్టం చేస్తూ, అలాంటి వివరాలు కోరితే ఇవ్వవద్దని ప్రజలకు హెచ్చరించారు.
ATP: గుంతకల్లు DLDOగా పనిచేస్తున్న పి.విజయలక్ష్మి పదోన్నతి పొంది, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారని జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు.
సత్యసాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాల తీరును మంత్రి సత్యకుమార్ యాదవ్ ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’గా అభివర్ణించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ కూటమి, బిల్లు విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. దేశ మహిళలకు జరిగిన ఈ ద్రోహాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.